తెలంగాణ ప్రభుత్వం విద్యారంగంలో సమూల మార్పులను తీసుకొస్తున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని చేపట్టి సర్కారు బడులను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నది. 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీల నిర్మాణం, కిచెన్ షెడ్లు, శిథిలమైన తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే పనులు పూర్తైన స్కూళ్ల ప్రారంభోత్సవాలు నేటి నుంచి జరుగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం మంత్రి సబితాఇంద్రారెడ్డి కందుకూరు మండలం రాచులూరు గ్రామంలో నిర్మించిన మండల ప్రజా పరిషత్ పాఠశాలను ప్రారంభించనున్నారు. ఉమ్మడి జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ కింద మొదటి విడుతలో ఎంపికై పనులు పూర్తైన ఆయా పాఠశాలలను ప్రజాప్రతినిధులు ప్రారంభించనున్నారు.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
నేడు జిల్లాలో విద్యా శాఖ మంత్రి పర్యటన
రంగారెడ్డి, జనవరి 31(నమస్తే తెలంగాణ): విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా కందుకూరు మండలం రాచులూరు గ్రామంలో నిర్మించిన మండల ప్రజా పరిషత్ పాఠశాలను ప్రారంభించనున్నారు. సాయంకాలం 4 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
షాబాద్, జనవరి 31 : ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే ప్రణాళికలకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. మన ఊరు- మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏయే పాఠశాలలకు ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలని అనే వివరాలు తెప్పించుకుంది. ఏయే బడులకు ఎన్ని నిధులు కేటాయించాలని ప్రణాళికలను రూపొందించి పాఠశాలలను ఎంపిక చేసింది. అందులో భాగంగానే ప్రభుత్వం మొదటి దశలో మొయినాబాద్ మండలంలోని 18 పాఠశాలలను మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన వీటిలో రెండు పాఠశాలను మోడల్గా తయారు చేయడానికి నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే ఆ పాఠశాలల్లో పనులు పూర్తి చేశారు.
మండలంలో 18 పాఠశాలల ఎంపిక
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మన ఊరు మన బడిలో భాగంగా మండలంలో 18 పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో పెద్దమంగళారం, చిలుకూరు, హిమాయత్నగర్, అజీజ్నగర్, బాకారం, తోలుకట్ట, చిన్నమంగళారం, కనకమామిడి గ్రామాలలో ప్రభుత్వం జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అలాగే మొయినాబాద్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, మేడిపల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలను మన ఊరు-మన బడి కింద ఎంపిక చేశారు. ఈ పాఠశాలలను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. ఆయా పాఠశాలలో ఏయే సౌకర్యాలు అవసరం ఉన్నాయో ముందే సంబంధిత అధికారులు ఆన్లైన్లో పొందుపర్చారు. అవసరం ఉన్న సౌకర్యాల మేరకు మన ఊరు…మన బడి కింద నిధులు ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాల్లో అభివృద్ధి చెందితే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను లభించే అవకాశం ఉందని పలువురు అనుకుంటున్నారు.
మోడల్ పాఠశాలలుగా
అజీజ్నగర్లోని ప్రాథమిక పాఠశాల, పెద్దమంగళారంలోని ప్రాథమిక పాఠశాలలను మోడల్గా తయారు చేయడానికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయడంతో పనులు చేపట్టారు. అజీజ్నగర్లో పాఠశాల భవనానికి ఫ్లోరింగ్ చేయించారు. రంగులు కూడా పూర్తి చేశారు. అదే విధంగా కరెంట్ పనులు సైతం పూర్తి చేశారు. అదే విధంగా పెద్దమంగళారం పాఠశాలలో కూడా పనులు పూర్తి అయ్యాయి. గోడలకు వాల్ పెయింటింగ్ వేయాల్సి ఉంది.
