తాండూరు, సెప్టెంబర్ 20 : పత్తికి ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. ఈసారి తెల్ల బంగారం పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. వ్యవసాయ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో వికారాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. జిల్లాలో 2021-22లో 1.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 2022-23లో 2.42 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 2023-24 అంటే ఈ ఏడాది 2,61,286 ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగైంది. మొదటి దఫా కలుపు పనులు పూర్తయ్యాయి. ఈసారి అనుకూలంగా వర్షాలు కురువడం, ఎరువులు వేయడంతో పత్తి పంటలు ఏపుగా పెరిగాయి. పత్తి పంటలో చీడపీడల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వ్యవసాయ శాఖ అవగాహన కల్పిస్తున్నది.
కత్తెర పురుగు బెడదతో మొక్కజొన్న, వరి సాగుతో పాటు పెసరు, మినుముల, జొన్న పంటల విస్తీర్ణం తగ్గింది. ఈసారి పత్తిపైనే అన్నదాతలు ఆశ పెట్టుకున్నారు. మరో నెల పాటు పరిస్థితులు అనుకూలిస్తే అధిక దిగుబడులు వస్తాయని, పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.6,620 ఉన్నదని అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పత్తిని నాశనం చేసే పురుగులపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో జిల్లా వ్యవసాయ శాఖ ముందస్తుగానే అవగాహన కల్పిస్తున్నది. ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలన్న దానిపై సూచనలు చేస్తున్నది. ఇప్పటి వరకు మొదటి దఫా కలుపు తీసినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాలతో పొలాల్లో రెండోదఫా కలుపు తీస్తున్నారు. కాస్త ముందుగా వేసిన రేగడి పొలాల్లో పంట ఏపుగా పెరిగి పువ్వు, కాయ దశకి వచ్చింది. దీంతో పంటను చీడపీడలు నాశనం చేయకుండా రైతులు క్రిమిసంహారక మందులను పిచికారీ చేస్తున్నారు. డీఏపీ, యూరియా, పొటాష్తో పాటు పలు రకాల ఎరువులను రాష్ట్ర సర్కార్ అందుబాటులో ఉంచింది. దీంతో అన్నదాతలు పత్తి పంటకు మందులను పిచికారీ చేసే పనిలో బిజీగా గడుపుతున్నారు.
పత్తి పంటపై చీడపీడల నివారణకు వ్యవసాయ శాస్త్ర వేత్తలు, అధికారులు అన్నదాతలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రమాదకరమైన తల్లి పురుగు ఆకుల కింద, లేత కొమ్మలపైన, పూల మొగ్గపైనా, లేత కాయలపైన గుడ్లు పెడుతాయి. ఈ పురుగుల జీవిత కాలం 45 రోజులు ఉంటుంది. ఇది గమనించి జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి నష్టం వాటిల్లదని అధికారులు సూచిస్తున్నారు.
ఈసారి పత్తి పంట చాల బాగున్నది. ప్రారంభంలో కాస్త భయమైనప్పటికీ పది రోజుల పాటు సమృద్ధిగా కురిసిన వర్షాలకు మొక్కలు ఏపుగా పెరిగాయి. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త వేత్తల సూచనల మేరకు మందులను పిచికారీ చేస్తున్నాం. ఎరువులను అందుబాటులో ఉంచడంతో పాటు పత్తికి మద్దతు ధర కల్పించడం సంతోషంగా ఉన్నది.
ఇది రైతు ప్రభుత్వం. అదునుకు పెట్టుబడి సాయంతో పాటు కావాల్సిన యూరియా, డీఏపీ తదితర ఎరువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచింది. ఈ ఏడాది పత్తి పంట బాగున్నది. పొలంలో ఎలాంటి పంటలు వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలని అధికారులు అవగాహన కల్పించడం సంతోషకరం. రైతుల బాగు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
ఈ ఏడాది జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది. సకల సౌకర్యాలు కల్పించడంతో పాటు రూ.6620 మద్దతు ధరను రాష్ట్ర సర్కార్ ఇస్తున్నది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పత్తి సాగుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పత్తిని ఆశించే పురుగు నివారణపై సూచనలిస్తున్నాం. పత్తి సాగులో ఎలాంటి సమస్యలున్నా సంప్రదించవచ్చు.