పెద్దఅంబర్పేట, డిసెంబర్ 8 : ‘సార్.. బ్యాగ్ మరిచిపోయాం. అందులో 40 తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ ఉంది. ఇక మీరే దిక్కు’ అని 100 నంబర్కు వచ్చిన ఓ ఫోన్ కాల్ ఇది. ఇంకేముంది నిమిషాల్లోనే స్పందించారు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు. బ్యాగ్ మరిచిపోయిన ప్రదేశానికి వెళ్లారు. బ్యాగ్ను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. వారి అభినందనలు అందుకున్నారు.
సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. గాలి వెంకటేశ్వర్లు తన భార్య ఝాన్సీతో కలిసి కారులో విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూ.. మార్గమధ్యంలో ఓఆర్ఆర్ వద్ద ఉన్న సంపూర్ణ హోటల్ వద్ద గురువారం ఉదయం దాదాపు 11 గంటలకు ఆగి టిఫిన్ చేశారు. తర్వాత చేతిలో ఉన్న బ్యాగ్ను అక్కడే మరిచిపోయి వెళ్లిపోయారు. బ్యాగ్లో 40 తులాల బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్ ఉన్నది. నగరంలోని లింగంపల్లి వరకు చేరుకున్నారు.
బ్యాగ్ కనిపించకపోవడంతో మరిచిపోయినట్టు గుర్తించి.. వెంటనే డయల్ 100కు ఫోన్ చేశారు. ఫోన్ కాల్ అందుకున్న పెట్రోల్ మొబైల్ సిబ్బంది వి.లింగమయ్య హుటాహుటిన సంపూర్ణ హోటల్కు చేరుకుని బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నారు. విషయాన్ని బాధితులకు తెలియజేసి.. బ్యాగ్ను పోలీస్స్టేషన్లో అప్పగించారు. తిరిగి వచ్చిన వెంకటేశ్వర్లుకు బంగారు ఆభరణాలున్న బ్యాగ్ను అందజేశారు. తక్షణమే స్పందించి బ్యాగ్ను సురక్షితంగా అందజేసిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.