హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూహెచ్)ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఈ వర్సిటీలో వివిధ రకాల టెండర్లు, కొనుగోళ్లు, నియామకాలు మొదలుకొని ఆఫిలియేషన్లు, ఎంవోయూల వరకు రోజుకో వివాదం, పూటకో పంచాయితీ అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. మెస్ టెండర్లు, సెక్యూరిటీ టెండర్లు సహా ఇలా ప్రతి అంశం వివాదాస్పదమవుతున్నది. అర్హతలున్న కంపెనీలను పక్కనపెట్టి అధికారులు తమకు పర్సంటేజీలు ఇస్తామన్న కంపెనీలకే టెండర్లు కట్టబెడుతున్నారని, కమిటీల పేరిట ఈ తంతు కొనసాగుతున్నదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా పైనాన్స్ విభాగంలో ఫైళ్ల గల్లంతు అంశం తెరపైకి వచ్చింది. ఈ వివాదాలతో జేఎన్టీయూహెచ్ ప్రతిష్ట దిగజారుతున్నదని వాపోతున్న విద్యార్థి సంఘాల నేతలు.. వర్సిటీలో జరుగుతున్న అవకతవకలపై విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ వివాదాల నడుమ ఈ నెల 14న జేఎన్టీయూహెచ్ పాలకమండలి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం. కొత్త పాలకమండలి భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ పాలకమండలిలో సభ్యురాలిగి ఉన్న విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా ప్రస్తుతం సెలవులో ఉన్నారు. దీంతో ఆమె లేకుండా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ అంశాలపై జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ టీకేకే రెడ్డి స్పందిస్తూ.. ఏటా పాతవారే టెండర్లు దక్కించుకుంటున్నారని, దీనిని చెక్పెట్టాలని భావిస్తున్నామని తెలిపారు. సరైన డాక్యుమెంట్లు సమర్పించక టెండర్లలో డిస్క్వాలిఫై అయిన కొందరు ఆ తర్వాత సరైన పత్రాలు సమర్పించారని చెప్పారు. ఫైనాన్స్ విభాగంలోఅవకతవకలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని, ఇందుకోసం లీగల్ ఆఫీసర్గా రిజిస్ట్రార్కు అదనపు బాధ్యతలు అప్పగించామని వివరించారు.
గత కొంత కాలంగా జేఎన్టీయూహెచ్ అధికారులు విచ్చలవిడిగా ఎంవోయూలు కుదుర్చుకుంటున్నారు. వాటిలో భాగంగా ఓ సంస్థ సమకూర్చే ఉపకరణాలతో ల్యాబ్ను ఏర్పాటు చేయాల్సి ఉన్నది. అందుకోసం రూ.4 కోట్లు ఖర్చుచేయాల్సి వస్తున్నదట. దీంతో ఓ ప్రైవేట్ సంస్థ సమకూర్చే ఉపకరణాల కోసం రూ.4 కోట్లు వెచ్చించడం అవసరమా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు మరో సంస్థతో ఎంవోయూ కుదుర్చుకున్న జేఎన్టీయూహెచ్ అధికారులు.. ప్రతి విద్యార్థి నుంచి రూ.1,100 వసూలు చేసి, ఆ సదరు సంస్థ జేబులు నింపబోతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గతంలో ఓ జర్మన్ వర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందాలపై అనేక అనుమానాలు తలెత్తాయి. యూనివర్సిటీ ఫైనాన్స్ విభాగంలో అనేక ఫైళ్లు గల్లంతైనట్టు వార్తలొచ్చాయి. ఎగ్జామినేషన్స్ విభాగంలో రూ.37.62 కోట్లు ఖర్చుచేయగా.. రూ.30 కోట్ల ఖర్చుకు సంబంధించిన లెక్కలే అందుబాటులో ఉన్నాయి. దీనిపై ఆడిట్ విభాగం అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది. మూల్యాంకన పారితోషికం చెల్లింపులోను అవకతవకలు జరిగినట్టు తెలుస్తున్నది.