శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 8: డ్రగ్స్ విక్రయదారులపై సైబరాబాద్ పోలీసులు డేగ కన్ను పెట్టారు. కమిషనరేట్ పరిధిలో మత్తు పదార్థాల విక్రయంతో పాటు వినియోగంపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రగ్స్ విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా టీ-న్యాబ్ వ్యవస్థ పనిచేస్తుండగా.. సైబరాబాద్లో ఎస్ఓటీ పోలీసులు సైతం మత్తు మాఫియాకు అడ్డుకట్టవేస్తున్నారు. ఈ క్రమంలోనే పబ్బులకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకొని డ్రగ్స్ను విక్రయిస్తున్న ఇద్దరిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.8 లక్షల విలువైన 21.788 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్, 874.316 గ్రాముల గంజాయితోపాటు మారుతీ సీయాజ్ కారు, 2 సెల్ఫోన్లు, 2 డిజిటల్ వెయింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నారు.
గురువారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వినీత్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. కొండాపూర్కు చెందిన మారం పవన్కుమార్ అలియాస్ మచ్చ పవన్(31), జొమోటో డెలివరీ బాయ్ ఆదర్శ్ కుమార్ సింగ్(21) డ్రగ్స్ దందా చేస్తున్నారు. కొంతకాలంగా వీరు కొండాపూర్ శిల్పాపార్కు కాలనీ ప్రధాన రహదారి సమీపంలో డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, లా లాండ్ ఆర్డర్ పోలీసులు గురువారం దాడి చేశారు.
నిందితులు పవన్కుమార్, ఆదర్శ్కుమార్లను అదుపులోకి తీసుకుని, సోదాలు నిర్వహించారు. వారి నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ ఇతర ప్రాంతాల్లో తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి.. ఆ డ్రగ్స్ను ఎక్కువ ధరకు నగరంలో విక్రయిస్తున్నారు. నిందితులిద్దరూ నగరంలో ఎవరెవరికీ డ్రగ్స్ విక్రయిస్తున్నారు.. వారు ఎక్కడున్నారు.. అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వారిని కూడా గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.
నగరంలో పబ్స్కు వెళ్లే యువతను లక్ష్యంగా చేసుకొని కొందరు డ్రగ్స్ విక్రయిస్తున్నారని, వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని మాదాపూర్ డీసీపీ వినీత్ అన్నారు. డ్రగ్స్, గంజాయి ఎవరైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వారి సమాచారం పోలీసులకు ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. డయల్ 100, యాంటి డ్రగ్స్ అభ్యూస్ హెల్ప్లైన్ 9492099100, ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ 7901105423, సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444లలో సంప్రదించాలని సూచించారు. డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్లు సైతం తమను సంప్రదిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి.. వారికి సరైన యాంటీ డ్రగ్స్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ ఫ్రీ సొసైటీగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.