Polymer Notes : దేశంలో త్వరలో పాలిమర్ కరెన్సీ నోట్లు (Polymer Currency Notes) చెలామణిలోకి రానున్నాయి. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను క్షేత్రస్థాయి ప్రయోగాల కోసం జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) ఆమోదం తెలిపింది. ఒక్కో డినామినేషన్ (Denomination) లో వంద కోట్ల చొప్పున నోట్లను ప్రయోగాత్మకంగా జారీచేసే ప్రతిపాదనను ఆమోదించినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) నేడు పార్లమెంటుకు వెల్లడించారు.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు సిఫార్సు మేరకు ‘ఆర్బీఐ చట్టం-1934’ లోని సెక్షన్ 25 ప్రకారం ఈ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. ఈ క్షేత్రస్థాయి ప్రయోగాలు విజయవంతమైతే భవిష్యత్తులో ఈ రెండు విలువల్లోని పాలిమర్ నోట్లను క్రమబద్ధంగా జారీచేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం చెలామణిలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో వీటిని తీసుకురావడం లేదని, వాటితో పాటే ఈ కొత్త నోట్లు కూడా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టంచేసింది.
అయితే పాలిమర్ నోట్ల సేకరణ ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని ఆర్బీఐ పేర్కొన్నది. అందువల్ల వీటిని ఎప్పుడు ప్రవేశపెడతారు..? దీనికి ఎంత ఖర్చవుతుంది..? అనే విషయాలపై ఇప్పుడే కచ్చితమైన వివరాలు చెప్పలేమని తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే, కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.