శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన ప్రత్యేక అభిషేకాలు, అర్చన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. రాత్రి భజన మండలి వారిచే భక్తి పాటల ఆలాపన, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి, బుధవారం పలు ఆలయాల్లో శివపార్వతుల కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన స్వామివారి కల్యాణ వేడుకలను కనులారా తిలకించారు. మామిడాకుల తోరణాలు, వివిధ రకాల పూలు, విద్యుద్దీపాలతో ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. పలుచోట్ల భక్తులకు అన్నదానం చేశారు.
-న్యూస్ నెట్వర్క్, మార్చి 2 (నమస్తే తెలంగాణ )
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శివాలయాల్లో శివపార్వతుల కల్యాణం కన్నుల పండుగగా జరిగాయి. ఉదయం నుంచే అర్చనలు, అభిషేకాలు చేయడంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. హరహర మహాదేవ, శంభో శంకర అన్న నినాదాలు శైవక్షేత్రాల్లో మార్మోగాయి. భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శివాలయాలకు భక్తులు పోటెత్తడంతో దుకాణాల వద్ద సందడి కనిపించింది. పలు ఆలయాల్లో జరిగిన కల్యాణోత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్, మార్చి 2 : వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి సమీపంలోని పార్వతీపరమేశ్వరుని ఆలయం, పీరంపల్లిలోని బుగ్గ రామలింగేశ్వరాలయాల్లో శివపార్వతుల కల్యాణాలు కన్నుల పండువగా జరిగాయి. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ కల్యాణానికి వికారాబాద్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టు పక్కల మండలాలకు చెందిన ప్రజలు హాజరయ్యారు. ఆలయ ఆవరణలో వెలసిన దుకాణాల వద్ద జనసందడి కనిపించింది. పులుసుమామిడి ఆలయంలో జరిగిన కల్యాణానికి ఎమ్మెల్యే ఆనంద్ పట్టు వస్ర్తాలు సమర్పించారు.
కడ్తాల్, మార్చి 2 : మండల కేంద్రంతోపాటు మైసిగండి, ఏక్వాయిపల్లి, రావిచేడ్, చల్లంపల్లి గ్రామాల్లోని, శివాలయాల్లో పార్వతీపరమేశ్వరుల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయాల్లో ఉదయం అభిషేకాలు, అర్చనలు చేశారు. భజన మండలి వారిచే భక్తి పాటల ఆలాపన, భజనలు, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏక్వాయిపల్లి గ్రామంలోని మల్లన్నగుట్టపై స్వామి వారి కల్యాణం వైభవంగా జరిగింది. మండల కేంద్రంలోని శివాలయంలో ఘనంగా స్వామి వారి కల్యాణాన్ని నిర్వహించారు. పుస్తె మెట్టెలను కృష్ణమూర్తి అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ శిరోలీ, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, భారతమ్మ, యాదయ్య, ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, ఉప సర్పంచ్లు రామకృష్ణ, వినోద్, ముత్యాలు, ఆలయ నిర్వాహకులు భాస్కర్నాయక్, అరుణ్కుమార్, భాస్కర్రెడ్డి, చందోజీ తదితరులు పాల్గొన్నారు.
యాచారం, మార్చి 2 : మండలంలోని నందివనపర్తి గ్రామంలోని నందీశ్వర క్షేత్రం, సిద్దేశ్వరాలయాల్లో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఎదుర్కోలు, కల్యాణం, ఊరేగింపు కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉదయశ్రీ, ఎంపీటీసీ రజిత, టీఆర్ఎస్ నాయకుడు శేఖర్రెడ్డి, వెంకటేశ్వర్లు పూజలు నిర్వహించారు.
హయత్నగర్ రూరల్, మార్చి 2 : పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ తట్టిఅన్నారంలోని శివాలయంలో శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఓం నమః శివాయ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ప్రత్యేక పూజల్లో కౌన్సిలర్ దేవిడి గీతా వేణుగోపాల్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కే మహేందర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.