ఆదిబట్ల, డిసెంబర్ 30 : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్లోని కల్వకోలు లక్ష్మీదేవమ్మ ఫంక్షన్హాల్లో నిర్వహించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే) రంగారెడ్డి జిల్లా మహాసభను నిర్వహించారు. ఈ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. నేడు ఈ సంఘం ఏర్పడటానికి కీలకం రంగారెడ్డి జిల్లానే అన్నారు.
జర్నలిజం అనేది ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని అన్నారు. అందరం కలిసి పనిచేసినప్పుడే ప్రజలకు మేలు చేయగలుగుతామని చెప్పారు. వార్తల సేకరణలో వాటిని ప్రచురించడంలో జర్నలిస్టుల కృషి మరువలేనిది అన్నారు. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ఇండ్ల స్థలాలు మంజూరు చేయటానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలకంటే నేడు తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందన్నారు. ప్రతి మండలంలో యూనియన్ ప్రెస్క్లబ్లు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ రాష్ట్ర చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తూ వారికి అండగా ప్రభుత్వంతోపాటు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ఉందన్నారు. టీయూడబ్ల్యూజే యూనియన్ ఏర్పడిన అనతి కాలంలోనే జర్నలిస్టులకు పింఛన్లు, వారి పిల్లలకు పాఠశాల ఫీజులల్లో రాయితీ, వివిధ కారణాలతో మృతి చెందిన ప్రతి జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి, టీయూడబ్ల్యూజే సంఘానికే దక్కిందని అన్నారు. త్వరలోనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ప్రతి జర్నలిస్టుకూ ఇండ్ల స్థలాలు కేటాయించేలా కృషి చేస్తామని చెప్పారు.
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు యూనియన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వివిధ కారణాలతో మృతి చెందిన జర్నలిస్టులకు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహాసభను నిర్వహిస్తున్న ప్రాంగణానికి కరోనాతో మృతి చెందిన నమసే ్తతెలంగాణ ఆదిబట్ల రిపోర్టర్ బృంగి శశివర్ణం పేరును నామకరణం చేశారు.
ఈ కార్యక్రమంలో టూరిజం చైర్మన్ శ్రీనివాస్గుప్తా, ఆదిబట్ల మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్తిక, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శేఖర్సాగర్, కార్యదర్శి గాదం రమేశ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, నాయకులు సీహెచ్. మహేందర్, అశోక్, రాజు, మహేందర్, క్రాంతి, పి.వెంకటేశ్, జర్నలిస్టులు పాల్గొన్నారు.