మన్సూరాబాద్, అక్టోబర్ 17: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా ప్రవర్తించాడు. భార్య గొంతు కోసి చంపడమే కాకుండా.. తాను బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా, ఆమనగల్లు మండలం, ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన తెల్గమల రాజు (42) వివాహం 20 ఏండ్ల కిందట కందుకూరు మండలం, ముచ్చర్ల గ్రామానికి చెందిన సంతోష (38)తో జరిగింది. జీవనోపాధి కోసం నగరానికి వచ్చిన ఈ దంపతులు నాగోల్లోని సాయినగర్కాలనీ రోడ్డు నం. 2ఏలో ఉంటున్నారు. వీరికి 16 ఏండ్ల కూతురు సింధు, 12 ఏండ్ల కుమారుడు సాయిరాం ఉన్నారు. సింధు ఇంటర్ మొదటి సంవత్సరం, సాయిరాం 9వ తరగతి చదువుతున్నాడు. రాజు లారీని నడుపుతుండగా, సంతోష ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా పని చేస్తుంది. రాజు ఇటీవల మూడు స్కూల్ వ్యాన్లు కొనుగోలు చేసి, నష్టాల్లో కూరుకుపోయాడు. వాటిని అమ్మిన ఆర్థిక ఇబ్బందులు తీరలేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రతి రోజూ మద్యం తాగి భార్యను హింసించాడు. దీనికితోడు భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని.. తరచూ ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. నెల రోజుల కిందటే సంతోష ఓ ప్రైవేటు పాఠశాలలో ఆయాగా చేరింది. కొందరితో ఆమె సన్నిహితంగా ఉంటున్నట్లు రాజుకు అనుమానం వచ్చింది. ఆమెను ఎలాగైనా కడతేర్చాలనుకున్నాడు. పిల్లలు పెద్ద వారు కావడంతో.. ఇంట్లో వారు ఉన్న సమయంలో తన ఆటలు సాగవని గ్రహించాడు. సోమవారం సాయంత్రం సాయినగర్కాలనీలోని తన ఇంటికి చికెన్ తీసుకువచ్చి భార్యతో వండించాడు. వండిన చికెన్ను తీసుకుని పిల్లలు, భార్యతో కలిసి రాత్రి 8 గంటల సమయంలో కర్మాన్ఘాట్, తపోవన్కాలనీలో ఉండే తన సోదరి మంజుల ఇంటికి వెళ్లాడు. విందు ముగించుకున్న అనంతరం పిల్లలను అక్కడే వదిలి.. రాత్రి 11 గంటలకు భార్య సంతోషతో కలిసి సాయినగర్కాలనీకి చేరుకున్నాడు.
సోదరి ఇంటికి వెళ్లిన రాజు మద్యం తాగి.. భోజనం ముగించుకున్న అనంతరం అర్ధరాత్రి సమయంలో భార్యతో కలిసి సాయినగర్కాలనీకి చేరుకున్నాడు. పిల్లలు ఇంట్లో లేకపోవడంతో సంతోషను హతమార్చేందుకు సరైన సమయంగా భావించాడు. మద్యం మత్తులో ఉన్న రాజు ఆదమరిచి నిద్రపోయిన భార్యను కిరాతంగా కత్తి పీటతో గొంతు కోసి, రోకలి బండతో తల, ముఖంపై కొట్టి చంపాడు. అనంతరం అక్కడి నుంచి తన బైక్పై కర్మాన్ఘాట్లో ఉంటున్న సోదరి మంజుల ఇంటికి వెళ్లాడు. అప్పటికీ అందరూ నిద్రలో ఉన్నారు. ఇంటి బయటే రాజు కూర్చుండి పోయాడు. మద్యం మత్తు నుంచి బయటపడిన రాజుకు భయం పట్టుకుంది. భార్యను హతమార్చిన తనను ఎవరూ క్షమించరని గ్రహించిన రాజు.. తన సోదరి నివాసముండే బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మంజుల ఇంటి యజమాని మంగళవారం ఉదయం 6 గంటలకు నిద్రలేచి బయటకు వచ్చాడు. ఇంటి ముందు ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండటాన్ని గమనించాడు. వెంటనే అద్దెకు ఉండే వారిని నిద్రలేపగా.. మృతి చెందిన వ్యక్తి తన సోదరుడిగా మంజుల గుర్తించింది. విషయాన్ని రాజు భార్య సంతోషకు తెలిపేందుకు ఫోన్ చేయగా.. ఆమె ఎంతకీ లిఫ్ట్ చేయలేదు. సాయినగర్కాలనీలోనే నివాసముండే రాజు మేన బావ విష్ణుకు మంజుల ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. రాజు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలిపేందుకు సంతోషకు ఫోన్ చేయగా.. ఆమె లిఫ్ట్ చేయడం లేదని.. వెంటనే అక్కడికి వెళ్లి సంతోషను తీసుకుని రావాలని కోరింది. రాజు ఇంటికి తాళం వేసి ఉండటాన్ని విష్ణు గ్రహించాడు. అనుమానంతో డోర్ లాక్ను కోసి ఇంట్లోకి వెళ్లి చూడగా.. సంతోష రక్తపు మడుగులో పడి ఉంది. విషయాన్ని తెలుసుకుని అక్కడి చేరుకున్న సంతోష బంధువులు రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి బోరున విలపించారు.
సంతోషపై అనుమానం పెంచుకున్నాడని.. ఆమెను తరచూ కొట్టే వాడని కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. అనుమానంతోనే హత్య చేశాడని ఆరోపించారు. నిత్యం మద్యం తాగే అలవాటు ఉన్న రాజు.. మత్తులోనే భార్యను చంపి తప్పించుకునేందుకు దారి లేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంతోష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.