నవాబుపేట, ఫిబ్రవరి 25 : ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో దాతాపూర్ గ్రామ రూపురేఖలు మారాయి. అభివృద్ధిలో పరుగులు తీస్తూ చుట్టుపక్క గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. పల్లెంతా పరిశుభ్రం, పచ్చదనంలో కళకళలాడుతున్నది. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, గ్రామస్తులు అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారు. పల్లె ప్రకృతితో వనంతో పాటు డంపింగ్యార్డ్ను ఏర్పాటు చేసి తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువుగా మార్చడానికి సెగ్రిగేషన్ షెడ్ను నిర్మించారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్తో నిత్యం చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. పంచాయతీ అవసరాలకు కొత్తగా రూ.6.31 లక్షలతో ట్రాలీ, ట్యాంకర్ను కొనుగోలు చేశారు. గ్రామంలో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు భూగర్భ డ్రైనేజీని నిర్మించారు. గ్రామపంచాయతీ నిధులతో వీధుల్లో డబుల్ సీసీ రోడ్లను వేశారు. గ్రామంలోని ప్రతి వీధిలో విద్యుత్ దీపాలు అమర్చడంతో రాత్రిపూట జిగేల్మంటున్నాయి.
ఉపాధిహామీ పథకం కింద రూ. 12 లక్షలతో వైకుంఠధామాన్ని నిర్మించారు. ప్రత్యేకంగా మహిళలకు, పురుషులకు వేర్వేరుగా స్నానాల గదులను నిర్మించారు. దహన సంస్కారాలకు ఒక్కపుడు సరిపడా స్థలం ఇబ్బందులు పడేవారు. వైకుంఠధామం నిర్మాణంతో సమస్య పరిష్కారమైంది.
ఉపాధిహామీ పథకం నిధులు రూ.2.5 లక్షలతో కంపోస్టుయార్డును నిర్మించారు. నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి కంపోస్టుయార్డుకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తను సేంద్రియ ఎరువుగా తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్థ్ధాలు డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు.
పల్లెప్రకృ వనంలో 700 మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల పండ్లు, పూలు, డిజైన్ మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నిత్యం పంచాయతీ ట్యాంకర్తో నీళ్లు పోసి మొక్కలను సంరక్షిస్తున్నారు. మొక్కలు ఏపుగా పెరుగడంతో పల్లె ప్రకృతి వనం చిట్టడవిని తలపిస్తున్నది.
గ్రామంలోని నర్సరీలో వచ్చే హరితహారానికి సరిపడా మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. నర్సరీలో వివిధ రకాల మొక్కలు 45వేల వరకు ఉన్నాయి.
గ్రామ రోడ్లకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా 1000 మొక్కలు నాటారు. దాతాపూర్ పరిధిలో నవాబుపేట మండలానికి వెళ్లే దారిలోమొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందిస్తున్నారు.
తాగునీటితో ఏ ఒక్కరూ కూడా ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వ నిర్ణయంతో మిషన్ భగీరథ కింద ఇంటింటికీ నల్లాలను బిగించారు. ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంకులు నుంచి నిత్యం సరిపడా తాగునీటిని సరపరా చేస్తున్నారు. గతంలో బోరు నీరు, చేతిపంపులు, చేదుడుబావుల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడేవారమని, ఇప్పుడు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేవని గ్రామ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పాలకులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటాం. ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించాం. మిషన్ భగీరథతో తాగునీటిని సరఫరా చేస్తున్నాం. ప్రతి వీధిలో విద్యుత్ దీపాలను అమర్చాం. వైకుంఠధామం, పల్లె ప్రకృతివనం, కంపోస్టుయార్డు, డంపింగ్యార్డు, వాటర్ ట్యాంకుల నిర్మాణాలనూ పూర్తి చేశాం.
– బల్వంత్రెడ్డి, దాతాపూర్ సర్పంచ్
‘పల్లె ప్రగతి’ కార్యక్రమంతో ఒక్కో అభివృద్ధి పని పూర్తి కావడంతో పల్లె రూపురేఖలు మారాయి. ఒకప్పుడు గ్రామంలో సమస్యలు రాజ్యమేలేవి. ప్రస్తుతం ఏ వీధి చూసినా సీసీ రోడ్డు, డ్రైనేజీలతోపాటు ఎక్కడా చెత్త లేకుండా శుభ్రంగా ఉన్నాయి. గ్రామస్తులకు ఏ అవసరమోచ్చిన సర్పంచ్, సెక్రటరీ అందుబాటులో ఉంటున్నారు. – గోపాల్ రెడ్డి రైతు