తెలంగాణలో జరుగుతున్న ఐటీ రంగం అభివృద్ధిని విదేశీ ప్రభుత్వాలు, అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు, కేంద్రప్రభుత్వం, పలు రాష్ర్టాల సీఎంలు కీర్తించారు. రాష్ర్టావతరణ తర్వాత ఎనిమిదేండ్లలోనే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. ఐటీ రంగంలో మరింతగా ముందుకెళ్తూ ప్రపంచంతో పోటీపడుతున్నది.
హైదరాబాద్లో కొత్త ‘టీ-హబ్’ ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు అభినందనలు. భారత స్టార్టప్ ఎకోసిస్టమ్కు ఇది గొప్ప ఊతమిస్తుంది.
– రతన్ టాటా
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్టేట్ స్టార్టప్ ర్యాంకింగ్-2021లో తెలంగాణ టాప్ పెర్ఫార్మర్గా నిలిచిం ది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), స్టార్టప్ ఇండియా ఆధ్వర్యంలో వివిధ క్యాటగిరీల్లో నిర్వహించిన పోటీల్లో నెగ్గి తెలంగాణ ఈ అవార్డును సొంతం చేసుకున్నది. ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ మాటలు గుర్తుకొస్తున్నాయి. ‘కులాల కొట్లాటలు కాదు, తెలంగాణకు పెద్ద కంపెనీలు రావాలి. మతాల మంటలు కాదు. మన పిల్లలు మల్టీ మిలియనీర్లు కావాలి. తెలంగాణ బిడ్డలు కొలువులు చేసే స్థాయి నుంచి కొలువులిచ్చే స్థాయికి ఎదగాలి’.
విజన్తోనే విప్లవాత్మక మార్పులు: తెలంగాణ ఏర్పడే నాటికి 2014-15లో ఐటీ ఎగుమతులు రూ.57,258 కోట్లు మాత్రమే. ఈ ఎనిమిదేండ్లలో రూ.1,45,522 కోట్లకు పెరిగి, ఉద్యోగుల సంఖ్య దాదాపు 7 లక్షలకు చేరిం ది. దీనికి అనుబంధంగా మరో 10-15 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. కేవలం ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఐటీ రంగంలో రూ.30 వేల నూతన ఉద్యోగాల కల్పన జరిగింది. అంతేకాదు ఐటీ రంగం దేశం లో 10 శాతం వృద్ధి నమోదు చేస్తే, తెలంగాణ 13 నుంచి 14 శాతం నమోదు చేసింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ నివేదికలో పనితీరు విభాగంలో తెలంగాణ 4వ స్థానంలో నిలవటం గమనార్హం.
వినూత్న ఆలోచనలకు దన్నుగా టీ హబ్, టీహబ్ 2.0:
ఐటీ రంగంలో హైదరాబాద్ కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని మంత్రి కేటీఆర్ నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఐటీ రంగానికి మౌలిక వసతులను కల్పిస్తూనే, వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగానే 2015 లో టీ హబ్, ఇటీవల టీహబ్ 2.0ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ టీహబ్ 2.0 ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్. టీ హబ్ ద్వారా ఇప్పటికే 3వేలకు పైగా కొత్త స్టార్టప్లు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ హైదరాబాద్ (రిచ్) పేరుతో ఇంక్యుబేటర్ను ప్రారంభించింది. తెలంగాణ ఇన్నోవేషన్ ఫండ్ (టీ ఫండ్)ను ఏర్పాటుచేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పెట్టుబడిదారుల సహకారంతో స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నది. అంతేకాకుండా వీ హబ్, టీ వర్క్స్, టాస్క్, టీ ఇన్నోవేషన్ వంటి సంస్థలను స్థాపించి ఐటీ రంగంలో ముందుకుపోతున్నది.
