New Delhi : దేశరాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరగడంతో ఒక మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు మరణించారు. ఈ ఘటన ఢిల్లీలోని లోధి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీకే దత్ కాలనీలో మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉదయం 10.21 గంటలకు స్థానిక పోలీసులకు బాధిత కుటుంబం ఫోన్ చేసింది. తాము అక్కడి బిల్డింగ్ పై అంతస్తులో ఉంటున్నామని, తమ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులకు ఫోన్ చేశారు.
బయటకు రావడానికి వీలు కావడం లేదని, లోపల మంటలు, పొగలో చిక్కుకుపోయామని, వెంటనే వచ్చి రక్షించాలని కోరారు. ఫోన్ కాల్లో ఉండగానే ఆమె గొంతు మారిపోయింది. కొంతసేపటికే ఫోన్ కాల్ కట్ అయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక వాహనాలు, మూడు అంబులెన్సులను అధికారులు సిద్ధంగా ఉంచి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించే సమయానికే మంటలు బిల్డింగ్ పై అంతస్థులో భారీగా వ్యాపించాయి. సహాయక చర్యలకు చాలా ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ ఫైర్ సిబ్బంది లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. కొంతసేపటికి మంటలు ఆర్పి, తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. కానీ, ఆ లోపే అందులోని ముగ్గురు మరణించారు.
ఒక మహిళ (45), ఆమె ఇద్దరు కూతుళ్లు (13 ఏళ్లు, 7 ఏళ్ల వయసు) అగ్నికి సజీవదహనమైన స్థితిలో మృతదేహాలు కనిపించాయి. మంటలు ఇంట్లోకి వేగంగా వ్యాపించడం వల్లే బాధితులు లోపల చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఫోరెన్సిక్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.