జంటలు కనపడితే ఫొటోలు తీసి,
కుటుంబ సభ్యులకు పంపిస్తామని భయపెడుతున్న వైనం
బంగారు గొలుసు, సెల్ఫోన్లు లాక్కెళుతున్న ముఠా సభ్యులు
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసు బృందాలు..
సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాల్లో కలుసుకుంటున్న యువతీ యువకులకు ఇదో హెచ్చరిక. జనసంచారం లేని ప్రాంతాల్లో కలుసుకుంటున్న వారిని పోలీసులమని బెదిరించి డబ్బులు గుంజుతున్న నలుగురు సభ్యుల ముఠా కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో వారి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నలుగురి సభ్యుల ముఠా బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్కు కొంతమంది బాధితులుగా మారారని శివారు ప్రాంతాల్లో ఫిర్యాదులు నమోదవడంతో పోలీసులు ఈ సూడో పోలీసు ముఠాపై నజర్ పెంచారు. ముందస్తుగా మాత్రం జనం రద్దీ లేని నిర్మానుష్య ప్రాంతాలు, సగం నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద జంటలు ఉండడం అంతా శ్రేయస్కరం కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
యువత ఇంట్లో తెలియకుండా మద్యం, సిగరెట్ సేవించడానికి ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఈ సూడో పోలీసు గ్యాంగ్ మీరు గంజాయి తాగుతున్నారు, డ్రగ్స్ తీసుకుంటున్నారని పోలీసుస్టేషన్కు రావాలని బెదిరించి బంగారు గొలుసులు, ఖరీదైన ఫోన్లను తీసుకెళ్తున్నారు. జంటలు కనపడితే ఫొటోలు తీసి, కుటుంబ సభ్యులకు పంపిస్తామని భయపెడుతున్నారు. ముఠా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో బెదింపులకు పాల్పడుతున్నట్లు బాధితుల వెల్లడించిన వివరాలతో స్పష్టమవుతుంది. బాధితులు ఫిర్యాదులు ఆలస్యంగా ఇవ్వడంతో పోలీసులు సూడో పోలీసు గ్యాంగ్ను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. గ్రేటర్ హైదరాబాద్లోని పోలీసులు ముఠాకు సంబంధించి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. సూడో పోలీసు గ్యాంగ్ దొరికితే మరికొన్ని కేసుల వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.