వికారాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. జిల్లావ్యాప్తంగా ఆ పనులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా మొదటి విడుతలో ఎంపికైన అన్ని పాఠశాలల్లో పనులు ప్రారంభమయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఊరు-మన బడి కార్యక్రమ పనుల కొనసాగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సందిగ్ధం నెలకొన్నది. మరోవైపు ఇప్పటివరకు స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన పనులు పూర్తైనా బిల్లులు రాకపోవడంతో పెండింగ్ చెల్లింపుల కోసం కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు.
ఈ విషయాన్ని సంబంధిత అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయి తే జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో 371 స్కూళ్లను ‘మన ఊరు-మన బడి’లో భాగంగా ప్రభుత్వం ఎంపిక చేయగా, 20 స్కూళ్లలో పనులు పూర్తై వాటిని ప్రారంభించగా.. మరో నాలుగు స్కూళ్లలో పనులను ప్రారంభించలేదు. మిగిలిన 347 స్కూళ్లలో పనులు 20 శాతం మేర పూర్తయ్యాయి. సంబంధిత పనులకు సంబంధించి రూ.10 కోట్ల చెల్లింపులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉన్నది. అయితే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తుందా.. రద్దు చేస్తుందా అనేది స్పష్టత రావాల్సి ఉన్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కడుపు నిండా భోజనం పెట్టేందుకు అమల్లోకి తీసుకొచ్చిన మధ్యాహ్న భోజన పథకానికి కూడా నిధులు రావడం లేదు. గత మూడు నెలలుగా మధ్యాహ్న భోజన పథకానికి నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సెప్టెంబర్ నెల నుంచి మధ్యాహ్న భోజన పథకానికి నిధులు రావాల్సి ఉన్నది. గత మూడు నెలలలుగా రూ.1.06 కోట్ల నిధులు పెండింగ్లో ఉన్నాయి.
మన ఊరు-మన బడి కార్యక్రమంతో జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మారిపోయాయి. సర్కారు స్కూళ్లలో సకల వసతు లు కల్పించడంతో కార్పొరేట్కు దీటుగా రూపుదిద్దుకున్నాయి. మొదటి విడుతలో జిల్లాలోని మండలానికి, మున్సిపాలిటీకి రెండు చొప్పున ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా అందులోని 20 బడుల్లో తాగునీరు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, విద్యుత్తు, గ్రీన్ చాక్బోర్డులు, పెయింటింగ్, ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణం, శిథిలమైన తరగతి గదుల స్థానం లో కొత్తవి, డిజిటల్ విద్యకు అవసరమైన ఏర్పాట్లు, ఉన్నత పాఠశాల ల్లో డైనింగ్ హాళ్లు తదితర వసతులను అందుబాటులోకి తీసుకొచ్చారు.
అయితే జిల్లావ్యాప్తంగా 1054 ప్రభుత్వ పాఠశాలలుండగా వీటిలో మొదటి విడుతలో 371 స్కూళ్లలో అవసరమైన వసతులను కల్పిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి విడుతలో ఎంపిక చేసిన స్కూళ్లలో ఉన్నత పాఠశాలలు-111, ప్రాథమికోన్నత పాఠశాలలు-40, ప్రాథమిక పాఠశాలలు-220 ఉన్నాయి. మరోవైపు ‘మన ఊరు-మన బడి’లో భాగంగా పనులు జరుగుతున్న జిల్లాలోని 160 స్కూళ్లకు నియమించిన నైట్ వాచ్మెన్ల కొనసాగింపు కూడా అయోమయంలో పడిపోయింది.