మిల్లర్ల అక్రమ దందా ఇష్టారాజ్యంగా సాగుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇంత తతంగం జరుగుతున్నా.. పౌర సరఫరాల శాఖ అధికారులు మాత్రం మిల్లర్లపై చర్యలు తీసుకోవడం లేదు.
వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 95,162 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ను తిరిగివ్వాల్సి ఉన్నది. కానీ రెండేండ్లుగా మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించి ఇప్పటివరకు పెండింగ్లోనే ఉంచుతూ స్పందించడం లేదు. ధాన్యం ఇచ్చిన 15 రోజుల్లోగా సీఎంఆర్ రైస్ తిరిగివ్వాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నా అవి కాగితాలకే పరిమితమయ్యాయి. నిర్లక్ష్యం వహించిన మిల్లర్లపై గతంలో జరిమానా విధించినా తీరుమారలేదని అధికారులు వివరిస్తున్నారు.
– వికారాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లాలో మిల్లర్ల అక్రమ దందా జోరుగా సాగుతున్నది. ప్రభుత్వానికే ఎగనామం పెట్టేలా మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. మిల్లర్లపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువవడంతో సర్కార్కే టోకరా పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి తిరిగి బియ్యం రూపంలో పౌరసరఫరాల శాఖకు విధించిన నిర్ణీత గడువులోగా ఇవ్వాల్సి ఉంటుంది.
కానీ ఒకరిద్దరు మిల్లర్లు మినహా అందరూ.. పౌరసరఫరాల శాఖ మిల్లింగ్కై ఇచ్చిన ధాన్యాన్ని వెంటనే బ్లాక్ మార్కెట్కు తరలించి ఎలాంటి అనుమానం రాకుండా విడుతలవారీగా పౌరసరఫరాల శాఖకు నాసిరకం బియ్యాన్ని అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇంత తతంగం జరుగుతున్నా.. పౌర సరఫరాల అధికారులు మాత్రం మా మిల్లర్లు నిజాయతీపరులు అంటూ కితాబులిస్తుండడం గమనార్హం. గడువు ఇప్పటికే ముగిసినప్పటికీ.. జిల్లావ్యాప్తంగా గత రెండేండ్లుగా కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 95,162 టన్నుల సీఎంఆర్ రైస్ను మిల్లర్లు తిరిగివ్వాల్సి ఉంది.
సీఎంఆర్ రైస్ విషయంలో మిల్లర్లు ఇష్టార్యాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గత రెండేండ్లుగా తీసుకున్న ధాన్యానికి సంబంధించి ఇప్పటివరకు పెండింగ్లోనే ఉండడం గమనార్హం. 2020-21 ఖరీఫ్ నుంచి 2022-23 రబీ వరకు మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించి తిరిగివ్వాల్సిన సీఎంఆర్ రైస్లో ఇంకా 95,162 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్ పెండింగ్లో ఉంది. 2021-22 ఖరీఫ్లో 1,14,669 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, ఇప్పటికీ 136 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్, 2021-22 రబీలో 82,597 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇవ్వగా.. ఇంకా 873 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ రైస్, 2022-23 ఖరీఫ్లో 95,095 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు ఇవ్వగా, ఇంకా 38,744 సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది. 2022-23 రబీలో 85,225 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా ఇంకా 55,409 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం ఇచ్చిన 15 రోజుల్లోగా సీఎంఆర్ రైస్ తిరిగివ్వాలని నిబంధనలున్నప్పటికీ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. గోదాంలు ఖాళీలేక ఆలస్యమైందంటూ పౌరసరఫరాల అధికారులు చెబుతున్నప్పటికీ ఇదే అదునుగా మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సర్కార్ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మిల్లర్లు ధాన్యం సేకరించిన పదిహేను రోజుల్లో మిల్లింగ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది కానీ రెండేండ్లు గడుస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం కూడా మిల్లర్లతో సంబంధిత అధికారులు కుమ్మక్కయ్యారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా మిల్లర్లపై పౌరసరఫరాల అధికారుల పూర్తి పర్యవేక్షణ అవసరముంది. సీఎంఆర్ బియ్యం జాప్యంపై గతేడాది మిల్లర్లకు 25 శాతం మేర పెనాల్టీ వేసినప్పటికీ మిల్లర్ల నుంచి చలనం రాకపోవడం గమనార్హం.
రైస్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చిన 15 రోజుల్లోగా సీఎంఆర్ రైస్ ఇవ్వాలని నిబంధన ఉంది. కానీ రైస్ ఇవ్వడంలో రైస్ మిల్లర్లు జాప్యం చేస్తున్న మాట వాస్తవమే. రైస్ పెండింగ్పై గతేడాది 45 రైస్ మిల్లర్లకు పెనాల్టీ కూడా వేశాం. ఐదారు రైస్ మిల్లర్లు కేవలం 10 శాతం వరకు సీఎంఆర్ రైస్ ఇచ్చారు, మిగతాది పెండింగ్లో ఉంది. డిసెంబర్ 30లోగా సీఎంఆర్ రైస్ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించాం.
– రాజేశ్వర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి