గ్రామ రెవెన్యూ సహాయకులకు(వీఆర్ఏ) రాష్ట్ర సర్కార్ తీపి కబురందించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో వీఆర్ఏల రెగ్యులరైజేషన్కు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. క్రమబద్ధీకరణతోపాటు విద్యార్హతలను బట్టి ఆయా ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు వీఆర్ఏలకు రెగ్యులర్ పేస్కేల్ అమలు చేయడంతోపాటు పదోన్నతులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెడికల్ ఇన్వ్యాలిడేషన్కు అర్హులైనవారి వారసులకూ ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా కల్పించింది. సర్కార్ నిర్ణయంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీఆర్ఏలు సంబురాలు చేసుకుంటున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 863 మంది వీఆర్ఏలకు ప్రయోజనం కలుగనుండగా.. రంగారెడ్డి జిల్లాలో 614 మంది వీఆర్ఏలకు లబ్ధి చేకూరనున్నది. వీఆర్ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు ప్రక్రియను రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లోపు పూర్తి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
షాబాద్/బొంరాస్పేట, మే 19 : వీఆర్ఏలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెవెన్యూ శాఖలో పని చేస్తున్న వీఆర్ఏలను క్రమబద్ధీకరించాలని గురువారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో వారిని సర్దుబాటు చేయడం ద్వారా రెగ్యులర్ పే స్కేల్ ఇవ్వడంతో పాటు పదోన్నతులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వీఆర్ఏల విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని వీఆర్ఏల ఆకాంక్షను నెరవేర్చారు. ప్రభుత్వ నిర్ణయంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఐదేండ్లకోసారి వేతనాలను సవరించి పెంచడంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏలకు పేస్కేల్ ఇస్తూ వారి అర్హతలను బట్టి ప్రభుత్వ శాఖలైన మున్సిపల్, నీటి పారుదలశాఖ, రెవెన్యూ, జిల్లా పరిషత్, విద్యాశాఖ, మిషన్ భగీరథ, వైద్య తదితర శాఖల్లో నచ్చిన శాఖలో సర్దుబాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయడమే కాకుండా వారికి భవిష్యత్లో పదోన్నతులు కూడా వచ్చేలా చర్యలు తీసుకుంటుంది. మెడికల్ ఇన్వ్యాలిడేషన్కు అర్హులైన వారి వారసులకు కూడా ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం భరోసా కల్పించింది. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లోపు వీరి క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో వీఆర్ఏలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా చేవెళ్ల, షాద్నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల పరిధిలోని 27 మండలాల పరిధిలో మొత్తం 614 మంది వీఆర్ఏలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించనున్నట్లు కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లాలోని వీఆర్ఏలలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై ఉండి దరఖాస్తులు చేసుకున్న వారి వారసుల వివరాలు, విద్యార్హతలు సేకరించాలని సీఎం సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశించారు. మిగతా వారిని వారి అర్హతల ఆధారంగా మున్సిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, జడ్పీ, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో పే స్కేల్ ఇస్తూ, తదుపరి ప్రమోషన్ వచ్చేలా వారిని సర్దుబాటు చేయనున్నారు. వీఆర్ఏలలో వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం కల్పించనున్నారు. సీఎం తీసుకున్న నిర్ణయంతో వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. షాబాద్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు క్షీరాభిషేకం చేశారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలో 863 మంది వీఆర్ఏలకు ప్రయోజనం కలుగనున్నది. వీరంతా ప్రస్తుతం నెలకు రూ.10,500ల వేతనంతో పని చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరికి ప్రభుత్వం నెలకు రూ.6 వేలు వేతనం ఇస్తుండగా తెలంగాణ వచ్చిన తరువాత ప్రభుత్వం అందరికీ వేతనాలను పెంచినట్లే వీఆర్ఏలకు ఇస్తున్న వేతనాన్ని రూ.6 వేల నుంచి రూ.10,500లకు పెంచింది. 2020 సెప్టెంబర్లో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వీఆర్ఏలకు విద్యార్హతలను బట్టి పేస్కేల్ ఇస్తామని ఇచ్చిన హామీని నేడు నిలబెట్టుకున్నారు. మార్గదర్శకాలు త్వరలో విడుదలకానున్నాయి.
కొడంగల్, మే 19 : కల నెరవేర్చిన సీఎం కేసీఆర్కు వీఆర్ఏలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. శుక్రవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీఎం కేసీఆర్తో పాటు మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీఆర్ఏల కృషి ఎంతో ఉందన్నారు. వీఆర్ఏల కృషిని గుర్తించి సీఎం కేసీఆర్ పర్మినెంట్ చేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు.
