ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 5 : రైతాంగానికి సాగుబడిలో రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగా పెట్టుబడి సాయం, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతూ.. అన్నదాతలకు భరోసానిస్తున్నది. దీంతోపాటు పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో వానకాలంతోపాటు యాసంగి పంటల వివరాలను ఆన్లైన్లో వ్యవసాయశాఖ సిబ్బంది ద్వారా నమోదు చేయిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈ ప్రక్రియ ఇప్పటికే వందశాతం పూర్తి కాగా.. పంటల లెక్క పక్కాగా తేలింది. 1,12,358 ఎకరాల్లో పంటలు వేయగా.. ఇందులో వరి, మొక్కజొన్న, జొన్న, శనగలు, ఉల్వలు, కుసుమలు, ఆముదాలు, పొద్దుతిరుగుడుతోపాటు పలు రకాల పంటలు సాగు చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి గీతారెడ్డి తెలిపారు. పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఏటా ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నది. వానకాలంతోపాటు యాసంగిలో రైతులు సాగుచేసిన పంటల వివరాలను వ్యవసాయశాఖ సిబ్బంది ఆన్లైన్లో నమోదు చేశారు.
సాగునీటి వనరులు పుష్కలంగా ఉండటంతో గతేడాది యాసంగి కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం కొంత మేరకు పెరిగింది. గత యాసంగిలో జిల్లా రైతులు 1,09,112 ఎకరాల్లో పంటలు వేయగా.. ఈ ఏడాది అదనంగా 3246 ఎకరాలు.. అంటే 1,12,358 ఎకరాల్లో సాగు చేశారు. అధికారులు కూడా ఈ యాసంగిలో సుమారు లక్ష ఎకరాల వరకు పంటలు సాగవుతాయని అంచనాలు వేయగా.. లక్ష్యానికి మించి సాగయ్యాయి. అందుకనుగుణంగా అధికారులు పంటలను కాపాడుకునేందుకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాసంగిలో అధికంగా వరి, మొక్కజొన్న, జొన్న పంటల సాగువైపే రైతులు మొగ్గు చూపారు. జిల్లాలో వరి 75,270., మొక్కజొన్న 11,153., జొన్న 542, శనగలు 4423, ఉల్వలు 89, పల్లి 4900, సన్ఫ్లవర్ 574, ఆముదాలు 185, ఇతర పంటలు 9226 ఎకరాల్లో సాగుచేశారు.
జిల్లా పరిధిలోని 22 మండలాల్లో 83 ఏఈవో క్లస్టర్లున్నాయి. ప్రతి క్లస్టర్లో 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం నియమించింది. వీరు ప్రతి రోజూ పంటల సాగు వివరాలను నమోదు చేశారు.. యాసంగి సీజన్ ప్రారంభం నుంచి ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్నది ఏఈవోలు ఇప్పటికే నమోదు చేశారు. ప్రతి సర్వే నంబర్లో, సబ్ డివిజన్లలో రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలు పక్కాగా సేకరించారు. ఇలా సేకరించిన వివరాలను రైతు బంధు ఆన్లైన్ యాప్లో ఏఈవోలు అప్లోడ్ చేశారు.
దిగుబడి ఎంత వస్తుందనేది పక్కాగా అంచనా వేసేందుకు ఈ పంటల సాగు వివరాల సేకరణ ఉపయోగపడుతున్నది. ఫలానా పంట ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతున్నది తెలుసుకోవడంతోపాటు సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సధుపాయం కల్పించడం, కొనుగోలు కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఈ వివరాల సేకరణ దోహదపడుతున్నది. అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, అవసరమైన మేరకు గన్నీ బ్యాగులు తెప్పించుకోవడం వంటివి చేస్తారు. రైతులు పంటలు సాగుచేసిన విధానంతో ఏయే పంటలకు ఏమేం అవసరం ఉన్నాయో ఈ పంటల నమోదు ఆధారంగా దిగుబడికనుగుణంగా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నది.
గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా పంటల వివరాలను పూర్తిగా సేకరించాం. పంటల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేశాం. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. ఈసారి వానలు సమృద్ధిగా కురువడం, నాణ్యమైన కరెంటు సరఫరా, పెట్టుబడి సాయం అందడం వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. పకడ్బందీగా నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పంటల కోతల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం.
శ్రవణ్కుమార్, వ్యవసాయ విస్తరణాధికారి, ఇబ్రహీంపట్నం
రైతులు సాగు చేసిన వివిధ రకాల పంటల వివరాలను క్షేత్రస్థాయికి వెళ్లి నమోదు చేశాం. క్లస్టర్ పరిధిలో సాగుచేసిన పంటల వివరాలను సంబంధిత యాప్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేశాం. రైతులకు పంటల కోతల సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. పంటల నమోదు కార్యక్రమంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.