CJP protest : కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో సోమవారం ఛలో సంసద్ పేరుతో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు, కేంద్ర బలగాలు దాడి చేయగా.. పోలీసులపై కూడా ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనల్లో పోలీసు కొన్ని వాహనాలు ధ్వంసంకాగా, పలువురు సిబ్బంది గాయపడ్డారు. దీంతో ఇప్పుడు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేస్తున్నారు.
ఈ హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులు, భద్రతా దళాలపై దాడులు, పోలీసు, ప్రభుత్వ వాహనాల ధ్వంసం, ప్రజా ఆస్తుల ధ్వంసం వంటి నేరాలపై ఈ ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ ఘటనల్లో మొత్తం 118 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఇందులో కొందరు సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు 70 మందికిపైగా ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నౌట్ ప్లేస్ పోలీస్ స్టేషన్, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్తోపాటు ఇతర పోలీస్ స్టేషన్లలో ఈ ఐదు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరేయడం, హింసకు కుట్ర పన్నడం, సిబ్బందిపై దాడి చేయడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి వాటిపై కూడా కేసు నమోదు చేశారు.
ఆందోళనలో హింసకు పాల్పడిన నిందితుల్ని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అలాగే, మొబైల్ ఫోన్ రికార్డింగ్ వీడియోల్ని కూడా పరిశీలిస్తున్నారు. మొత్తం 250కిపైగా వీడియోల్ని విశ్లేషిస్తున్నారు. ఈ ఆందోళనకు ప్రాధాన్యం ఇచ్చిన వాట్సాప్ గ్రూపులపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. మరోవైపు సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలో తన చేయి విరిగిపోయిందని ఆర్ఏఎఫ్ అసిస్టెంట్ మహిళా కమాండెంట్ సోనియా షెరావత్ తెలిపారు. సీజేపీ నిరసన సందర్భంగా తొక్కిసలాటలో మహిళా ఆందోళనకారుల్ని రక్షించేందుకు తాను ప్రయత్నించానని, కానీ, తనపై దాడి జరిగిందని ఆమె వివరించారు. మంగళవారం కూడా పలుచోట్ల సీజేపీ కార్యకర్తల ఆందోళన కొనసాగుతోంది.