నల్లబెల్లి, ఆగస్టు 2 : ఇటీవల గుండెపోటుతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన తెలంగాణ ఉద్యమ కెరటం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రానికి పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివస్తూ పెద్ది చిత్రపటం వద్ద నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ అధినేతతో ఉన్న సంబంధాలు, ఆయన చేసిన అభివృద్ధి పనులు, కష్టకాలంలో కార్యకర్తలను ఆదుకున్న పరిస్థితులను నెమరు వేసుకుంటున్నారు. పెద్ది కుటుంబ సభ్యులను పరామర్శిస్త్తూ అన్న లేకున్నా కోట్లాది మంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న అభిమానం అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. అన్న చూపిన బాటలో పయనిస్తూ బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామంటూ ప్రతిన బూనుతున్నారు. నర్సంపేట నియోజకవర్గానికి ఐదేళ్లపాటు ఎమ్మెల్యేగా పని చేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ప్రభుత్వ అధికారులతో మమేకమైన తీరు, ఆయన ఉద్యోగులకు ఇచ్చిన గౌరవాన్ని బదిలీపై వెళ్లిన వారు అలాగే ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.