కడ్తాల్ మండలంలో మొదటి విడుతలో 16 పాఠశాలలు ఎంపిక
కడ్తాల్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో పాఠశాలలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నాయి. అందులో భాగంగా కడ్తాల్ మండలంలో మొదటి విడుతలో 16 జిల్లా పరిషత్, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలు ఎంపిక చేశారు. ఆయా పాఠశాలలో రూ.2.50 కోట్లతో పనులు చేపట్టారు. ఆయా పాఠశాలల్లో అదనపు గదులు, నీటి సౌకర్యం, తరగతి గదులకు తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు, ఫ్లోరింగ్ బండలు, నీటి సంపులు, మరుగుదొడ్లు, ఎలక్ట్రిక్ వర్క్, పెయింటింగ్ పనులు పూర్తయ్యాయి. దీంతో పాఠశాలలకు కొత్త కళ వచ్చింది.
రూ.10 లక్షలతో చెట్టుపల్లితండా పాఠశాల అభివృద్ధి
బొంరాస్పేట, జనవరి 31 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది. మూడు దశల్లో అన్ని పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మండలంలోని 25 పాఠశాలలను మొదటి విడుతలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద ఎంపిక చేశారు. వీటిలో చెట్టుపల్లితండా, దీప్లానాయక్తండా పాఠశాలలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అభివృద్ధి చేశారు. చెట్టుపల్లితండా ప్రాథమిక పాఠశాలకు రూ.10 లక్షలు ప్రభుత్వం మంజూరు చేయగా ఈ నిధులతో పాఠశాలలో తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, చిన్న, పెద్ద మరమ్మతులు, సుందరీకరణ పనులు చేపట్టారు. అన్ని పనులు పూర్తి కావడంతో బుధవారం పాఠశాలను కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు.
మాడ్గుల మండలంలో 17 పాఠశాలలు..
మాడ్గుల : గతంలో మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉండేవి, సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా మండలంలోని 17 పాఠశాలల అభివృద్ధికి రూ.2కోట్ల 83లక్షల 94వేల228 నిధులు మంజూరు చేయడం జరిగింది. పూర్తి అయిన పాఠశాలలు 11, మధ్యలో పని జరుగుతున్నవి 6, ప్రభుత్వం అందించిన నిధులతో పాఠశాలలకు పునర్జీవం వచ్చింది అని గ్రామ ప్రజలు అంటున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 65పాఠశాలల ఎంపిక..
ఇబ్రహీంపట్నం : మన ఊరు- మన బడి కింద ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 65 పాఠశాలలను ఎంపికచేశారు. వీటిలో మంచాల మండలంలో 15, యాచారంలో 17, ఇబ్రహీంపట్నంలో 15, అబ్దుల్లాపూర్మెట్లో 18 పాఠశాలలను మన ఊరు- మనబడి కింద ఎంపికచేశారు. ఈ పాఠశాలలన్నీ రంగురంగుల పెయింటింగ్లతో కళకళలాడుతున్నాయి. ఇందులో మంచాల మండలంలో నోముల, బండాలేమూర్, యాచారం మండలంలో తులేఖుర్దు, ఇబ్రహీంపట్నం మండలంలోని శేరిగూడ, అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అనాజ్పూర్ పాఠశాలను మొదటి విడుతలో ఫిబ్రవరి 1న ప్రారంభించనున్నారు.
ఫరూఖ్నగర్ మండలంలో 34 పాఠశాలలు ఎంపిక
షాద్నగర్రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలో మొత్తం 98 పాఠశాలలు ఉండగా, వీటిలో 34 పాఠశాలలు మన ఊరు-మన బడి కింద ఎంపికయ్యాయి. మండలంలోని మొగిలిగిద్ద, కొత్తకాలనీ, వెలిజర్ల, కిషన్నగర్, పెద్దపలుగుట్లతండా, విఠ్యాల, రాయికల్, బూర్గుల, కాశిరెడ్డిగూడ, మధురాపూర్, చటాన్పల్లి, రామ్నగర్ కాలనీ, తోలగేరి, ఫరూఖ్నగర్, ఆర్టీసీ కాలనీ, సులేమాన్ కాలనీ, ఉర్దూమీడియం, పటేల్రోడ్డు ఉర్దూమీడియం, వేంకటేశ్వరకాలనీ, క్రిస్టియన్ కాలనీ, రైల్వే స్టేషన్రోడ్డు ప్రాథమిక పాఠశాలతో పాటు ఎలికట్ట, కందివనం, కంసాన్పల్లి, గంట్లవెల్లి ప్రాథమికోన్నత పాఠశాలలు, మొగిలిగిద్ద, కిషన్నగర్, చించోడ్, రాయికల్, బూర్గుల, షాద్నగర్ కుంటబడి ఫరూఖ్నగర్ ఉర్దుమీడియం, బాలికల ఉన్నత పాఠశాలలు ఎంపికయ్యాయి.
