వికారాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంట నష్టపోయిన అర్హులైన ప్రతి రైతుకూ నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మద్గుల్ చిట్టంపల్లిలోని డీపీఆర్సీ భవనంలో జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశానికి మంత్రి సబితారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరానికి రూ.10 వేల చొప్పున సర్కారు నష్టపరిహారాన్ని అందజేస్తుందని, ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. జిల్లాలోని మర్పల్లి, మోమిన్పేట్, బంట్వారం, కోట్పల్లి, వికారాబాద్, కులకచర్ల, నవాబుపేట, చౌడాపూర్ మండలాలకు చెందిన 5,788 మంది రైతులకు సంబంధించిన 6418 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మంత్రి వెల్లడించారు. వీటిలో 4461 ఎకరాల్లో ఉద్యాన పంటలు, 1957 ఎకరాల్లో వ్యవసాయ పంటలు వర్షానికి దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. జిల్లాలో కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండేందుకు గతంలో ఎన్నడూలేని విధంగా సీఎం కేసీఆర్ పరిహారాన్ని ప్రకటించారని మంత్రి సబితారెడ్డి తెలిపారు.
జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 2,13,907 మందికి కంటి పరీక్షలు పూర్తి చేశామని.. 34,094 మందికి రీడింగ్ అద్దాలను పంపిణీ చేయగా, మరో 10,914 మంది ప్రిస్క్రిప్షన్ అద్దాలను పంపిణీ చేశామన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో చేపట్టిన 266 స్కూళ్లలో మరమ్మతు పనులను జూన్లోగా పూర్తి చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి నిధుల కొరత ఏమీలేదని, నిధులు రావంటూ ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో అధిక ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించారన్నారు. ఒకేచోట మూడేండ్లపాటు పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శుల బదిలీలు చేపట్టాలని సంబంధిత అధికారిని మంత్రి ఆదేశించారు. మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన దురదృష్టకరమని, బాధ్యులపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు.
సమావేశంలో వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, డీఎంహెచ్వో పాల్వన్కుమార్, డీఏవో గోపాల్, అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీపీలున్నారు.
తాగునీటి సమస్యలేకుండా చూడండి : జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి
వేసవి కాలం ప్రారంభమైన దృష్ట్యా జిల్లావ్యాప్తంగా ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జడ్పీ చైర్పర్సన్ పి.సునీతామహేందర్రెడ్డి ఆదేశించారు. మిషన్ భగీరథ నీళ్లు ప్రతి ఇంటికీ చేరేలా చూడాలని, ఎక్కడైనా నీటి సరఫరా నిలిపివేస్తే ముందస్తు సమాచారం ఇవ్వాలని, తాగునీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా నిధులను సద్వినియోగం చేసుకోవాలని, సీసీ రోడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో జొన్న, నూనె గింజల సాగు రానురాను తగ్గుతున్నదని, ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులంందరికీ చేరేలా చూడాలన్నారు. జిల్లా అభివృద్ధిలో జడ్పీ కీలక భూమిక పోషిస్తున్నదని, జడ్పీ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, పొలాలకు పానాదులు, డ్వాక్రా, అంగన్వాడీ భవనాల నిర్మాణ పనులు చేశామని సునీతారెడ్డి తెలిపారు.
అర్హులకు తప్పనిసరిగా నష్టపరిహారం : కలెక్టర్ నారాయణరెడ్డి
అకాల వర్షాలతో పంట నష్టపోయిన అర్హులైన రైతులకు తప్పనిసరిగా నష్టపరిహారం అందేలా చూస్తామని కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. అనర్హుల వివరాలివ్వద్దని, ఈ విధంగా చేస్తే నిజమైన రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్ లీకేజీ లేకుండా చర్యలు చేపట్టాలని, నర్సరీల్లో 3-4 ఏండ్లకు సరిపడా మొక్కలను పెంచేలా ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. ఒకేచోట మూడేండ్లపాటు పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేస్తామని పేర్కొన్నారు.