వికారాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : పోడు రైతులకు త్వరలో తీపి కబురు అందనున్నది. వారికి పట్టాలిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులు ఇచ్చిన దరఖాస్తుల ప్రకారం వికారాబాద్ జిల్లా యంత్రాంగం పక్కా సర్వే నిర్వహించింది. గ్రామస్థాయి కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత గ్రామ సభల్లోనూ తీర్మానం చేసి అర్హులను గుర్తించారు. సర్వే వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లోనూ పొందుపర్చారు. ఈ జాబితాను కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీకి అందజేయగా, తుది జాబితాను సిద్ధం చేసిన సంబంధిత అధికారులు రాష్ట్ర సర్కారుకు నివేదించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ గ్రామ సభ, డివిజన్, జిల్లా కమిటీల ఆమోదాలతో ఆర్వోఎఫ్ఆర్ పట్టాలిచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోని 114 గ్రామ పంచాయతీల పరిధుల్లో 22,485 ఎకరాల్లో పోడు భూములను సాగు చేసుకుంటున్న 9,973 మంది పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 426 మందిని మాత్రమే జిల్లా యంత్రాంగం అర్హులుగా తేల్చింది.
జిల్లాలో పోడు భూములు సాగు చేసుకుంటున్న అర్హులైన రైతుల తుది జాబితా సిద్ధమైంది. అర్హులైన పోడుదారులకు త్వరలోనే పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పోడు భూములను సాగు చేసుకుంటున్న అసలైన పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. అందుకనుగుణంగా పోడు భూముల సర్వే ప్రక్రియను వారం రోజుల క్రితమే జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. పోడు భూముల సర్వేలో భాగంగా పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు, గిరిజనులా, గిరిజనేతరులా, ఎన్ని ఎకరాల్లో సాగు చేసుకుంటారనే వివరాలను సేకరించారు. జిల్లాలోని 114 గ్రామపంచాయతీలు 22,485 ఎకరాల్లో పోడు భూములను 9973 మంది గిరిజన, గిరిజనేతర రైతులు సాగు చేసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. జిల్లాలో ధారూరు, యాలాల, కులకచర్ల, బషీరాబాద్, దుద్యాల మండలాల్లో పోడు భూములు ఎక్కువగా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మరోవైపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు అటవీ భూములను ఆక్రమించి సాగు చేసుకుంటున్న గిరిజనులతోపాటు మూడు తరాలుగా అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతరులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలను అందజేసేందుకు తుది జాబితాను సిద్ధం చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి జాబితాను జిల్లా యంత్రాంగం అందజేసింది.
అర్హులైన పోడు రైతులు 426 మంది
జిల్లాలో పోడు భూములను సాగు చేసుకుంటున్న అర్హులైన రైతుల తుది జాబితాను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి అందజేసింది. జిల్లావ్యాప్తంగా గిరిజన, గిరిజనేతరులు కలిపి మొత్తం 9973 మంది పోడు భూములను సాగు చేసుకుంటున్నట్లుగా పట్టాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోగా.. 426 మందిని అర్హులుగా జిల్లా యంత్రాంగం తేల్చింది. అత్యధికంగా కులకచర్ల మండలంలో, అత్యల్పంగా పెద్దేముల్ మండలంలో ఉన్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించింది.
అర్హులైన పోడుదారుల్లో దోమ మండలంలో 28 మంది, పూడూరులో ఆరుగురు, ధారూరులో 54, కులకచర్లలో 186, పరిగిలో 77, చౌడాపూర్లో 33, పెద్దేముల్లో ఒకరు, బషీరాబాద్లో ఏడుగురు, కొడంగల్లో ఆరుగురు, యాలాల మండలంలో 28 మంది ఉన్నారు. అర్హులైన వారందరికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పోడు పట్టాలను పంపిణీ చేయనున్నారు.
క్షేత్రస్థాయిలో సర్వే
మొదట పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతుల నుంచి దరఖాస్తులను జిల్లా యంత్రాంగం స్వీకరించింది. దరఖాస్తులవారీగా క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే ప్రక్రియను నిర్వహించారు. అనంతరం నిజమైన పోడుదారులను ఎంపిక చేసేందుకు గ్రామసభలను నిర్వహించారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులకనుగుణంగా గ్రామసభల్లో పరిశీలించి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2005కు ముందు నుంచి సాగు చేసుకుంటున్నారా లేదా అనే పూర్తి వివరాలను గ్రామసభల్లో చర్చించి లబ్ధిదారులను ఎంపిక చేసి తీర్మానం చేశారు.
పోడు భూముల సర్వే అనంతరం సంబంధిత వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో పొందుపర్చారు. పోడు భూముల సర్వేతోపాటు లబ్ధిదారుల ఎంపికకు గ్రామస్థాయి కమిటీలో పంచాయతీ కార్యదర్శి, అటవీ శాఖ బీట్ అధికారి, సర్వేయర్, తహసీల్దార్., డివిజన్స్థాయి కమిటీలో చైర్మన్గా ఆర్డీవో., సభ్యులుగా డీఎఫ్వో, డీజీటీవో, ఇద్దరు గిరిజన జడ్పీటీసీలు., జిల్లాస్థాయి కమిటీకి చైర్మన్గా కలెక్టర్., సభ్యులుగా జిల్లా అటవీ శాఖ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఉన్నారు. గ్రామస్థాయిలో తీర్మానం అనంతరం డివిజన్స్థాయిలో తీర్మానం చేసి, అనంతరం జిల్లాస్థాయి కమిటీ అర్హుల జాబితా పరిశీలించి తుది జాబితాకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ ఆమోదం తెలిపి, సంబంధిత పోడుదారుల జాబితాను ప్రభుత్వానికి అందజేశారు.