‘సీఎం కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి… దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమున్నది..’ అని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా సమన్వయ కర్త, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. శనివారం యాచారం మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ శ్రేణులంతా ఏకతాటిపై ఉండి, పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారన్నారు. తెలంగాణ వచ్చాకే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మహర్దశ వచ్చిందన్నారు. ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా యాచారం మండల కేంద్రం బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలతో గులాబీమయమైంది. అంతకుముందు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు.
రంగారెడ్డి, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ పాలన దేశవ్యాప్తంగా ఆదర్శనీయంగా కొనసాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా సమన్వయకర్త, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం శనివారం యాచారంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి నేతృత్వంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రమణ విచ్చేశారు.
ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడ్పాటును ఇవ్వడంలేదని, అలాంటి ప్రభుత్వాలను కూల్చేందుకు కుయుక్తులను పన్నుతున్నదన్నారు. కేంద్రంలోనూ మన ప్రాతినిథ్యం, బలం చూపించాలనే మంచి సంకల్పంతో మన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని, ఇందుకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మనమంతా నిలవాలన్నారు. పార్లమెంట్లోనూ మన సత్తా ఏంటో చూపించే రోజులు దగ్గరపడుతున్నాయని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోని పలు సామాజిక వర్గాల కోసం పలు రకాల సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలులోకి తీసుకొచ్చారని తెలిపారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఎన్నో ప్రభుత్వాలు, ప్రధానులు, పాలకులు వచ్చిన్రు.. పోయిన్రు. ప్రజల గురించి, రైతుల గురించి, పలు సామాజిక వర్గాల గురించి పట్టించుకున్న ప్రభుత్వాలు, పాలకులేరి? ప్రపంచ చరిత్రలో ఎక్కడా వెతికినా దొరకని విధంగా రైతుల సంక్షేమం నిమిత్తం ‘రైతు బంధు, బీమా’, కుల వృత్తులు అంతరించి పోకుండా, ప్రజల సంక్షేమానికి వివిధ అభివృద్ధి పథకాలను అందుబాటులోకి తెచ్చింది.. 9 యేండ్లుగా తెలంగాణను పాలిస్తున్న ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రమణ పేర్కొన్నారు.
గత తొమ్మిదేండ్ల కిందటి ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి, ఇప్పటి నియోజకవర్గానికి ఎంతో తేడా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణను కోరుతున్నప్పుడు గత పాలకులు, మీకు పాలన, విద్యుత్, నిధులు, నీళ్లు రావు అని ఎంతో ఎగతాళి చేసిన్రు. నేడు పరిస్థితులు ఎట్లున్నయో.. ఒకసారి మనం అర్థం చేసుకోవాలె.
కేసీఆర్ ఆధ్వర్యంలో మనమంతా అడుగులు కదిపినం. సమష్టి కృషితోనే ఇదంతా సాధ్యమైందన్నారు. కేసీఆర్ మహా నాయకుడు. రాష్ర్టాన్ని పొరుగు రాష్ర్టాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నరు. దేశంలో ఎక్కడా లేని విధంగా, తెలంగాణ పాలన కొనసాగుతున్న సచివాలయాన్ని నిత్యం ఆ మహానుభావుడు ‘బీఆర్ అంబేద్కర్’ చూసేలా 125 అడుగుల ఎత్తు గల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని, సచివాలయానికి సైతం ఆయన పేరును పెట్టుకున్నం. ఎంతో మంది ఉద్యమించి, అసువులు బాసి, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరుల స్మృత్యర్థం ‘అమర జ్యోతి’ని సచివాలయ సమీపంలో నిర్మించుకుంటున్నం. అమరులు కూడా తెలంగాణ పారదర్శక పాలనను చూస్తుండాలి అనే కోణంలో పలు నిర్మాణాలు చేసుకున్నామని తెలిపారు. కిషన్రెడ్డి తనకు మంచి స్నేహితుడని, గతంలో తాము సాగు, తాగునీరు కోసం 500 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంతం అభివృద్ధి పథంలో పయనించేందుకు మన నాయకుడు, సీఎం కేసీఆర్ ఇంటింటికీ సంక్షేమ – అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి వాటిని అమలు చేస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందుతున్నాయా? లేదా? అనే ఆత్మీయ పరిశీలన కోసం, ప్రతి కుటుంబానికి అభివృద్ధి పథకాలు చేరువవుతున్నాయా? లేదా?, ప్రజలు పలు పథకాల నుంచి లబ్ధి పొందుతున్నారా? లేదా? అన్న ధోరణిలోనే ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఆరేడేండ్ల క్రితం నియోజకవర్గంలో పరిస్థితులు ఎట్లుండే? ఇప్పుడెట్లున్నయ్? అని ఒకసారి పరిశీలించి చూసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభివృద్ధికి బాటలు వేస్తూ, తెలంగాణ రాష్ర్టాన్ని పురోగమనం దిశగా పయనించేలా చేస్తున్నారు. ఇంటింటికీ మంచినీళ్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ఎన్నో పథకాల నుంచి నేడు మనం లబ్ధి పొందుతున్నామని, జిల్లా, నియోజకవర్గ అభివృద్ధికి రూ.2,390 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను జరిపించుకున్నామని పేర్కొన్నారు. బస్తీలు, గ్రామ గ్రామానికి కమ్యూనిటీ హాల్స్, యువత, మహిళలకు పలు రకాల అభివృద్ధి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి అమలుపర్చుకున్నామని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీర్, మంత్రి కేటీఆర్లను కుతంత్రాలకు పాల్పడుతున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తి పోస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్లవి కుఠిల రాజకీయాలని, వాటిని నమ్మే పరిస్థితి లేదన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆ రెండు పార్టీలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయన్నారు. 70 ఏండ్ల కాంగ్రెస్, 10 ఏండ్ల బీజేపీ పాలనలో ఏమీ చేయలేదని, వారు చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని పేర్కొన్నారు. రైతులకు 24 గంటల విద్యుత్, రైతు బంధు, బీమా లాంటి ఎన్నో పథకాలు ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ఆచరణలోకి తీసుకొచ్చారని తెలిపారు. రాజకీయంగా చైతన్యం ఉన్న గడ్డ ఇబ్రహీంపట్నం అని, ఈ నియోజకవర్గానికి వచ్చిన ఏ కంపెనీ వెనక్కుపోదని పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ ఎక్కడికీ పోదని, మేడిపల్లి, కుర్మిద్దలలో బఫర్ జోన్ అనేదేం లేదని అన్నారు. ఎవ్వరికీ ఎక్కడా నష్టం రాదని, స్థానికంగా ఉన్న ప్లాట్లను ఎవ్వరూ అమ్ముకోవద్దని ప్రజలనుద్దేశించి తెలిపారు. కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట దేశవ్యాప్తంగా పెరిగిందన్నారు. మైనార్టీల కబర్స్తాన్ నిమిత్తం రెండెకరాల స్థలం ఇప్పిస్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాజేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా, సర్పంచ్లు ఉదయశ్రీ, కృష్ణ, సంతోష, ఇందిర, విజయలక్ష్మి, నర్సిరెడ్డి, ఎంపీటీసీలు శివలీల, ఇస్రత్బేగం, సుమతమ్మ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మల్లేశ్, గణేశ్, శంకర్నాయక్, పీఏసీఎస్ డైరెక్టర్లు శశికళ, స్వరూప, బీఆర్ఎస్ నాయకులు శేఖర్రెడ్డి, యాదయ్య, రాజూనాయక్, యాదయ్యగౌడ్, ఖాజా, శివ, జానీ, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
యాచారం : బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ అధ్యక్షతన శనివారం మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల నుంచి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తరలిరావడంతో ఫంక్షన్ హాల్ పరిసరాలు గులాబీమయమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ రమణ హాజరయ్యారు. అంతకు ముందు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ జంగమ్మ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డితో కలిసి మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, డీజే పాటలతో మండల కేంద్రం మార్మోగింది. ర్యాలీలో గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులతో చేసిన నృత్యాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గులాబీ జెండాను ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆవిష్కరించారు. మొదటిసారి మండలానికి విచ్చేసిన ఎమ్మెల్సీ రమణను పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. మొత్తంగా మండలంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమ సంబురం అంబరాన్నంటింది.
దేశానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ అన్నారు. బీఆర్ఎస్తో రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీతో దేశంలో ఉన్న సమస్యలు తొలగించడంతోపాటు అభివృద్ధికి పెద్దపీట వేయాలనేదే సీఎం కేసీఆర్ తపన అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధితో ప్రపంచమే తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో శాంతి భద్రతలు కరువయ్యాయన్నారు. అంబేద్కర్ 125అడుగుల విగ్రహం, నూతన సచివాలయం, అమరవీరుల స్మృతివనం చరిత్రలో నిచిపోతాయన్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి సైనికుల్లా కార్యకర్తలు పనిచేయాలని ఆయన కోరారు. 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను 8 ఏండ్లలో ఎక్కడాలేని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించాడన్నారు. ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ గెలుపు కోసం రానున్న ఆరు నెలలు బీఆర్ఎస్ నాయకులు, కార్యక్తలు నిర్విరామంగా కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. బీఆర్ఎస్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని, మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న ప్రజాసమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రగతి నివేదన పాదయాత్ర మండలంలోని నందివనపర్తి గ్రామం నుంచే చేపట్టినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంతో మొదలుకొని ప్రతి మంచిపనిని మండలం నుంచే ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రగతి నివేదన యాత్రలో రాత్రి, పగలు వెన్నంటే ఉండి కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్లు ఆయన తెలిపారు. ఇబ్రహీంపట్నం గడ్డమీద మరోమారు బీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ హయాంలో గత ఎనిమిదేండ్లుగా రైతులకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు, ప్రమాదవశాత్తు మృతి చెందిన రైతు కుటుంబానికి రూ.5లక్షల తక్షణ సాయం కింద రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ రైతు సమస్యలను పరిష్కరించడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీతో కృషి చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఇతర రాష్ర్టాల రైతు కుటుంబాలకు నష్టపరిహారం అందించిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. రైతులందరూ కేసీఆర్ వెన్నంటే ఉండటం ఖాయమన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు.
మండలంలో ప్రతి విషయంలో అనవసరంగా జోక్యం చేసుకొని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్న బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు నీతిమాలిన రాజకీయాలను వెంటనే మానుకోవాలన్నారు. కేంద్రంలో బీజేపీ సర్కారు చేస్తున్న అరాచకాలు, అక్రమాలను పక్కనబెట్టి రాష్ట్రంలో ఆదర్శంగా కొనసాగుతున్న కేసీఆర్ పాలనను విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే కిషన్రెడ్డిని విమర్శించే స్థాయి స్థానిక కాంగ్రెస్, బీజేపీ నాయకులకు లేదన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందనడం తెలివి తక్కువతనమన్నారు. కేంద్రం వాటా ఉంటే తెలంగాణ పథకాలు దేశంలో ఎందుకులేవన్నారు. ప్రదానీ మోదీ అదానీ, అంబానీల మోచేతినీళ్లు తాగుతున్నారన్నారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశాన్ని చాయ్ అమ్మినట్లుగా అమ్మడం ఖాయమని వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు.