షాబాద్, ఫిబ్రవరి 3 : ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నది. శుక్రవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 17,131 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది కంటి వెలుగు క్యాంపుల ద్వారా కంటి పరీక్షలు చేస్తున్నారు. ఆయా క్యాంపులను జిల్లా, డివిజన్ స్థాయి, ఆరోగ్యశాఖ అధికారులు, మండలాల అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లాలో 17,131మందికి..
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 17,131మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,596 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 2,281 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు.
వికారాబాద్ జిల్లాలో 5709 మందికి..
వికారాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : కంటి వెలుగు కార్యక్రమం రెండో విడుత వికారాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నది. జిల్లాలోని 42 కేంద్రాల్లో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహిస్తున్నాయి. కంటి సమస్యలతో వచ్చే వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునే విధంగా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కండ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం జిల్లాలో 5709 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 961 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 762 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఆర్థిక స్థోమత లేక వైద్య పరీక్షలు నిర్వహించుకోలేని నిరుపేదల్లో కంటి వెలుగు ధైర్యం నింపుతున్నది.
పేదలకు ఎంతో ఉపయోగం
ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో పరీక్షలు నిర్వహించుకునే పరిస్థితి లేక గ్రామీణ, పేద ప్రజలు కంటి చూపుపై అశ్రద్ధ వహించి కంటి చూపును కోల్పోతున్నారు. అటువంటి వారికి ఈ కార్యక్రమం ఎంతో మేలు. ప్రైవేటు దవాఖానకు వెళితే ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఈ కంటి వెలుగు కార్యక్రమంతో కంటిని పరీక్షించుకొని అద్దాలు, మందులును తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు.
– లక్ష్మణ్, లగచెర్ల, బొంరాస్పేట, కొడంగల్
పైసా ఖర్చులేకుండా కంటిని పరీక్షిస్తుండ్రు..
కంటి వెలుగులో మంచిగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏమైన కంటి ఇబ్బంది ఉంటే అద్దాలు, మందులు ఇవ్వడమే కాకుండా కండ్లను ఏవిధంగా కాపాడుకోవాలో చెబుతున్నారు. బీదోళ్లకు కంటి పరీక్ష చేసుకోవడం ఇబ్బందిగానే ఉంటుంది. జ్వరం ఇంకేమైనా అయితే ప్రభుత్వ దవాఖానలకు వెళ్లి పైసా ఖర్చులేకుండా చూపించుకొంటాం. కంటి సమస్య ఉంటే పట్టణాలకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేటుల్లో చూపించుకొనే పరిస్థితి లేదు. కంటి వెలుగుతో మాలాంటి వాళ్లం కంటి చూపును పొందుతున్నాం.
– దేవీబాయి, పాతకొడంగల్ తండా, కొడంగల్
‘కంటి వెలుగు’తో మెరుగైన వైద్యం
కంటి వెలుగు కార్యక్రమం ద్వారా మసకబారిన కండ్లల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ పేదల ముంగిట్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. కార్పొరేటు స్థాయిలో వైద్యం అందించడమే కాకుండాపేదల ఆర్థికభారాన్ని, సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఉచితంగా వైద్యం, మందులు, అద్దాలను అందిస్తున్నారు. దీంతో మా కంటి సమస్యలు పూర్తిగా తొలగనున్నాయి.
– రాములు, యాలాల గ్రామం, యాలాల మండలం
రూ.200కోట్లతో గ్రామాల్లో సేవలు
తెలంగాణను ఆరోగ్య దిశగా రూ.200 కోట్లతో కంటివెలుగుకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. కంటి సమస్య నివారణ మార్గాలను తెలియజేయడమే కాకుండా వారికి అవసరమైన మందులు, అద్దాలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తున్నది. అవసరమైన వారికి హైదరాబాదులో ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించనున్నది.
– చంద్రకాంత్, యాలాల గ్రామం