షాబాద్/బొంరాస్పేట, ఫిబ్రవరి 5 : మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవ వేతనం మూడింతలైంది. ప్రస్తుతం నెలకు రూ.1000 చొప్పున అందిస్తున్న వేతనాన్ని రూ.3వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.వెయ్యిలో 60శాతం(రూ.600) కేంద్రం, 40శాతం(రూ.400) రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ప్రస్తుతం పెంచిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుండగా, వాటా 80 శాతానికి(రూ.2400) చేరనున్నది. ప్రభుత్వ నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలోని 2,561 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులకు లబ్ధి చేకూరనున్నది. ఈ లెక్కన జిల్లాకు నెలకు రూ.61.46 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది. అలాగే వికారాబాద్ జిల్లాలో 1646 మందికి ప్రయోజనం కలుగనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, కేంద్రం కూడా తన వాటా పెంచాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారికి ఇచ్చే గౌరవ వేతనాన్ని మూడింతలు చేసింది. ఇప్పటివరకు ఇస్తున్న రూ.1000కి అదనంగా రూ.2వేలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారి వేతనం ఇప్పుడు రూ.3వేలకు పెరిగింది. మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న కార్మికులకు గౌరవ వేతనం పెంచుతామని సీఎం కేసీఆర్ గత ఏడాది అసెంబ్లీలో ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గతంలో 60 శాతం కేంద్రం రూ.600, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.400 చొప్పున మొత్తం కలిపి రూ.1000 చెల్లించేది. వేతనం సరిపోవడం లేదని కోరగా, స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను రూ.2,400 చేసింది. అంటే వీళ్లకు ఇచ్చే గౌరవ వేతనంలో 80 శాతం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. కేంద్రం కూడా తన వాటాను పెంచాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్రం వాటా ఆరు వందలే..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకంలోని కుక్ కం హెల్పర్లకు రూ.వెయ్యి మాత్రమే చెల్లిస్తున్నారు. దీనిలో 60:40 నిష్పత్తి ప్రకారం కేంద్రం రూ.600 చెల్లిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.400 చెల్లిస్తున్నది. తాజాగా పెంచిన రూ.2 వేలను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.2400 చెల్లిస్తుండగా, కేంద్రం రూ.600 మాత్రమే ఇవ్వనున్నది.
రంగారెడ్డి జిల్లాలో 2,561 మందికి ప్రయోజనం..
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమగనల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొత్తం 1,262 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,561 మంది మధ్యాహ్న భోజన నిర్వాహకులు విధులు నిర్వర్తిస్తున్నారు. పెంచిన వేతనం ప్రకారం నెలకు మొత్తం రూ.61.46 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం అందించనున్నది. ఇప్పటివరకు పాత వేతనాల ప్రకారం నెలకు రూ. 10,24,400 మాత్రమే అందుతున్నాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని మధ్యాహ్న భోజన నిర్వాహకులు, కుక్లు, హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 1646 మందికి లబ్ధి..
మధ్యాహ్న భోజన నిర్వాహకుల గౌరవ వేతనం పెంపుతో వికారాబాద్ జిల్లాలో 1646 మందికి లబ్ధి చేకూరనున్నది. జిల్లాలో 1030 పాఠశాలలు ఉండగా, 165 పాఠశాలల్లో అక్షయపాత్ర షౌండేషన్ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నది. మిగిలిన 865 పాఠశాలల్లో స్థానికంగా ఎస్ఎంసీలు నియమించిన వంట ఏజెన్సీ మహిళలు పథకాన్ని అమలు చేస్తున్నారు. 25 మందిలోపు విద్యార్థులున్న బడిలో ఒక కుక్ కం హెల్పర్, 26 నుంచి వందలోపు విద్యార్థులున్న పాఠశాలల్లో ఇద్దరిని, ఆపై ప్రతి వంద మంది విద్యార్థులకు ఒకరు చొప్పున కుక్ కం హెల్పర్లను నియమించుకోవచ్చు. వీరు విద్యా సంవత్సరంలో 10 నెలలపాటు మధ్యాహ్న భోజనం వండి విద్యార్థులకు వడ్డించాలి.
వేతనం పెంచడం సంతోషకరం..
మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఇబ్బందులను గుర్తించిన సీఎం కేసీఆర్ వేతనాలు పెంచడం సంతోషంగా ఉన్నది. ఇంతకు ముందు ఇచ్చే రూ.1000 సరిపోయేది కాదు. ఇప్పుడున్న వేతనానికి మూడింతలు చేసి రూ.3వేలు అందిస్తామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– అనురాధ, మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు,సర్దార్నగర్
వేతనం పెంచడం గొప్ప నిర్ణయం..
మధ్యాహ్న భోజన నిర్వాహకుల వేతనాన్ని మూడింతలు పెంచాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం ఎంతో గొప్పది. చాలిచాలని వేతనంతో పడుతున్న ఇబ్బందులు అర్థం చేసుకున్నారు. పాఠశాలలను అభివృద్ధి చేయడంతో పాటు మధ్యాహ్న భోజన నిర్వాహకుల వేతనం పెంచినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు.
– జ్యోతి, పోతుగల్ ఉన్నత పాఠశాల (షాబాద్)