షాద్నగర్ టౌన్, ఫిబ్రవరి 17: సకల జీవకోటికి ప్రాణాధారం మొక్కలు. మొక్కలను కాపాడుకుంటే అవి మనకు ఫలాలను అందించడంతోపాటు స్వచ్ఛమైన గాలినిస్తాయి. మొక్కలతో రాష్ట్రమంతా పచ్చదనం ఉట్టిపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంతో ప్రతి ఏడాది రాష్ట్రంలో ‘హరితహారం’ పండుగ వాతావరణాన్ని తలపించేలా సాగుతున్నది. దీని ద్వారా సకాలంలో వర్షాలు కురుస్తుండటంతోపాటు పాడిపరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందింది. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలోని పరిగి రోడ్డు డివైడర్ మధ్యలో, షాద్నగర్ నుంచి హైదరాబాద్ పాత జాతీయ రహదారికి ఇరువైపులా, వార్డుల్లో నాటిన హరితహారం మొక్కలు మున్సిపాలిటీకి సరికొత్త అందాన్ని తీసుకొచ్చాయి. డివైడర్ మ ధ్య, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు ప్రతిరోజూ సిబ్బంది నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. అదే విధంగా మొక్కల చుట్టూ ఏర్పాటు చేసిన సిమెంట్ రింగులు, మొక్కలకు రంగులు వేశారు. మొక్కల పెంపకంపై అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో నేడు మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి. మొక్కలను సంరక్షించడంపై పట్టణవాసులతోపాటు వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హరితహారంలో భాగంగా డివైడర్ మధ్యలో నాటిన మొక్కలకు ప్రతిరోజూ సిబ్బంది నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. దీంతో అవి ఏపుగా పెరిగాయి. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షించాలి.
-పిన్నమోని గోపాల్, షాద్నగర్
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలు మారి నీడను, స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నా యి. సకల జీవకోటికి ప్రాణాధారం మొక్కలు. రోడ్డుపై ఏపుగా పెరిగిన మొక్కలు రాకపోకలు సాగించే వారిని ఆకట్టుకుంటున్నాయి.
-రాధాకృష్ణ, షాద్నగర్
పరిగి రోడ్డు డివైడర్ మధ్య లో నాటిన హరితహారం మొక్కలు ఆ రోడ్డులో వెళ్లే వారిని ఆకట్టుకుంటున్నా యి. మొక్కలు ఏపుగా పెరుగడం సంతోషంగా ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలి. నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాలి. – జయంత్కుమార్రెడ్డి,
మున్సిపల్ కమిషనర్ షాద్నగర్