Vande Mataram : కేంద్రం ప్రవేశపెట్టిన వందేమాతరం బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గురువారం లోక్సభలో ఈ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారమే ఈ బిల్లు ఆమోదం పొందగా.. గురువారం లోక్సభలో ఆమోదం లభించింది. ఇప్పుడు ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ బిల్లును రాష్ట్రపతి ముందుకు పంపనుంది కేంద్రం. ‘ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ (అమెండ్మెంట్) బిల్, 2026 పేరుతో రూపొందిన ఈ బిల్లును జూలై 24న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది.
దీనికి జూలై 29న రాజ్యసభ ఆమోదం తెలిపింది. అనంతరం జూలై 30, గురువారం లోక్సభలో బిల్లు నెగ్గింది. ప్రతిపక్షాల నిరసనలు, ఆందోళనల మధ్యే ఈ బిల్లు మూజువాణి ఓటుతో సభలో ఆమోదం పొందడం విశేషం. నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై దాడి వంటి అంశాలపై లోక్సభలో వాడివేడి చర్చ జరుగుతుండగానే ఈ బిల్లును కేంద్రం పాస్ చేయించుకుంది. ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లు చట్టంగా మారాలంటే దీనికి రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న ‘ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971కి ఇది సవరణ బిల్లు. దీని ప్రకారం జాతీయ గీతమైన జనగణమనలాగే, జాతీయ గేయమైన వందేమాతరాన్ని కూడా గౌరవించాల్సి ఉంటుంది. ఈ గేయాన్ని అవమానపరిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.
భారత రాజ్యాంగం, జాతీయ పతాకం, జాతీయ గీతంలాగే ఇకపై జాతీయ గేయానికి కూడా చట్టబద్ధమైన రక్షణ, గౌరవం ఉంటుంది. ఈ చట్టం ప్రకారం.. వందేమాతరం గేయాన్ని అవమానిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొన్నిసార్లు జరిమానా కూడా విధిస్తారు. వందేమాతరం పాడేటప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆటంకం కలిగించినా, అడ్డుకున్నా కూడా శిక్షార్హులే. వందేమాతరం రాసి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ బిల్లును, ఆ గేయానికి గౌరవ సూచకంగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.