Karimnagar Road Accident | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారు నిజామాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖకు చెందిన ఐదుగురు సిబ్బంది కారులో వరంగల్ వైపు బయలుదేరారు. తాడికల్ గ్రామ శివారుకు చేరుకోగానే రహదారి పక్కన ఆగి ఉన్న లారీని కారు వేగంగా వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను నిజామాబాద్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న శేఖర్, విశ్వేశ్వరరావు, పర్షిగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్, మురళిని కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న హుజూరాబాద్ ఏసీపీ మాధవి, సీఐ శ్రీనివాస్, ఎస్సై శేఖర్రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంతో పాటు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.