అభివృద్ధే ధ్యేయం: ఐటీ రంగం భవిష్యత్తు వృద్ధిని చాటే కమర్షియల్ ఆఫీస్ స్పేస్ విషయంలోనూ తెలంగాణ బెంగళూరును దాటిపోయింది. ఇక ఎలక్ట్రానిక్, రూరల్ టెక్నాలజీ, ఇమేజ్, డేటాసెంటర్ లాంటి వివిధ రంగాలలో తెలంగాణ ప్రత్యేకమైన పాలసీలతో ముందుకెళ్తోంది. అందుకే హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీలు వాటి కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం, ఒరాకిల్ వంటి అనేక బహుళజాతి సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు నడుపుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలెన్నో తెలంగాణలో ఉన్నాయి. అంతేకాకుండా ఐటీ దిగ్గజం గూగుల్ సంస్థ రూ.1,000 కోట్ల పెట్టుబడితో తమ క్యాంపస్ను నెలకొల్పింది. అలాగే అమెజాన్, యాపిల్ కంపెనీలు తమ కార్యాలయాలను నెలకొల్పాయి. ప్రపంచంలోని అగ్రశేణి ఐదు ఐటీ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫేస్బుక్, సేల్స్ఫోర్స్ తమ రెండో అతిపెద్ద కార్యాలయాలను తెలంగాణలో ఏర్పాటు చేశాయి.
ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ కంపెనీలు: కేటీఆర్ కృషి కారణంగా ఐటీ పరిశ్రమ హైదరాబాద్కే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు, నగరాలకు విస్తరిస్తున్నది. వీ హబ్, టీ హబ్లతో ఐటీ కంపెనీలు రాష్ట్రంలోని పలు పట్టణాలవైపు పయనిస్తున్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఐటీ కంపెనీలు ఇప్పటికే తమ సంస్థలను నెలకొల్పాయి. సిద్దిపేట, నల్గొండలో ఐటీ హబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరలో మరిన్ని జిల్లా కేంద్రాల్లో ఐటీ హబ్లు నిర్మించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఐటీలో కొత్తగా వస్తున్న డిజిటల్ ఉపరంగాలైన ఏఐ, ఎంఎల్, సాస్, గేమింగ్, ఫిన్టెక్ వంటి వాటిల్లో మన యువత ప్రతిభ చూపుతున్నది. అందుకే హైసియా, నాస్కామ్, నీతి ఆయోగ్ వంటి సంస్థలు తెలంగాణ ఐటీ పురోగతిని మెచ్చుకుంటున్నాయి.
పురోగమన ప్రోత్సాహకాలు: జిల్లాల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు ఇస్తున్నది. పంచాయతీ /మున్సిపల్ పన్నులతోపాటు స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు తిరిగి చెల్లింపు, విద్యుత్ కేటగిరీ మార్పు వంటి రాయితీలు ఇస్తున్నది.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక విధమైన అణచివేత ఎదురైతే, నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల కక్ష్యపూరితంగా, వివక్షతో వ్యవహరిస్తున్నది. నిధుల కేటాయింపులోనూ, పన్ను ఆదాయాలను పంచటంలోనూ అన్యాయం చేస్తున్నది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) కేటాయింపుల్లో ఒక్కదాన్నీ తెలంగాణకు కేటాయించలేదు. వివిధ రాష్ర్టాలకు 22 ఎస్టీపీఐలను కేటాయించిన కేంద్రం.. తెలంగాణకు ఒక్కటికూడా కేటాయించకపోవడం వివక్ష కాక మరేమవుతుంది. కేంద్రం ఎన్నో విధాలుగా తెలంగాణపై వివక్ష చూపుతున్నా.., తెలంగాణ మాత్రం వికాసం వైపే పయనిస్తుంది.
తెలంగాణకు చెందిన మూడు స్టార్టప్లు నేషనల్ స్టార్టప్ అవార్డ్స్-2020ను గెలుచుకున్నాయి. తాజాగా కేంద్రం ప్రకటించిన అవార్డుల్లోనూ టాప్ పెర్ఫార్మర్ అవార్డుతో పాటు ఇన్స్టిట్యూషనల్ ఛాంపియన్, ఇన్నోవేటివ్ లీడర్, ఇంక్యుబేషన్ హబ్, కెపాసిటీ బిల్డింగ్ పయనీర్ అంశాల్లోనూ జాతీయ స్థాయిలో స్థానం దక్కించుకుంది. టాప్ పెర్ఫార్మర్ క్యాటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఇదంతా సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కార్యదక్షత, ముందుచూపుతోనే సాధ్యమవుతున్నది.
– సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
(వ్యాసకర్త: చైర్మన్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ-వరంగల్)