పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధించి సత్తా చాటారు. రంగారెడ్డి జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థులు జీపీఏ 10/10 సాధించారు. అలాగే బీసీ వెల్ఫేర్, జిల్లా పరిషత్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, మైనార్టీ పాఠశాలల విద్యార్థులు పలువురు 10/10 సాధించి ఔరా అనిపించారు. 24 గవర్నమెంట్ స్కూల్స్ వందశాతం ఉత్తీర్ణత సాధించాయి. జిల్లాలోని ఏకైక ఆశ్రమ పాఠశాల 97.73 శాతం ఉతీర్ణత సాధించగా.. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూల్స్ల్లో 90శాతం నుంచి 97 శాతం ఉత్తీర్ణత నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 47,551 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా.. 42,488 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 13,399 మంది విద్యార్థులకుగాను 7967 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
-రంగారెడ్డి, మే 10(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, మే 10(నమస్తే తెలంగాణ): పదో తరగతి ఫలితాల్లో రంగారెడ్డి జిల్లాలో బాలికలదే పై చేయిగా నిలిచింది. బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి బషీర్బాగ్లోని ఎస్సీఈఆర్టీలో పలువురు ఉన్నతాధికారుల సమక్షంలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. జిల్లావ్యాప్తంగా 47,551 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 42,488 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 24,444 మంది బాలురకు గాను 20,825 మంది ఉత్తీర్ణులు కాగా, 85.19 శాతంగా నిలిచారు. 23,107 మంది బాలికలు పరీక్షలు రాయగా, 20,663 మంది ఉత్తీర్ణులై 89.42 శాతంతో సత్తా చాటారు. జిల్లాలో 15 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ఉండగా, వాటిలో 22 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సంపాదించారు. బీసీ వెల్ఫేర్కు సంబంధించి 16 పాఠశాలలు ఉండగా, వాటిలో నుంచి 14 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. జిల్లా పరిషత్ పాఠశాలలు 238 ఉండగా, వాటి నుంచి ఏడుగురు మాత్రమే 10/10 జీపీఏ సాధించగలిగారు. 9 మోడల్ స్కూల్స్లో ముగ్గురికి మాత్రమే 10/10 జీపీఏ వచ్చింది. 9 మైనార్టీ పాఠశాలల నుంచి ఒక్కరు మాత్రమే 10/10 జీపీఏ సాధించారు. జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనుండగా, పరీక్షా ఫీజు చెల్లింపునకు ఈనెల 26 వరకు గడువు విధించారు.
రేపటి భవితవ్యానికి పునాది అని భావించిన సీఎం కేసీఆర్, కేజీ టు పీజీ ఉచిత విద్యను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా గురుకులాలు, రెసిడెన్షియల్ (సోషల్ వెల్ఫేర్, ట్రైబల్, మైనార్టీ, బీసీ వెల్ఫేర్) పాఠశాలలు, మాడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, జిల్లా పరిషత్, ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలు నెలకొల్పి పేద విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందిస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, ఆశ్రమ, మాడల్ పాఠశాలల్లోనే ఫలితాలు అద్భుతంగా వచ్చాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా ఫలితాలు వచ్చాయి. జిల్లాలో ఆశ్రమ పాఠశాల ఒక్కటి మాత్రమే ఉండగా, 97.73 శాతం ఫలితాలు వచ్చాయి. సోషల్ వెల్ఫేర్ రెసిడిన్షియల్ పాఠశాలలు 15 ఉండగా, 96.06 శాతం ఉత్తీర్ణత వచ్చింది. 9 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 94.71% ఉత్తీర్ణత లభించింది. బీసీ వెల్ఫేర్కు 16 పాఠశాలలు ఉండగా 94.57% ఉత్తీర్ణత వచ్చింది. ట్రైబల్ వెల్ఫేర్కు 3 పాఠశాలలు ఉండగా, 91.63% ఉత్తీర్ణత నమోదైంది. మాడల్ స్కూల్స్ 9 ఉండగా, 90.17% ఉత్తీర్ణులయ్యారు. కాగా, ఎయిడెడ్ పాఠశాలల్లో 85.33% నమోదైంది. కేజీబీవీ పాఠశాలలు 20 ఉండగా, 79.02% ఉత్తీర్ణత నమోదైంది. జిల్లా పరిషత్ (238)లో 70.94%, ప్రభుత్వ పాఠశాల (4)ల్లో 63.31% ఉత్తీర్ణత నమోదైంది.
జిల్లా స్థాయిలోని అధికారులు, మండల స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పడ్డ కష్టానికి ఈ ఫలితాలు నిదర్శనం. గత ఏడాది 25వ స్థానంలో ఉన్న జిల్లా.. ప్రస్తుతం 20వ స్థానానికి ముందుకెళ్లింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నాలుగు దఫాలుగా ప్రాక్టీస్ టెస్ట్లను నిర్వహించాం. పకడ్బందీ చర్యల వల్ల విద్యార్థులు 10/10 పాయింట్లు సాధించారు.
– సుశీందర్ రావు, రంగారెడ్డి జిల్లా విద్యా అధికారి
షాబాద్, మే 10 : చేవెళ్ల నియోజకవర్గంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో షాబాద్ కేజీబీవీ పాఠశాలతో పాటు రేగడిదోస్వాడ ఉన్నత పాఠశాలలు సత్తా చాటాయి. బుధవారం వెలువడిన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి ఆదర్శంగా నిలిచింది. పాఠశాలలో ఈ ఏడాది 35 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, అందులో అందరూ పాసయ్యారు. రేగడిదోస్వాడ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందరూ ఉత్తీర్ణులయ్యారు.
పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాం. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించి, పరీక్షలకు సిద్ధం చేశాం. తమ పాఠశాలకు చెందిన 35 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం సంతోషంగా ఉన్నది.
– కృష్ణకుమారి, ఎస్వో కేజీబీవీ పాఠశాల, షాబాద్
రంగారెడ్డి జిల్లాలోని పలు పాఠశాలల్లో విద్యార్థులు 10/10 జీపీఏ సాధించడం ఒక ఎత్తైతే, మరికొన్ని పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించారు. జిల్లాలోని జిల్లా పరిషత్ పాఠశాలలు, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలు, మైనార్టీ వెల్ఫేర్, ఎంపీహెచ్ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి. జిల్లా పరిషత్ పాఠశాలలు తలకొండపల్లి మండలం ఖానాపూర్, వెలిజాల, షాబాద్లోని రేగడి దోస్వాడ, సరూర్నగర్లోని మన్సూరాబాద్, మాడ్గులలోని అర్కపల్లి, అండుగుల, కడ్తాల్లోని ఎక్వాయిపల్లి, ఇబ్రహీంపట్నం పరిధిలోని పోచారం, చేవెళ్లలోని అంతారం, తంగడపల్లి, కౌకుంట్ల, ఆలూరు, ఖానాపూర్, ఆమనగల్లులోని ఆకుతోటపల్లి, అబ్దుల్లాపూర్మెట్లోని బండ రావిర్యాల, కవాడిపల్లి ఉన్నాయి. కాగా, సోషల్ వేల్ఫేర్, బీసీ వెల్ఫేర్ పాఠశాలలు (గర్ల్స్) నార్సింగి, నల్లకంచ, ఇబ్రహీంపట్నం, కందుకూర్, రాజేంద్రనగర్, (గర్ల్స్) గౌలిగూడ, తలకొండపల్లి, కడ్తాల్ పరిధిలోని చరికొండ గ్రామంలోని ఎంపీహెచ్ఎస్ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు వచ్చాయి.