మరిపెడ, ఆగస్టు 13 : మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్కు తృటిలో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డోర్నకల్ మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందు కు రెడ్యానాయక్ కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో మండలంలోని అబ్బాయిపాలెం గ్రామ శివారులోని జాతీయ రహదారి 365పై ఒక్కసారిగా ద్విచక్ర వాహనదారుడు యూటర్న్ తీసుకోవడం, రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న కూలీలను తప్పించేందుకు కారు డ్రైవర్ వాహనాన్ని అదుపు చేశాడు.

ఇంతలో మరో కారు వేగంగా వచ్చి మాజీ మంత్రి కారును వెనుక నుంచి బలంగా ఢీ కొనడంతో కారు పాక్షికంగా దెబ్బతింది. కారులో ఉన్న రెడ్యాతో పాటు ఉగ్గంపల్లి సర్పంచ్ ఆయాబ్ పాషాకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలియడంతో పెద్ద ఎత్తున ఘటనా స్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రెడ్యానాయక్ మాట్లాడుతూ తన ఆరోగ్యం గురించి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.