హయత్నగర్ రూరల్, ఏప్రిల్ 21 : రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలో గత నెల చివరివారం జాతీయ రహదారి మీద బైక్పై భార్యాభర్తలు వెళ్తున్నారు. వెనుకనుంచి వేగంగా వచ్చిన ఓ చైన్ స్నాచర్ మహిళ మెడలోని బంగారు గొలుసును లాగే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో మహిళ బైక్పై నుంచి కిందపడి గాయపడింది. మళ్లీ తిరిగొచ్చిన స్నాచర్.. నాలుగు తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. కానీ, వెంటనే అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు స్పందించారు. సీసీ కెమెరాల ఆధారంగా ఇతర పోలీసుల సహకారంతో గంటల వ్యవధిలో స్నాచర్ను కటకటాల్లోకి పంపారు.మండలంలోని బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన ఓ వాహనదారుడు తప్పించుకునేందుకు వేగంగా వెళ్లిపోయాడు. కానీ, ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ద్వారా ఆ బండిని పోలీసులు పట్టుకున్నారు. సీసీ కెమెరాలు ఊరూరా నిఘా నేత్రాలుగా పనిచేస్తున్నాయి. ఎక్కడ ఏ ఘటన జరిగినా సాక్ష్యంగా నిలుస్తున్నాయి. నిందితులను పట్టుకోవడంలో ఎంతగానో సహకరిస్తున్నాయి. గొడవలను పరిష్కరించేందుకు తోడ్పాటును అందిస్తున్నాయి. స్థానికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. అబ్దుల్లాపూర్మెట్ మండలానికి దాదాపు 10 కిలోమీటర్ల మేర జాతీయరహదారి ఉన్నది. ఓఆర్ఆర్, సర్వీస్ రోడ్డు, ఇతర రహదారులు వేరుగా ఉన్నాయి. మెట్టు పోలీసులు ప్రతి ఊరిలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలతోపాటు హత్యలు, ఇతర గొడవలకు గల కారణాలను ఇట్టే పట్టేస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నారు. ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్).. రోడ్లపై వెళ్తున్న ప్రతి వాహనం నంబర్ను పక్కాగా గుర్తిస్తున్నది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలకు కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ప్రమాదాల నివారణపై దృష్టి పెడుతున్నారు.
ఊరూరా సమావేశాలు
అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పెద్దలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని సూచిస్తున్నారు. వాటిని ఏర్పాటు చేయించేందుకు ముందుకొచ్చేవారిని ప్రోత్సహిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. నేరాలను అదుపుచేయవచ్చని చెబుతున్నారు. కెమెరాల ఏర్పాటుతో గొడవలకు దిగేవారు సైతం కొంచెం వెనక్కి తగ్గే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు. స్టేషన్ పరిధిలోని పలు గ్రామాల్లో 316 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. జాఫర్గూడ, మజీద్పూర్ మినహా స్టేషన్ పరిధిలోని చాలా గ్రామాల్లో సీసీ కెమెరాలు బిగించారు. మరో మూడు గ్రామాల్లో కెమెరాల బిగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మెట్టు మెయిన్ రోడ్డు, బీసీ కాలనీలో కలిపి 28 సీసీ కెమెరాలను ఏర్పాటుచేయించారు. బాటసింగారం, కవాడిపల్లి గ్రామాల్లో 28 సీసీ కెమెరాల చొప్పున, తారామతిపేటలో 27, బండరావిరాలలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
నేను సైతం..
ప్రధాన రహదారులు, గ్రామాల్లోని కూడళ్లలో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితోపాటు గ్రామాల్లోని దుకాణ యజమానులు, హోటళ్లు, పెట్రోల్ బంకులు తదితర వ్యాపార సముదాయాల వద్ద యజమానులే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించేలా పోలీసులు నేను సైతం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దుకాణ యజమానులు మూడు కెమెరాలను షాప్ కోసం, ఒక కెమెరాను మాత్రం రోడ్డు కనిపించేలా ఏర్పాటు చేయించడం దీని ఉద్దేశం. ఈ కార్యక్రమానికి సైతం మండలంలో మంచి స్పందన లభిస్తున్నది.
నిత్యం పర్యవేక్షణ
సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడమే కాదు.. వాటి పర్యవేక్షణపైనా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. స్టేషన్లోని ఓ కానిస్టేబుల్ను సీసీ కెమెరాల పర్యవేక్షణకు కేటాయించారు. ఎక్కడెక్కడ పాడయ్యాయి, సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా? ఇంకేమైనా మరమ్మతులు చేయాలా అనేది చూసుకుంటున్నారు. ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వెంటనే వాటిని తనిఖీ చేస్తున్నారు.
ప్రమాదాలకు కారణాలను గుర్తిస్తున్నాం..
సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ప్రమాదాలకు కారణాలను గుర్తిస్తున్నాం. వాటిని విశ్లేషించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బాధితులకు అండగా నిలుస్తున్నాం. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు, చైన్ స్నాచింగ్ కేసులను వెంటనే ఛేదిస్తున్నాం. గొడవలకు కారణాలను గుర్తిస్తూ.. గ్రామాల్లో మంచి వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులు, గ్రామాల పెద్దల సహకారంతో ఇప్పటికే స్టేషన్ పరిధిలో 316 కమ్యూనిటీ సీసీ కెమెరాలను ఏర్పాటుచేయించాం. కొత్త టెక్నాలజీని వినియోగించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం.
– వాసం స్వామి, సీఐ, అబ్దుల్లాపూర్మెట్