పెద్దేముల్, మే 19 : వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తున్న సీఎం కేసీఆర్ కు వీఆర్ఏలమంతా జీవితాంతం రుణపడి ఉంటామని ఆయా గ్రామాల వీఆర్ఏలు అన్నారు. శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీఆర్ఏల కమిటీ ఉపాధ్యక్షుడు అమీరొద్దీన్, వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు రమేశ్, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి సమీర్, వీఆర్ఏల సంఘం జిల్లా కోకన్వీనర్ జనార్దన్, ఆయా గ్రామాల వీఆర్ఏలు శ్రీను, రవి, నర్సింహులు, వెంకటయ్య, అనిత, రాధ, మహాలక్ష్మి, అనంతలక్ష్మి, అంజిలప్ప తదితరులు పాల్గొన్నారు.
తాండూరు రూరల్, మే 19 : సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన మాట మేరకు క్రమబద్ధీకరిస్తామని ప్రకటించడం సంతోషకరమని వీఆర్ఏల సంఘం తాండూరు మండల అధ్యక్షుడు చంద్రప్ప అన్నారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతలను బట్టీ వీఆర్ఏలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేస్తూ జీవో ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరమైన విషయమన్నారు.
ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వీఆర్ఏల రెగ్యులరైజేషన్ ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. గ్రామ స్థాయిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్న వీఆర్ఏల సేవకు దక్కిన గౌరవం ఇది. వీఆర్ఏలమంతా సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
-అలివేలు, వీఆర్ఏ, తిర్మలాపూర్, షాబాద్ మండలం
రాష్ట్రంలోని 23 వేల మంది వీఆర్ఏల సమస్యలు పరిష్కారిస్తామని కేబినెట్లో తీర్మానం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు.
– సత్యనారాయణ, వీఆర్ఏల సంఘం రాష్ట్ర కన్వీనర్ (ధారూరు)
వీఆర్ఏల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. గ్రామాల్లో నిత్యం అందుబాటులో ఉండి సేవలందిస్తున్న వీఆర్ఏల సేవలను ప్రభుత్వం గుర్తించడం సంతోషకరం. ప్రభుత్వ నిర్ణయానికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– మల్లేశ్, వీఆర్ఏ, మద్దూరు, షాబాద్ మండలం
రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో రెగ్యులర్ స్కేల్ కల్పించేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉన్నది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వీఆర్ఏల సమస్య పరిష్కరించేలా సీఎం కేసీఆర్ కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉన్నది. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యావాదాలు.
– రాములు, వీఆర్ఏ, షాబాద్
వీఆర్ఏల సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. వీఆర్ఏలకు రెగ్యులర్ స్కేల్ కల్పించేలా చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 614 మంది వీఆర్ఏలకు లబ్ధి చేకూరనున్నది.
– ఎడ్ల వెంకటేశ్, రంగారెడ్డిజిల్లా వీఆర్ఏల జేఏసీ చైర్మన్
వీఆర్ఏల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం గొప్ప పరిణామం. మా కష్టాలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెబ్ సమావేశంలో అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరం. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– నరేశ్, వీఆర్ఏ, చందనవెళ్లి, షాబాద్ మండలం
వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. చాలా రోజుల నుంచి రెగ్యులరైజ్ కోసం ఎదురు చూస్తున్నాం. నేడు ప్రభుత్వం మా కోరికను నెరవేర్చింది. కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– మ్యాకల మోహన్, వీఆర్ఏ, దుద్యాల
బషీరాబాద్, మే 19 : వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం వీఆర్ఏలు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచిపెట్టారు. తెలంగాణ ప్రభుత్వంలో వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.
వీఆర్ఏలను రెగ్యులరైజ్ చేసి పే స్కేలు ఇస్తామని ప్రభుత్వం ప్రటించడం ఆనందంగా ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో రూ.6 వేలు ఉన్న వేతనాన్ని తెలంగాణ వచ్చిన తరువాత రూ.10,500లకు పెంచి ఆదుకున్నారు. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
-జ్యోతి, వీఆర్ఏ, బొంరాస్పేట
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం చెప్పడం సంతోషంగా ఉన్నది. జీతాలు పెరిగి మా బతుకులు మారనున్నాయి. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– మొగులయ్య, వీఆర్ఏ, చిల్ముల్మైలారం, దుద్యాల మండలం
మర్పల్లి, మే 19 : మర్పల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలంలోని వివిధ గ్రామాల వీఆర్ఏలు శుక్రవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల మండలాధ్యక్షుడు రవి యాదవ్, శ్రీహరి యాదవ్, నిరీక్షణ, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు..
యాచారం, మే 19 : వీఆర్ఏల సమస్యలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులర్ పే స్కేల్ కల్పించేలా చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మండలంలోని వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు యార జంగయ్య, వెంకటయ్య, శ్రీనివాస్, దార స్వామి, ముచ్చర్ల రాజ్కుమార్, బొడ్డు నాగరాజు, తేరటి నవీన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.