రోడ్డు ప్రమాదంలో మమత హాస్పిటల్ న్యూరో సర్జన్ డా. జగదీష్ మృతిపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. డా. జగదీష్ మృతి వైద్య రంగానికి, ఆయన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నారు. కాగా, సూర్యాపేట జిల్లా ఖమ్మం- హైదరాబాద్ 365 బిబి జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఓ ప్రముఖ వైద్యుడు కారులోనే సజీవ దహనమయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ వైపు నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు పిల్లలమర్రి శివారు ప్రాంతానికి చేరుకోగానే అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఖమ్మం నగరంలో మమత హాస్పిటల్లో న్యూరో సర్జన్గా సేవలు అందిస్తున్న న్యూరో సర్జన్ జగదీశ్ సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ అనిల్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.