రంగారెడ్డి, ఏప్రిల్ 6, (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం బషీర్బాగ్లోని తన కార్యాలయంలో రంగారెడ్డి జిల్లాలో అమలవుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో మొదటి దశలో 464 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు, ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేసి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. రానున్న విద్యాసంవత్సరం ప్రారంభంలోగా పాఠశాలల్లో మార్పు కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా డిజిటల్ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నదని మంత్రి తెలిపారు. మన ఊరు-మన బడిలో భాగంగా చేపట్టిన పనులన్నీ పూర్తయితే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు తప్పవని మంత్రి సబితారెడ్డి హెచ్చరించారు. పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని, నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకుగాను రూ.7289 కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. సమావేశంలో కలెక్టర్ అమయ్కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాండురంగారెడ్డి పాల్గొన్నారు.