అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో సక్సెస్ఫుల్గా సాగుతున్నది. 80 బృందాల ద్వారా జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు కంటి పరీక్షలు చేస్తున్నారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 8,70,507 మందికి కంటి పరీక్షలు చేయగా అందులో 1,06,248 మందికి అద్దాలను అందజేశారు. 63,529 మంది కోసం ప్రిస్క్రిప్షన్ అద్దాలను వైద్యులు ఆర్డర్ చేశారు. 18 ఏండ్లు నిండి.. దృష్టి లోపంతో బాధపడుతున్న వారందరికీ తిరిగి చూపు దక్కేలా ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతోపాటు మందులు, అద్దా లు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. జిల్లాలో సాగుతున్న కంటి వెలుగు శిబిరాల కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది.
-రంగారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. జిల్లాలో 80 బృందాలను ఏర్పాటు చేసిన అధికారులు పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. ప్రజానీకం నేత్ర పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 8,70,507 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 1,06,248 మందికి రీడింగ్ అద్దాలు, 63,529 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందజేశారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి రిఫర్ చేస్తున్నారు. పేదల కండ్లలో వెలుగులు నింపడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగుకు అనూహ్య స్పందన వస్తుండగా.. ఏండ్ల తరబడిగా ఉన్న కంటి సమస్యలు పరిష్కారమవుతుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం రెండో విడుత నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా సాగుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో ఈ కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 50-100 మంది వరకు పరీక్షలు చేస్తున్నారు.
రూపాయి ఖర్చు లేకుండా..
కంటి సమస్యలతో బాధపడుతున్నప్పటికీ ఖర్చులకు భయపడి చాలామంది కంటి పరీక్షలు చేయించుకోవడం లేదు. ఈ పరిస్థితిలో తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం ప్రజలకు వరంగా మారింది. అద్దాలు అవసరమైనవారికి ఉచితంగా అద్దాలను అందజేస్తున్నది. ఈ ఏడాది జనవరి 18 నుంచి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా.. నిరంతరాయంగా వైద్య బృందాలు సేవలు అందిస్తున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత ఎవరు ఎలాంటి అద్దాలు వాడాలో వైద్యులు సూచనలు చేస్తున్నారు. ఏండ్ల తరబడిగా ఉన్న కంటి సమస్యలు ప్రస్తుతం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంతో తీరాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
5,043 మంది పరీక్షలు
షాబాద్ : రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో మొత్తం 5,043 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 303 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 335 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ ఇచ్చారు.