వికారాబాద్, మార్చి 6, (నమస్తే తెలంగాణ) : ప్రతి గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఏటా పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షిస్తున్నది. ఈ ఏడాదికి సంబంధించి వికారాబాద్ జిల్లా అధికారులు హరిత ప్రణాళికను సిద్ధం చేశారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 40.53 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. అటవీ శాఖ, డీఆర్డీఏతోపాటు ఇతర అన్ని శాఖల ఆధ్వర్యంలో 21.85 లక్షలు, మిగతావి మున్సిపాలిటీలు, అన్ని గ్రామ పంచాయతీల్లో నాటేందుకు ప్రణాళికలను రూపొందించారు. లక్ష్యానికి అనుగుణంగా ఇప్పటికే గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ఎప్పటిలాగే ఆయా శాఖలకు మొక్కల నాటే లక్ష్యాన్ని నిర్దేశించి కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాటిన ప్రతి మొక్కనూ బతికించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. అందుకోసం గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ జియోట్యాగింగ్ చేపట్టనున్నారు. ఈ ఏడాది అధికంగా పండ్లు, నీడనిచ్చే మొక్కలు నాటాలని నిర్ణయించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారంలో భాగం గా ఈ ఏడాది నాటాల్సిన మొక్కలకు సంబంధించి జిల్లా యంత్రాంగం ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నాటేందుకు నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈసారి ఈ కార్యక్రమంలో అన్ని శాఖలను భాగస్వాములను చేయనున్నది. ఆయా శాఖలకు నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీ శాఖ అధికారులు సిద్ధం చేశారు. నాటిన మొక్కలను సంరక్షించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టనున్నది. కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటేందుకు గుంతలను తీసే ప్రక్రియ నుంచి మొక్కలు నాటే ప్రక్రియ వరకూ ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేయనున్నారు. ఈ ఏడాది అడవుల్లో పచ్చదనాన్ని పెంచేందుకు జిల్లాలోని ఆయా అటవీ ప్రాంతాల్లో మొక్కలను నాటడంతోపాటు పునరుజ్జీవ కార్యక్రమాలను చేపట్టేందుకు జిల్లా అటవీ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. గతేడాది నాటి న మొక్కల్లో 70 శాతం మేర మొక్కలను సంరక్షించారు. ఈ ఏడాది మొక్కలను నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్య లు చేపట్టనున్నారు. అయితే పర్యావరణాన్ని పెంచడంతోపాటు రాష్ర్టాన్ని ఆకు పచ్చని తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది టార్గెట్ 40.53 లక్షల మొక్కలు..
తెలంగాణకు హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 40.53 లక్షల మొక్కలను నాటాలని జిల్లా యంత్రాం గం లక్ష్యంగా నిర్ణయించింది. అటవీ శాఖ, డీఆర్డీఏతోపాటు ఇతర అన్ని శాఖల ఆధ్వర్యంలో 21.85 లక్షల మొక్కలు, 565 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో మిగతా మొక్కలను నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ఏడాది అటవీ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలు, విద్యాశాఖ ఆధ్వర్యంలో 11 వేలు, డీపీవో, డీఆర్డీవో ఆధ్వర్యంలో 25 లక్షలు, నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో 5 వేలు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 43,500, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 5 లక్షలు, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 10 వేలు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 10 వేలు, ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో 2 లక్షలు, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వెయ్యి, రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 500, గనుల శాఖ ఆధ్వర్యంలో 50 వేలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 500, పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 2 వేలు, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 5 వేల మొక్కలను నాటనున్నారు. అలాగే 4 మున్సిపాలిటీల ఆధ్వర్యంలో 2.15 లక్షల మొక్కలను నాటనున్నారు, వికారాబాద్ మున్సిపాలిటీలో 80 వేల మొక్కలు, తాండూరు మున్సిపాలిటీలో 70 వేలు, పరిగి మున్సిపాలిటీలో 30 వేలు, కొడంగల్ మున్సిపాలిటీలో 35 వేల మొక్కలను నాటేందుకు ప్లాన్ చేశారు.
566 నర్సరీల్లో ..
ఈ ఏడాది ప్రధానంగా పండ్లు, పూలతోపాటు నీడనిచ్చే మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. టేకు, ఉసిరి, జామ, నిమ్మ, సీతాఫల్, దానిమ్మ, మునగ, గులాబీ, మందారం, మల్లె, కానుగ, నెమలినార, శ్రీగంధం తదితర మొక్కలను నాటనున్నారు. జిల్లాలోని గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేశారు. హరితహారంలో భాగంగా నాటనున్న మొక్కలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 566 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. అయితే ఆయా గ్రామ పంచాయతీల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసిన దృష్ట్యా ఆయా గ్రామాల్లోని నర్సరీల్లోని మొక్కలను ఆయా గ్రామ పంచాయతీల్లోనే నాటనున్నారు, ఏదేని నర్సరీలో తక్కువ మొక్కలు ఉంటే పక్క గ్రామ పంచాయతీలోని నర్సరీ ద్వారా మొక్కలను సేకరించేలా చర్యలు చేపట్టారు.
పంచాయతీల్లో తీర్మానం ప్రకారం..
అయితే పల్లెప్రగతిలో భాగంగా గ్రామ పంచాయతీల్లో ఏయే మొక్కలను నాటాలనే దానిపై చేసిన తీర్మానం ప్రకారం సంబంధిత మొక్కలను గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రతి గ్రామాన్ని హరితవనంగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది 40.54 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 38.70 లక్షలు నాటినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే జిల్లాలోని ధారూర్, తాండూరు, అన్నాసాగర్, తట్టేపల్లి, కల్కొడ, వికారాబాద్ అటవీ ప్రాంతాల్లోనూ మొక్కలను నాటనున్నారు. టేకు మొక్కలతోపాటు చైనా బాదం, కానుగ, నెమలి నార తదితర మొక్కలను నాటేందుకు సిద్ధం చేస్తున్నారు. అనంతగిరి అడవుల్లో లక్ష మొక్కలను నాటనున్నారు. ఎండిపోయిన చెట్లు, పూర్తిగా వంగిపోయిన చెట్లను తొలగించే తదితర పనులతో పాటు జిల్లాలోని అడవులకు పునరుజ్జీవం పోయనున్నారు.
శాఖల వారీగా టార్గెట్ సిద్ధం..
జిల్లావ్యాప్తంగా 40.53 లక్షల మొక్కలను నాటేందుకు ప్రణాళికను సిద్ధం చేశాం. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీల నుంచే ఆయా గ్రామ పంచాయతీలకు మొక్కలను పంపిణీ చేస్తాం. అలాగే హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జియోట్యాగింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశాం.
– కృష్ణన్, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి, వికారాబాద్