కులవృత్తుల అభ్యున్నతికి రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు ఫలిస్తున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనం మత్స్యకారుల కుటుంబాలే. ఏటా ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న చేప పిల్లల పెంపకంతో మత్స్యకారులు మంచి లాభాలు ఆర్జిస్తూ ఆర్థికంగా బలోపేతమవుతున్నారు. ఏడేండ్లుగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది సర్కార్. ఒక్కో చెరువులో రూ.లక్ష విలువైన చేపపిల్లలను వదలుతుండగా, వాటి విక్రయంతో ఒక్కో మత్స్యకార కుటుంబం రూ.3లక్షల నుంచి 5 లక్షల వరకు ఆదాయం పొందుతున్నది. వికారాబాద్ జిల్లాలో ఏడాదికి 5 వేల టన్నులకుపైగా చేపల దిగుబడి వస్తున్నట్లు అధికారులు తెలిపారు.
గత ఏడేండ్లలో జిల్లావ్యాప్తంగా 31,508 టన్నుల దిగుబడి రాగా.. రూ.402 కోట్లకుపైగా ఆదాయాన్ని మత్స్యకారులు ఆర్జించినట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం చేప పిల్లల పెంపకాన్ని విస్తరిస్తుండగా.. ఆదాయమూ పెరుగుతున్నది. మొదటి ఏడాదిలో కేవలం 70 చెరువుల్లో చేపల పెంపకాన్ని ప్రారంభించగా.. ప్రస్తుతం 692 చెరువుల్లో చేపల పెంపకం కొనసాగుతున్నది. వందశాతం సబ్సిడీపై చేపపిల్లలు పంపిణీ చేయడంతోపాటు చేపల తరలింపు.. విక్రయానికి 70 శాతం సబ్సిడీపై వాహనాలు అందజేయడంపై మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-వికారాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ప్రభుత్వం కుల వృత్తుల పూర్వ వైభవానికి ఎంతో కృషి చేస్తున్నది. ఇందుకోసం అన్ని కులాల అభ్యున్నతికీ పాటు పడుతున్నది. గత ప్ర భుత్వాలు విస్మరించిన మత్స్యకారులకు అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీ య పథకంలో భాగంగా చెరువుల్లోని పూడికను తీయడంతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగడంతో ప్ర భుత్వం చేపలను పెంచాలని నిర్ణయించిన విష యం తెలిసిందే. ఇప్పటికే ఏడు విడుతల్లో చేపల పెంపకం పూర్తి కావడంతో ఆ చేపలను విక్రయించిన మత్స్యకారులు లాభాలను ఆర్జించి..బీఆర్ఎస్ ప్రభుత్వానికి.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒక్కో చెరువులో రూ.లక్ష విలువైన చేపపిల్లలను వదలగా, వాటి విక్రయంతో ఒక్కో మత్స్యకార కుటుంబం దాదాపుగా రూ.మూడు నుంచి ఐదు లక్షల వరకు ఆదాయాన్ని పొందుతున్నది. అదేవిధంగా జిల్లాలో 95 మత్స్యకారుల సొసైటీలుండగా వీటిలో మూడు మహిళా సంఘా లు (ఆలంపల్లి, పరిగి, రంగంపల్లి) ఉన్నాయి.
692 చెరువుల్లో చేపల పెంపకం
గత ఏడేండ్లుగా ప్రతి ఏటా జిల్లాలోని చెరువుల్లో చేపలను పెంచుతున్నారు. మొదట కేవలం 70 చెరువుల్లోనే చేపలను పెంచగా.. తర్వాత ఏడాది నుంచి సుమారు 700 చెరువుల్లో చేపల పెంపకాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో చేపలను అందించడంతోపాటు వాటి విక్రయంలోనూ మత్స్యకారులు నష్టపోకుండా చర్యలు చేపట్టింది.
గత ఉమ్మడి ప్రభుత్వాల హయాంలో మాదిరిగా దళారుల ప్రమేయం ఎక్కువగా ఉండి నిజమైన మత్స్యకారులు నష్టపోవాల్సిన పరిస్థితి లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నది. జిల్లాలో పెంచిన చేపలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా హైదరాబాద్తోపాటు స్థానికంగానే విక్రయిస్తూ మత్స్యకారులు లాభాలను పొందుతున్నారు. రవాణా ఖర్చులు, పెట్టుబడి ఖర్చులూ లేకపోవడంతో మత్స్యకారులు అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. అదేవిధంగా చేపలను విక్రయించేందుకు ప్రభుత్వం 70 శాతం సబ్సిడీతో మత్స్యకారులకు వాహనాలను కూడా ఇప్పటికే అందజేసింది. వందశాతం సబ్సిడీతో అందజేసిన చేపలను మత్స్యకారుల సొసైటీల ఆధ్వర్యంలో పెంచుతున్నారు. అయితే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18.75 లక్షల చేప పిల్లలు, 2017-18లో 53.41 లక్షల చేపపిల్లలు, 2018-19లో 25.99 లక్షల చేపపిల్లలు, 2019-20లో 197 చెరువుల్లో 41.54 లక్షలు, 2020-21లో 555 చెరువుల్లో 98.64 లక్షలు, 2021-22లో 691 చెరువుల్లో 1.17 కోట్ల చేపలు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 692 చెరువుల్లో దాదాపుగా కోటీ18 లక్షల చేపపిల్లలను వదిలారు.