కరోనా వల్ల విద్యావ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసులు నిర్వహించినా అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో చదువులో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ‘ఇంటింటా చదువుల పంట’ కార్యక్రమానికి రాష్ట్ర సర్కార్ శ్రీకారం చుట్టింది.
ఈ యాప్ ద్వారా శనివారం ఇచ్చే వర్క్ షీట్లను తిరిగి శుక్రవారంలోగా పూర్తి చేసేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాదు తమ పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు కూడా తెలుసుకునే వీలున్నది. రంగారెడ్డి జిల్లాలోని 1338 పాఠశాలలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. కాగా, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 63,259 మంది బాలురు, 63,965 మంది బాలికలు ఇందులో పాల్గొననున్నారు. కార్యక్రమం పక్కాగా అమలయ్యేలా జిల్లా విద్యాశాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నది.
రంగారెడ్డి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : గత రెండేండ్లుగా జనాన్ని వణికించిన కొవిడ్, విద్యార్థుల భవితవ్యాన్ని కొంతమేరకు అంధకారం చేసింది. కొవిడ్ సమయంలో ఆన్లైన్లోనే ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధించేవారు. దీంతోపాటు విద్యార్థులు ఇంటి నుంచే చదువుకునేందుకు వీలుగా ‘ఇంటింటా చదువుల పంట’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. 1 నుంచి 10 తరగతుల వారు తమ వివరాలు నమోదు చేసుకొని ఎప్పటికప్పుడు పాఠ్యాంశాలపై పట్టు పెంచుకునేవారు. కరోనా తగ్గుముఖం పట్టాక యాప్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి కొన్ని సాంకేతిక మార్పులు చేశారు. ఈ శనివారం వినూత్న రీతిలో దీనిని తిరిగి అందుబాటులోకి తెచ్చారు. కరోనా మూలంగా వెనుకబడిన విద్యార్థులు, సామర్థ్యాలను కోల్పోయినవారు తిరిగి వారి శక్తిని, పునరుద్ధరించుకునేందుకు ప్రభుత్వం మరో అధునాతన కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థుల శక్తియుక్తులను పెంపొందించుకునేందుకు ఈ యాప్ ఇతోధికంగా సాయపడుతుందని అధికారులు ఆచరణలోకి తీసుకొచ్చారు.
తల్లిదండ్రులకు సైతం ఈ విధానంపై మంచి అవగాహన వచ్చి, తమ పిల్లలు ఏమి చదువుతున్నారో? ఎలా చదువుతున్నారో తెలుసుకునే వీలుంటుంది. ప్రతి వారానికి సంబంధించి ఆయా సబ్జెక్టులలో విద్యార్థి ప్రోగ్రెస్ను తల్లిదండ్రులు సరిచూసుకోవచ్చు. కొవిడ్ కారణంగా విద్యార్థులు గతంలో కోల్పోయిన సామర్థ్యాలను పెంచుకునేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడనుంది. జిల్లావ్యాప్తంగా 1338 పాఠశాలలు ఇందులో భాగస్వామ్యం పంచుకుంటున్నాయి. కాగా.. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 63,259 మంది బాలురు, 63,965 మంది బాలికలు ఇందులో పాల్గొననున్నారు.
వారాంతపు పరీక్ష ఎందుకు?
విద్యార్థులు ఒత్తిడి లేని వాతావరణంలో వారి ఇంటి వద్ద నుంచైతే.. వారంలో జరిగిన అంశాలపై అలవోకగా సాధన చేసేందుకు వీలుంటుంది. అందుకు అనుకూలంగా సమయం ఉంటుంది. గత రెండేండ్లుగా లోపించిన అభ్యసనా సామర్థ్యాలను ఇంటి నుంచే నేర్చుకుంటారు. దీని ద్వారా విద్యార్థి పురోగతి, పనితీరు, అపోహలు, స్వయంచాలకంగా మూల్యాంకనం చేయబడుతాయి.
