రంగారెడ్డి, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. మిషన్ కాకతీయ పథకంతో చెరువుల పునరుద్ధరణ, కాలువల ఏర్పాటుతో వ్యవసాయం లక్షలాది ఎకరాల్లో సాగవుతున్నది. దానితోపాటే వ్యవసాయ భూముల ధరల్లోనూ భారీ స్థాయిలో మార్పులొచ్చాయి. తెలంగాణ రాక ముందు ఎకరం భూమి వేలల్లో అమ్ముడుపోయేది. అలాంటిది ప్రస్తుతం ఊరు, పట్టణం, నగరం అనే తేడా లేకుండా ఎకరానికి రూ.లక్షలు, రూ.కోట్లాది ధరలు పలుకుతున్నాయి. హైదరాబాద్ మహానగరం విస్తృతమైనది. ఇరుగు పొరుగు జిల్లాలోని పలు ప్రాంతాలు కూడా మహానగరంలో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలుండగా..అందులో నాలుగు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరంలో ఆర్థికంగా, అభివృద్ధిలో, ఆధునిక టెక్నాలజీపరంగానూ మాదాపూర్, హైటెక్సిటీ, గచ్చిబౌలిలు ముందంజలో ఉన్నాయి. హైటెక్సిటీతోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లోనూ విలాసవంతమైన భవంతులు,ఆకాశాన్ని తాకే నిర్మాణాలు కన్పిస్తాయి. కానీ, అవి తక్కువే.. అయితే, రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలంలోని మో కిల, మీర్జాగూడ గ్రామాలు హైటెక్సిటీ, మాదాపూర్లను తలదన్నేలా ప్రగతి సాధిస్తున్నాయి. పలు నిర్మాణ సంస్థలు బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు, ఫామ్హౌస్లను నిర్మించాయి. ఇంకనూ వేలాది నిర్మాణాలు సాగుతున్నాయి. హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) పరిధి పెరుగడంతో నగర శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా నడుస్తున్నది.
మోకిల, మీర్జాగూడ గ్రామాల్లో..
మోకిల, మీర్జాగూడలు చిన్న గ్రామాలు. అక్కడ రియల్ ఎస్టేట్ రంగం అత్యద్భుతంగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఆనాటి రూపురేఖలు పూర్తి గా మారిపోయాయి. అవుటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఈ గ్రామాలు ఉండటంతో స్థానికంగా పెట్టుబడులు పెట్టేందుకు రియల్టర్లు, బిల్డర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొత్త, కొత్త వెం చర్లతో పలు నిర్మాణ సంస్థలు వెలుస్తున్నాయి. విల్లాలు, అపార్టుమెంట్లను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే వందలాదిగా అపార్టుమెంట్లు, విల్లాలు ఏర్పాటయ్యాయి.
హైటెక్ కంపెనీలు, దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఐటీ, బహుళ జాతి కంపెనీల నిర్వాహకులు మోకిల, మీర్జాగూడ గ్రామాల సమీపంలో భూములను కొనేందుకు, నిర్మాణాలు చేపట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్థానికంగా నిర్మితమైన భవంతులు, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తులతో ఈ గ్రామాలు మినీ పట్టణాలు, మినీ నగరాలను తలపిస్తున్నాయి. శంకర్పల్లి పరిధిలో రియ ల్ రంగం ఊపందుకున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభు త్వం కూడా అభివృద్ధికి చేయూతను అందిస్తున్నది.
మారిన గ్రామాల స్వరూపం..
తెలంగాణ ఏర్పాటు తర్వాత మోకిల, మీర్జాగూడ గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగి వాటి రూపురేఖలే మారిపోయాయి. హైటెక్సిటీ, మాదాపూర్లకు దీటుగా అభివృద్ధి చెందుతు న్నాయి. పల్లె ప్రగతి నిధులతో విశాలమైన సీసీరోడ్లు, వీధిదీపా లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పారిశుధ్యం తదితర అభివృద్ధి పనులు చేపట్టడంతో పట్టణీకరణ దిశగా సాగుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలతో గ్రామాల వాతావరణం పచ్చదనం, పరిశుభ్రతతో అలరారుతున్నది. విలాసవంతమైన భవంతు లు, పట్టణాలకు తీసిపోని విధంగా వసతులను కల్పించారు.
జోరందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై కేసీఆర్ సీఎం అయిన తర్వాత శంకర్పల్లి, మోకిల, మీర్జాగూడల్లో పెను మార్పులొచ్చాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో అభివృద్ధి పరుగులు పెడు తున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపా రం జోరందుకున్నది. విశాలమైన భవంతులు, ఫామ్హౌజ్లు వందలాదిగా వెలుస్తున్నాయి. మరి కొన్ని బహుళ అంతస్తులు నిర్మాణంలో ఉన్నాయి.
– గోవర్ధన్రెడ్డి, ఎంపీపీ, శంకర్పల్లి
ప్రగతిపథంలో గ్రామాలు
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గ్రామాలు అభివృద్ధి పథంలో ముం దుకు దూసుకెళ్తున్నాయి. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను ఆయా గ్రామాల సర్పంచ్లు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను చేపడుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వా తే శంకర్పల్లి పరిసరాల్లో అద్భుతమైన ప్రగతి జరుగుతున్నది.
– రవీందర్గౌడ్, మీర్జాగూడ,సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు
గతంలో అభివృద్ధి జరుగలేదు..
సీఎం కేసీఆర్ రాష్ర్టాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో అభివృద్ధి అం తంతే జరిగింది. పల్లెప్రగతి నిధులతో గ్రామాల్లో విశాలమైన సీసీ రోడ్లు, వీధి దీపా లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, పారిశుధ్యం తదితర అభివృద్ధి పనులు జరిగాయి.
– రాజూనాయక్, మాజీ చైర్మన్, శంకర్పల్లి