పాలమూరు ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ అకుంఠిత దీక్ష వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.
పూడూరు, ఆగస్టు 11 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ రావడానికి సీఎం కేసీఆర్ చేసిన కృషి ఎంతో ఉందని ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజారోద్దీన్ పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండలం మన్నెగూడ చౌరస్థాలో టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి కన్వీనర్ రాజేందర్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, దయాగౌడ్, జావిద్, అనంతరెడ్డి, జె.నర్సింహులు, బిక్యానాయక్, రహిస్ఖాన్, హరీశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మర్పల్లి : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించడంతో శుక్రవారం మండలంలోని పట్లూర్లో బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు అశోక్, ఉప సర్పంచ్ మోహిజ్, నాయకులు శేఖర్ స్వామి, మోహన్, బాలేశ్, అరుణ్ పాల్గొన్నారు.
దోమ : పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు రైతుల అభ్యున్నతికి శుభ సూచకమని సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం రైతులతో కలిసి దోమ హనుమాన్ కూడలిలో టపాసులు పేల్చి సంబురాలు చేకున్నారు. కార్యక్రమంలో మైనొద్దీన్, శ్రీనివాస్రెడ్డి, నర్సయ్య, నరహరిరెడ్డి, శ్రీశైలం, గున్ను, రాములు, పాషా, నర్సింహులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో నిర్మించ తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి పథకానికి పర్యావరణ అనుమతులు లభించడం ఎంతో శుభసూచికం. ఇది రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం. దేశంలో ఎక్కలేని విధంగా సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చెప్పడానికి ఇది ఎంతో నిదర్శనం. పాలమూరు రంగారెడ్డి పథకం పూర్తయి ఈ ప్రాంతంలో సాగునీటి కష్టాలు పూర్తిగా సమిసిపోనున్నాయి.
– మొద్దు అంజిరెడ్డి, ఉత్తమరైతు, ఇబ్రహీంపట్నం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు రావడం హర్షణీయం. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎ న్ని కుట్రలు చేసినా ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు గ్రీన్ సిగ్నల్ రావడం సంతోషకరం. ప్లోరైడ్ విషరక్కసి బారిన పడి కరువు జిల్లాలుగా మారిన రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి.
– రాజావరప్రసాద్, చైర్మన్ తెలంగాణ రాష్ర్ట సహకార యూనియన్ లిమిటెడ్
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇక్కడి రైతులు వ్యవసాయం చేసుకునేందుకు సాగునీరు పుష్కలంగా అందుతుంది. ఇప్పటికే మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేయడంతో భారీ వర్షాలతో చెరువులు నిండి బోరుబావుల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడం సంతోషకరం. ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించడంతో రైతులు సంతోషంగా పంటలు సాగు చేసుకుంటారు.
– కాసులవాద నర్సింహులు, రైతు, కుమ్మరిగూడ, షాబాద్