షాబాద్, మే 3 : ప్రజల కంటి సమస్యలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. బుధవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 10,607 మందికి కంటి పరీక్షలు చేసినట్లు సంబంధిత వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో 80 బృందాల ద్వారా వైద్యసిబ్బంది తమకు కేటాయించిన గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేస్తున్నారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతో పాటు మందులు ఉచితంగా అందిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల్లో మొత్తం 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాల్లో 10,607 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో 441 మందికి కంటి అద్దాలు అందజేశారు.
బొంరాస్పేట : వికారాబాద్ జిల్లాలో 5202 మందికి కంటి పరీక్షలు చేయగా, వీరిలో 497 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేసి 566 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు 393 గ్రామాలు, 78 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
మా గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరంలో ముందుగా పరీక్షలు చేయించుకున్నా. మందులు, అద్దాలు ఉచితంగా ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు ప్రభుత్వం ప్రవేశపెట్టడం పేదలకు గొప్ప వరం. ముఖ్యమంత్రి కేసీఆర్కు మాలాంటి పేదలు రుణపడి ఉంటాం.
– ఎండీ.ఖాదీర్, ఊరెళ్ల, చేవెళ్ల మండలం, రంగారెడ్డి జిల్లా