కొడంగల్, సెప్టెంబర్ 8 : సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ఇప్పటికే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి దిగ్విజయంగా అమలు చేస్తున్నది. నియోకవర్గంలోని తండాల్లో మెటల్ రోడ్లను నిర్మించడానికి ప్రభుత్వం రూ.21.80 కోట్లను మంజూరు చేసింది. ఈ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకొంటున్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామపంచాయతీ నిధులతో సీసీ రోడ్లను నిర్మించడంతో గ్రామాల రూపురేఖలు మారాయి. ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల్లో అంతర్గత రహదారులు అధ్వానంగా ఉండేవి. వానకాలం వస్తే బురదమయంగా మారిన ప్రజలు అవస్థలు పడేవారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాతే పల్లెలు సీసీ రోడ్లతో కళకళలాడుతున్నాయి. నాలుగేండ్ల కిందట 500 జనాభా ఉన్న తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించిన ప్రభుత్వం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నది. ఈ నిధులతో తండాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లను నిర్మిస్తున్నారు. ఒకప్పుడు గ్రామాలకు అనుబంధంగా ఉంటూ అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన తండాలు నేడు సీఎం కేసీఆర్ కృషితో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. తండావాసుల ఏండ్ల నాటి కల సాకారం.. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, తండాల ప్రజల ఏండ్ల నాటి కల బీటీ రోడ్లను నిర్మించారు. గ్రామాలు, తండాల వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కొడంగల్ మండలంలోని టేకల్కోడ్ నుంచి టేకుల్కోడ్ తండాకు రూ. కోటీ 30 లక్షలు, నందిగామ నుంచి ఆశిరెడ్డిబాయితండా వరకు రూ.65 లక్షల 20 వేలు, బొంరాస్పేట మండలంలోని బోజనగడ్డ తండా నుంచి మైసమ్మగడ్డ తండాకు రూ. కోటీ 30 లక్షలు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి వాల్యనాయక్తండాకు రూ.65 లక్షల 20వేలు, బాపల్లతండా నుంచి సీత్యానాయక్తండాకు రూ.కోటీ 30 లక్షలు, మదన్పల్లితండా నుంచి ఇబ్రహీంపూర్ తండాకు రూ.97లక్షల 80వేలు, ఎన్హెచ్ ఆర్అండ్బీ 63 నుంచి బాపన్చెరువు తండాకు రూ.కోటీ 63 లక్షలు, ముడిమామిల్లతండా నుంచి దీప్లనాయక్తండా వరకు రూ.84లక్షల 76వేలను ప్రభుత్వం మంజూరు చేసింది. హంసాన్పల్లి బీటీ రోడ్డు నుంచి సత్తర్కుంటతండా, బొల్లిబాయితండా వరకు రూ.2కోట్ల 61లక్షలు, దౌల్తాబాద్ మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి కిష్టాన్యాక్తండా వరకు రూ. కోటీ 30 లక్షలు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి వాల్కితండా వరకు రూ.78లక్షల 25 వేలు, కోస్గి మండలంలో చింతగట్టు తండా నుంచి హనుమాన్పల్లి వరకు రూ. కోటీ 30 లక్షలు, మద్దూర్ మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి మెడికుంట తండాకు రూ.3 కోట్ల 91లక్షలు, అక్కయిపల్లి నుంచి చెల్లపూర్ వయా లక్కాయిపల్లి తండాకు రూ.3 కోట్ల 2 లక్షలు మొత్తం రూ.21కోట్ల 80 లక్షల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు.
కొడంగల్ మండల పరిధిలో రుద్రారం నుంచి పాటిమీదిపల్లి బీటీ రోడ్డుకు రూ.2 కోట్ల 70 లక్షలు, అంగడిరైచూర్ నుంచి ధర్మాపూర్ బీటీ రోడ్డుకు రూ. 2 కోట్లు 70 లక్షలు, ఖాజాఅహ్మద్పల్లి వరకు అప్రోచ్ రోడ్డు రూ.60 లక్షలు, బొంరాస్పేట మండలంలో జానకంపల్లి వరకు అప్రోచ్ రోడ్డుకు రూ.కోటీ 60 లక్షలు, దౌల్తాబాద్ మండలంలో ఆర్అండ్బీ రోడ్డు నుంచి బిచ్చాల్ రోడ్డుకు రూ.2 కోట్ల 25 లక్షలు, నందారం నుంచి కౌడీడ్ బీటీ రోడ్డుకు రూ.కోటీ 50 లక్షలు, బాలంపేట నుంచి అంతారం గ్రామానికి బీటీ రోడ్డుకు రూ.80 లక్షలు మంజూరయ్యాయి. పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రామకుంట తండాకు రూ.కోటీ 20 లక్షలు, మద్దూర్ మండలంలో దుప్పటిఘాట్ నుంచి అల్లిపూర్ వరకు రూ.2 కోట్లు 80 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పర్సాపూర్ వరకు రూ.కోటీ 40 లక్షలు, పల్లెర్ల పీఆర్ రోడ్డు నుంచి నాగంపల్లి గ్రామం వరకు రూ.60 లక్షలు మంజూరయ్యాయి. బీడబ్ల్యూడీ రోడ్డు నుంచి భీంపురం వరకు రూ.85 లక్షలు, కోస్గి మండలంలోని గుండుమాల్ నుంచి ముదిరెడ్డిపల్లి గ్రామానికి రూ.కోటీ 80 లక్షలు నిధులు మంజూరయ్యాయి.
బీటీ రోడ్డును నిర్మించడంతో ఎన్నో ఏండ్ల కల సాకారమైంది. ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రతి పల్లెకు బీటీ రోడ్డు వేయించారు. ప్రస్తుతం పాటుమీదిపల్లి గ్రామానికి రావడానికి రుద్రారం వరకు బీటీ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. అక్కడి నుంచి మా గ్రామానికి వచ్చేందుకు ఎమ్మెల్యే రూ.2.కోట్ల70లక్షలతో బీటీ రోడ్డు మంజూరు చేయించారు. ఎమ్మెల్యే, సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– బాలమణి, సర్పంచ్, పాటుమీదిపల్లి (కొడంగల్)
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా. ప్రతి పల్లెకు రోడ్డును నిర్మించాం. పల్లెల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలనూ నిర్మించాం. గత నెలలో బీటీ రోడ్లగాను రూ.20కోట్ల 80లక్షల నిధులు మంజూరయ్యాయి. మళ్లీ తండాలకు బీటీ రోడ్ల కోసం ఇటీవల రూ.21కోట్ల 80లక్షలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ‘మిషన్ భగీరథ’తో ప్రతి గ్రామం, తండాకు సరిపడా తాగునీరు సరఫరా అవుతున్నది. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.
– పట్నం నరేందర్రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే