తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర సర్కార్ అహర్నిశలు కృషి చేస్తున్నది. ప్రాజెక్టులు, చెక్డ్యాంలను నిర్మించడంతో పాటు మిషన్కాకతీయ పేరుతో చెరువులు, కుంటలు, కాల్వలకు మరమ్మతులు చేసి పూర్వవైభవాన్ని తీసుకొచ్చింది. మూడు సంవత్సరాలుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో వికారాబాద్ జిల్లాలోని కోట్పల్లి ప్రాజెక్టు కింద ఉండే కాలువలన్నీ కొట్టుకుపోవడంతో తక్కువ విస్తీర్ణానికి సాగు నీటిని అందించాల్సి వస్తున్నది. 2 టీఎంసీల సామర్థ్యంగల ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్నా సాగునీటిని అందించలేకపోతున్నామని, ప్రాజెక్టు ఆధునీకరణ కోసం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేసిన కృషితో జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేయగా రాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఆనకట్ట బలోపేతం, కుడి, ఎడమ, బేబీ కాలువల పునర్నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.38.54 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. వారం, పది రోజుల్లోగా ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతులు వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, వానకాలంలోగా పనులను పూర్తి చేసేలా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
– వికారాబాద్, జనవరి 23, (నమస్తే తెలంగాణ)
వికారాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిని అందించడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నది. గత మూడేండ్లుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పంటలను సాగు చేసే రైతులు సాగు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రాజెక్టులు, ప్రధాన చెరువుల నుంచి వెళ్లే కాలువలు పూర్తిగా పాడై సాగు నీరందించే పరిస్థితి లేకపోవడంతో సాగు నీరందించలేకపోతున్నారు.
జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్పల్లి ప్రాజెక్టుకు గత రెండు, మూడేండ్లుగా భారీగా వరద వస్తుండడంతోపాటు సంబంధిత ప్రాజెక్టు కింద ఉండే కాలువలన్ని కొట్టుకుపోవడంతో కోట్పల్లి ప్రాజెక్టు నుంచి చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు నీరందిస్తూ వస్తున్నారు. 2 టీఎంసీల సామర్థ్యంగల కోట్పల్లి ప్రాజెక్టులో పుష్కలంగా నీరున్న కాలువలు పూర్తిగా కొట్టుకుపోవడం, దెబ్బతినడంతో రైతులకు నష్టం జరుగకూడదనే లక్ష్యంతో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు సంబంధించి ప్రభు త్వం దృష్టికి తీసుకుపోవడం.. ప్రభుత్వ ఆదేశాలతో వెంటనే జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్తోపాటు అధికారుల బృందం పరిశీలించి ఏయే పనులు చేపట్టాలనే సమగ్ర నివేదికను అందజేయడంతో కోట్పల్లి ప్రాజెక్టు మరమ్మతులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
రూ.38 కోట్లతో ప్రాజెక్టు ఆధునీకరణ
జిల్లాలో సాగు నీరందించే ప్రధాన ప్రాజెక్టు అయిన కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించిన కోట్పల్లి ప్రాజెక్టును గత పాలకులు పూర్తిగా విస్మరించారు. ప్రధానంగా ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి కృషితో సీఎం కేసీఆర్ కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులకు సంబంధించి ప్రభుత్వానికి జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలను అందజేశారు. వారం, పది రోజుల్లోగా ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశమున్నట్లు తెలిసింది. ఆ తరువాత వెంటనే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి, పనులు ప్రారంభించేలా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
ఎట్టిపరిస్థితుల్లోనూ వానకాలంలోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించారు. రూ.38.54 కోట్ల నిధులతో కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణతోపాటు ఆనకట్ట బలోపేతం, కుడి, ఎడమ, బేబీ కాలువల పునర్నిర్మాణం, మరమ్మతులు, కాలువల ఆధునీకరణ, కాలువల వెంబడి ముండ్ల పొదలు, మట్టిని తొలగించడం వంటి పనులు చేపట్టనున్నారు. ప్రధానంగా తాండూరు నియోజకవర్గంతోపాటు వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూరు మండలంలోని పలు గ్రామాలకు సాగు నీరందించనున్నారు. కోట్పల్లి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా 8100 ఎకరాలు, ఎడమ, బేబీ కాలువ ద్వారా 1100 ఎకరాలకు సాగు నీరందించే కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు పూర్తైతే 15 వేల ఎకరాలకుపైగా సాగు నీరందించే అవకాశాలున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
1964లో కోట్పల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1964లో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి పెద్దేముల్ మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కోట్పల్లి ప్రాజెక్టు 24 అడుగుల లోతు, 1784 ఎకరాల్లో విస్తరించి ఉంది. సంబంధిత ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు. కోట్పల్లి ప్రాజెక్టు ద్వారా కుడి, ఎడమ, బేబీ కాలువల ద్వారా 18 గ్రామాల ఆయకట్టుకు సాగు నీరందించాలని ప్రాజెక్టును నిర్మించారు. కుడి కాలువ ద్వారా 8100 ఎకరాలు, ఎడమ, బేబీ కాలువ ద్వారా 1100 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. కుడి కాలువ కింద ధారూరు మండలంలోని నాగసముందర్, అల్లాపూర్, రుద్రారం, బూర్గుగడ్డ, గట్టేపల్లి గ్రామాలుండగా, ఎడమ కాలువ కింద పెద్దేముల్ మండలంలోని మాన్సాన్పల్లి, బుద్దారం, పెద్దేముల్, మారెపల్లి, దుగ్గాపూర్, రుక్మాపూర్, కొండాపూర్, ఖానాపూర్, రేగొండి, మదవంతాపూర్, జనగాం, మంబాపూర్, తింసాన్పల్లి గ్రామాలున్నాయి. బేబీ కాలువ కింద నాగసముందర్, బూర్గుగడ్డ గ్రామాల ఆయకట్టుకు సాగునీరందించేలా నిర్మించారు.
ప్రతీ ఎకరాకు సాగు నీరందేలా చర్యలు
– ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
కోట్పల్లి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోని ప్రతీ గ్రామానికి సాగు నీరందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టాం. కోట్పల్లి ప్రాజెక్టు ఆధునీకరణకు సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులు ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు. త్వరలోనే అనుమతులు వస్తాయి. ఆ తరువాత వెంటనే పనులు ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడుతాం.