వికారాబాద్, జూన్ 2, (నమస్తే తెలంగాణ): రైతు సంక్షేమానికిగాను బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. తొమ్మిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేస్తూ వస్తున్నది. పంట పెట్టుబడి సాయం మొదలుకొని పంట చేతికొచ్చిన తరువాత ధాన్యం కొనుగోలు వరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తున్నది. వ్యవసాయానికి ఉచిత 24 గంటల నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నది. రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం.. మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా ఇప్పటికే రూ.50వేల వరకు పంట రుణాలను మాఫీ చేసింది. పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలుచేస్తున్నది. ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే సంబంధిత రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తుంది. మరోవైపు రైతుల సమస్యలు వాటి పరిష్కార మార్గాలను చర్చించడంతోపాటు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో మెళకువలు ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసేందుకు శిక్షణ కార్యక్రమాల కోసం జిల్లాలో రూ.21.78 కోట్లతో 99 రైతు వేదికలను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా సకాలంలో ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతుండడం గమనార్హం.
ఎకరాకు రూ.10వేల పెట్టుబడి సాయం..
రైతుబంధు పథకంతో ప్రతి ఏటా ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తుండడంతో పంట రుణాలకు బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేసే రోజులకు ప్రభుత్వం చెక్ పెట్టింది. రూ.2622 కోట్ల సాయాన్ని రైతులకు పెట్టుబడిని అందజేసింది. 2018 వానకాలం సీజన్లో 1,94,833 మందికి రూ.221కోట్లు, యాసంగిలో 1,75,989 మందికి రూ.206 కోట్లు, 2019 వానకాలం సీజన్లో 1,78,998 మందికి రూ.255 కోట్లు, యాసంగి సీజన్లో 1,71,824 మంది రైతులకుగాను రూ.194 కోట్ల పెట్టుబడి సాయాన్ని, 2020 వానకాలం సీజన్లో 2,113,341మంది రైతులకు రూ.297కోట్లు, యాసంగిలో 2,19,264 మంది రైతులకు రూ.301కోట్ల పెట్టుబడిని, 2021 వానకాలం సీజన్లో 2,25,438 మంది రైతులకుగాను రూ.300 కోట్ల ఆర్థికసాయాన్ని, యాసంగి సీజన్లో 2,24,928 మంది రైతులకు రూ.241కోట్ల పెట్టుబడిసాయాన్ని అందజేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వానకాలం సీజన్లో 2,47,707 మంది రైతులకు రూ.305కోట్ల రైతుబంధు సాయాన్ని, యాసంగిలో 2,43,447 మందికి రూ.299 కోట్ల పెట్టుబడిసాయాన్ని ఎకరాకు రూ.5వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
రైతుబీమా కింద రూ.213 కోట్లు..
రైతు ఆత్మహత్యలను నివారించేందుకుగాను ఏదేని రైతు మరణిస్తే సంబంధిత బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తూ.. ఆ కుటుంబాలకు సీఎం కేసీఆర్ భరోసాను కల్పిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు వివిధ కారణాలతో 4266 మంది రైతులు మరణించగా, సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.213.10కోట్లను మృతిచెందిన ఆయా కుటుంబ సభ్యులకు పరిహారాన్ని అందజేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 786 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.39.30 కోట్లు, 2019-20లో 812 మంది అర్హులుగా గుర్తించి రూ.40.60 కోట్ల సొమ్మును సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 2020-21లో 1201 కుటుంబాలకు రూ.60.05 కోట్లు, 2021-22లో 1047 కుటుంబాలకు రూ.52.35 కోట్లు, 2022-23లో 420 మంది రైతులు మృతి చెందగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.21కోట్ల బీమా సాయాన్ని నేరుగా సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు.
రూ.50వేలలోపు రుణమాఫీ..
అప్పుల ఊబిలో ఇరుక్కున్న రైతన్నను ఆదుకునేందుకుగాను రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి దఫా రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. రెండో దఫా రుణమాఫీలో భాగంగా రూ.50 వేల వరకు గల రుణాలను మాఫీ చేసింది. రెండో విడత రుణమాఫీలో భాగంగా రూ.25వేలలోపు రుణాలకు సంబంధించి 10,807 మందికి రూ.16.24 కోట్లు, రూ.25వేల నుంచి రూ.50వేల వరకుగల రుణాలకు సంబంధించి 27,628 మందికి రూ.78.04 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది.
3.31లక్షల ఎకరాల్లో పెరిగిన విస్తీర్ణం…
తొమ్మిదేండ్లలో 3.31 లక్షల ఎకరాల్లో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. 2014లో జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం 2.50 లక్షల ఎకరాల్లో ఉండగా, 2016లో 2.99 లక్షల ఎకరాల్లో ఉండగా, 2022 వానకాలం సీజన్ వరకు జిల్లాలో ఆయా పంటల సాగు విస్తీర్ణం 5,81,464 ఎకరాలకు పెరగడం గమనార్హం. 2016తో పోలిస్తే జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం 1,53,310 ఎకరాలు, వరి సాగు 1,04,658 ఎకరాలు, కంది 20వేల మేర సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలోని వికారాబాద్, తాండూరు, కులకచర్ల, దోమ, బొంరాసుపేట్, దౌల్తాబాద్, యాలాల, బషీరాబాద్, తాండూరు, పూడూరు మండలాల్లో ఆయా పంటల సాగు గణనీయంగా పెరిగింది.
పండుగ వాతావరణంలో నిర్వహించాలి
కార్యక్రమాలను జిల్లాలో ప్రతి చోటా పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ సెల్ కాన్ఫరెన్స్ ద్వారా నియోజకవర్గ నోడల్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులు, మండల స్థాయి అధికారులతో రైతు దినోత్సవ తుది ఏర్పాట్లపై సమీక్షించారు. ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా ప్రణాళికాబద్ధంగా ఈ వేడుకను చేపట్టి సమష్టి కృషితో విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. అన్ని శాఖల అధికారులు మమేకమవుతూ, రైతులందరూ తరలివచ్చేలా చూడాలని, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలన్నారు. ఆయా విభాగాల వారీగా నియమించిన ఇన్చార్జిలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రైతులకు చిన్నపాటి ఇబ్బంది సైతం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.