విద్యార్థుల లోపాలను అధిగమించేలా ఉపాధ్యాయులు అంతర్ దృష్టిని ఉపయోగిస్తారు. ఈ విధానంలో ప్రతి వారం పాఠశాలలో బోధించే అంశాలను ఆచరించడంలో సహాయపడుతుంది. విద్యార్థుల సాధనపై సరైన ఫీడ్ బ్యాక్ అందిస్తుంది. ఈ తరహా అమలు విధానం రాష్ట్రం, జిల్లా, మండలం, స్కూల్, తరగతి వారీగా జరుగుతుంది.
పాఠశాలల వివరాలను తరగతులవారీగా సేకరించి, వారి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను ప్రధానోపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులో నమోదు చేస్తారు. ప్రతి శనివారం ఆయా పాఠ్యాంశాలపై రూపొందించిన ప్రశ్నల లింక్ను గ్రూపులో పొందుపరుస్తారు. 3-10 తరగతుల విద్యార్థులకు గణితం, ఆంగ్లం, సామాన్య, సాంఘిక శాస్ర్తాలకు సంబంధించి ఎనిమిది నుంచి పది ప్రశ్నలు ఉంటాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలతోపాటు ఈసారి ఉర్దూలోనూ పొందుపరుస్తున్నారు. విద్యార్థులు యాప్నకు సంబంధించిన లింక్ను తెరిచి జిల్లా, పాఠశాల పేరు గుర్తించి ప్రవేశ మీట నొక్కాలి. తర్వాత పేరు, తరగతి, సబ్జెక్టును ఎంపిక చేసుకున్నాక ప్రశ్నలు కనిపిస్తాయి. వాటికి సమాధానాలు తెలిపితే సరిపోతుంది.
ఒకే నంబర్పై అధిక సంఖ్యలో..
గతంలో ఒకే ఫోన్ నంబర్లో ఒక విద్యార్థి మాత్రమే ప్రవేశం పొందే వీలుండేది. ప్రస్తుతం ఈ యాప్ ద్వారా అధిక సంఖ్యలో చేరడానికి అవకాశం కల్పించారు. ఇందులో ఒకే నంబర్పై పలువురు విద్యార్థుల వివరాలను నమోదు చేసుకునే వీలుంది. శనివారం ఇచ్చే వర్క్ షీట్లను శుక్రవారంలోగా పూర్తి చేసేలా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలి. ఈసారి ఎంతమంది విద్యార్థులు పాల్గొంటున్నారో రాష్ట్ర విద్యా శాఖ ఆరా తీయనుంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో డ్యాష్ బోర్డు ద్వారా అధికారులు సమన్వయం చేయనున్నారు. ప్రతి విద్యార్థి ఇంటి వద్ద వర్క్ షీట్లు సాధన చేసేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి
ప్రతి శనివారం విద్యార్థులు విధిగా ఈ యాప్ కార్యక్రమంలో పాల్గొనాలి. ‘ఇంటింటా చదువుల పంట’ యాప్లో వచ్చే ప్రశ్నలను విద్యార్థులు సాధన చేసేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. వారాంతపు క్విజ్గా వివరించి క్రమం తప్పకుండా లింక్ చేరేలా శ్రద్ధ చూపాలి. ప్రతి నెలా నిర్వహించే విద్యా కమిటీ సభ్యుల సమావేశంలో ఈ విషయంపై ఉపాధ్యాయులు వివరించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యాలను పెంపొందించుకునేలా వారికి అవగాహన కల్పించాలి.
లోపించిన సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు..
కరోనా కారణంగా విద్యార్థుల్లో లోపించిన అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడానికి, విద్యార్థుల్లో స్వీయ అభ్యసనాన్ని వృద్ధిలోకి తెచ్చేందుకు ‘ఇంటింటా చదువుల పంట’ అనే కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్యార్థులు నేర్చుకున్న విషయాన్ని ఎంత వరకు సాధించారో తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. జిల్లాలో విద్యార్థులు ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తున్నది. వెనుకబడిన విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపుదలకు బాగా ఉపయోగపడుతుంది.
– సుశీంద్రరావు, జిల్లా విద్యాధికారి
‘ఇంటింటా చదువుల పంట’లో ప్రాక్టీస్ చేయడం షురూ చేయండిలా..