ప్రారంభం కానున్న రెండు పాఠశాలలు
తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టిన మర ఊరు-మన బడి కార్యక్రమానికి మోడల్ పాఠశాలలుగా ఎంపికైన మండలంలోని గంట్లవెల్లి, రాయికల్ పాఠశాల్లో అన్ని పనులు పూర్తయ్యాయి. దీంతో ఫిబ్రవరి 1న ఈ పాఠశాలలు మన ఊరు-మన బడి కింద ప్రారంభం కానున్నాయి. ఈ పాఠశాలలు అన్ని మౌలిక వసతులను సమకూర్చారు.
గంట్లవెల్లి పాఠశాలకు రూ.562151
ఫరూఖ్నగర్ మండలంలోని గంట్లవెల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలకు మన ఊరు-మన బడి ద్వారా మంజూరైన రూ.562151లతో వివిధ పనులను చేపట్టారు. వీటిలో తాగునీరుకు రూ.169143, వంటగదికి రూ.277599, విద్యుత్ సౌకర్యానికి రూ.115409లు ఖర్చుచేశారు. ఈ పాఠశాలలో మొత్తం 124 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో 77 మంది బాలురు, 47 మంది బాలికలు ఉన్నారు.
రాయికల్ ప్రాథమిక పాఠశాలకు రూ.9,74,120
మండలంలోని రాయికల్ పాఠశాలకు మన ఊరు -మన బడి కింద రూ.9,74,120 నిధులు మంజూరయ్యాయి. వీటిని బాలికల మూత్రశాలల, తాగునీరు, విద్యుత్, ఇతర పనుల కోసం వెచ్చించారు. ఈ పాఠశాలలో 68 మంది బాలురు, 53 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు.
ఆమనగల్లు మండలంలో పాఠశాలలు ఎంపిక
ఆమనగల్లు : మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల ఆధునీకరణ, మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించారు. ఆమనగల్లు మండలంలో 12 పాఠశాలలు ఎంపిక అయ్యాయి.
చాలా సంతోషంగా ఉంది
మా పాఠశాల చాలా సుందరంగా మారింది. గతంలో మూత్రశాలలు, సరైన తాగునీరు, ఇతర వసతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నేడు ఆ ఇబ్బంది తప్పింది. ప్రైవేటు పాఠశాల విద్యార్థులు మా పాఠశాలను చూసి అసూయపడే విధంగా మా బడిలో అన్ని వసతులను సమకూర్చడం సంతోషంగా ఉంది.
-అక్షర, 5వ తరగతి విద్యార్థిని, రాయికల్ పాఠశాల
ఇంకా మంచిగా చదువుకుంటా
మా పాఠశాలలో అన్ని వసతులను సమకూర్చారు. నేను ఇంకా మంచిగా చదువుకుంటా, మా ఉపాధ్యాయులు మాకు అర్థమయ్యే విధంగా పాఠాలు చెబుతున్నారు. మా పాఠశాలను చూస్తుంటే సంతోషంగా ఉంది.
-జశ్వంత్, 5వ తరగతి విద్యార్థి, రాయికల్ పాఠశాల
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు..
ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందించడం చాలా సంతోషం. అన్ని సౌకర్యాలు కల్పించడం వలన తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తుండ్రు. ప్రభుత్వ బడులు బలోపేతానికి కృషి చేస్తాం.
– ఓంకేశవ్రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, నల్లచెరువు
విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది
మా పాఠశాలలో మన ఊరు -మన బడి కింద అన్ని వసతులను సమకూర్చారు. దీంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతున్నది. విద్యార్థులకు విద్యతో పాటు మంచి క్రమశిక్షణను అలవరుస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలి.
-కృష్ణయ్య, ప్రధానోపాధ్యాయుడు, రాయికల్ పాఠశాల
పాఠశాలలో పనులు పూర్తి
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించి పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మండలంలో 18 పాఠశాలలను ఎంపిక చేసింది. అందులో రెండు పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేశారు. పనులు సైతం పూర్తి చేశాం. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగుతున్నది.
– కే వెంకటయ్య, మండల విద్యాధికారి, మొయినాబాద్
నోముల పాఠశాలకు కొత్తకళ
గతంలో ఎన్నో ఏండ్లుగా పాఠశాలల మరమ్మతులకు నిధులు లేకపోవటంతో బెంచీలు లేక పిల్లలు కింద కూర్చునేవారు. బ్లాక్బోర్డులు లేక అనేక ఇబ్బందులకు గురయ్యేవారు. తాగునీరు ఉండేది కాదు. మన ఊరు- మన బడి కింద నోముల పాఠశాలను రూ.9లక్షలతో ఎంతో అభివృద్ధి చేశాం. ప్రైవేటు పాఠశాలను తలదన్నే రీతిలో అభివృద్ధి చేశాం.
– జగన్, ఎస్ఎంసీ చైర్మన్ నోముల
మౌలిక వసతులను సమకూరుస్తున్నాం..
ఫరూఖ్నగర్ మండలంలో మొత్తం 98 సర్కార్ బడులు ఉన్నాయి. వీటిలో 34 పాఠశాలల మన ఊరు- మన బడికి ఎంపికయ్యాయి. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులను సమకూరుస్తున్నాం. ఇప్పటికే చాలా పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తవుతున్నాయి. గంట్లవెల్లి, రాయికల్, కాశిరెడ్డిగూడ పాఠశాలల్లో అన్ని వసతులను సమకూర్చాం. ప్రభుత్వ పాఠశాలలు మరింత ఆధునిక హంగులతో సుందరంగా మారాయి. వచ్చే విద్యాసంవత్సరానికి అన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది.
-శంకర్రాథోడ్, మండల విద్యాధికారి, ఫరూఖ్నగర్ మండలం
మా పాఠశాల చాలా బాగుంది
మా పాఠశాల చాలా బాగుంది. మాకు ఎలాంటి సమస్యలు లేవు. మంచి నీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, బండలు వేయడం వల్ల మాకు మంచిగా ఉంది.
– విద్యార్థి ధనుశ్, నల్లచెరువు పాఠశాల, మాడ్గుల
పాఠశాల మరింత సుందరంగా మారింది
మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల మన ఊరు-మన బడి కార్యక్రమంతో మరింత సుందరంగా మారింది. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకునేలా చూడాల్సిన బాధ్యత గ్రామస్తులందరిపైన ఉంది. సర్కార్ విద్యకు పెద్దపీట వేయడం చాలా సంతోషంగా ఉంది.
– యాదయ్య, గంట్లవెల్లి గ్రామం, ఫరూఖ్నగర్ మండలం
‘మన ఊరు -మన బడి’తో మహర్దశ
మన ఊరు- మన బడిలో భాగంగా మండలంలో 12 పాఠశాలలు ఎంపిక కాగా, అందులో మున్సిపాలిటీలో 7 మండలంలో 5 ఎంపిక అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలలు నేడు అద్భుతంగా రూపుదిద్దుకున్నాయి. మన ఊరు- మన బడి కార్యక్రమంతో కార్పొరేట్ స్థాయిలో ముస్తాబవుతున్నాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సర్దార్నాయక్, ఎంఈవో ఆమనగల్లు మండలం