షాద్నగర్, జూన్ 11 : ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమానికి నోచుకోని తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతున్నది. ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా, ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందించాలనే ధృడసంకల్పంతో సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండడంతో పాటు ఆర్థికాభివృద్ధి దిశగా పయనించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. స్వరాష్ట్రంలో వేలాది మంది పేదలకు సంక్షేమ ఫలాలు అందించి అండగా నిలిచింది. షాద్నగర్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో రైతులు రైతు బంధు నిధులను పొందడంతో పాటు వృద్ధులు, వితంతువులు, గీత కార్మికులు, డయాలసిస్ రోగులు, ఒంటరి మహిళలు వేల సంఖ్యలో పెన్షన్లను పొందుతున్నారు. వేలాదిమంది యువతులు కల్యాణలక్ష్మి, షాదీముబార్తో లబ్ధిపొందారు. బాలింతలు కేసీఆర్ కిట్లతో తమ చిన్నారులకు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు గ్రామాల్లో ఆర్థిక వనరులకు బీజం వేశాయి. ఇలా అన్ని వర్గాల ప్రజలు సర్కారు ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలతో సంతోషపడుతున్నారు.
68,027 నివాసాలకు నల్లాలు
మిషన్ భగీరథ పథకం ద్వారా షాద్నగర్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రూ. 433.70 కోట్ల నిధులను వెచ్చించి ఇంటింటికీ మంచినీటిని అందిస్తున్నారు. మొత్తం 68,027 నివాసాలకు 79,527 నల్లాలను ఏర్పాటు చేశారు. రూ. 110.64 కోట్ల నిధులతో 298 నీటి ట్యాంకులు, రూ. 260 కోట్లతో నీటి శుద్ధి కేంద్రాన్ని నిర్మించారు. షాద్నగర్ మున్సిపాలిటీలో 11,500 నల్లాలను బిగించి, 16 ట్యాంకులను ఏర్పాటు చేశారు.
మిషన్ కాకతీయకు రూ. 32.54 కోట్లు
నియోజకవర్గంలోని కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట మండలాల్లో 460 చెరువులు, కుంటలు ఉన్నాయి. సుమారుగా 13,265 ఎకరాల చెరువులకు సాగు ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయ పథకం ద్వారా నాలుగు దశల్లో 215 చెరువులను రూ. 32.54 కోట్ల నిధులతో మరమ్మతులు చేసి వాడుకలోకి తెచ్చారు. షాద్నగర్ మున్సిపాలిటీ శివారులోని బొబ్బిలి చెరువును మినీ ట్యాంక్ బండ్ చేసేందుకు ప్రత్యేక నిధులను కేటాయించి ఆధునీకరించారు.
నాణ్యమైన విద్యుత్తు కోసం రూ. 298.1 కోట్లు
షాద్నగర్ నియోజకవర్గ ప్రజల అవసరాల దృష్ట్యా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 298.1 కోట్ల నిధులను ఖర్చు చేసింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు 220 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలను, మూడు 132 విద్యుత్తు ఉప కేంద్రాలను, 14 ఈహెచ్టీ పవర్ ట్రాన్స్ఫార్మర్లను రూ.60.61 కోట్ల నిధులతో ఏర్పాటుచేశారు. నలబై 33/11 కేవీ ఉప కేంద్రాలను, 440.6 కిలో మీటర్ల మేర నూతన విద్యుత్తు లైన్లను, 2 వేల 130.89 కిలో మీటర్ల మేర 11 కేవీ విద్యుత్తు తీగలను, 73 హై పవర్ ట్రాన్స్ఫార్మర్లు, 686 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను రూ.198.58 కోట్లతో నిర్మించారు. అలాగే రూ.39.36 కోట్ల నిధులను వెచ్చించి వ్యవసాయ బోరుబావుల కోసం నూతనంగా విద్యుత్తు ట్రాన్స్ ఫార్మర్లు, లైన్లను ఏర్పాటు చేశారు.
పారిశ్రామిక ప్రగతి
పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతున్నది. గతంతో పోలిస్తే రాష్ట్ర ఏర్పాటు అనంతరం 300.30 శాతం మేర పెట్టుబడులు పెరిగినట్లు రాష్ట్ర పారిశ్రామిక శాఖ ప్రకటించింది. టీఎస్ ఐ పాస్ ద్వారా షాద్నగర్ ప్రాంతంలో నూతనంగా 462 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోగా 358 పరిశ్రమలు ప్రారంభమయ్యాయి. రూ.6,008 కోట్ల పెట్టుబడులను పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. నూతన పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా 18,717 మంది ఉపాధి పొందుతున్నారు.
రైతు బీమా ద్వారా రూ. 59.8కోట్లు
అకాల మృత్యు బారిన పడిన రైతు కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రైతు బీమా పథకం ద్వారా రూ. 5 లక్షలను మృతిచెందిన రైతు కుటుంబ సభ్యుల ఖాతాల్లో జమ చేసున్నది. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 1,196 మంది రైతు కుటుంబాలకు రూ. 59.8 కోట్ల నిధులను అందించినది.
రూ.709.4 కోట్ల రైతు బంధు
రైతుకు పెట్టుబడి సాయం అందించి ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం ద్వారా షాద్నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.709.4 కోట్ల నగదును స్థానిక రైతులు పొందారు. 2018 నుంచి నేటి వరకు ప్రతి యేటా రెండు పర్యాయాలు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రైతు బంధు నిధులను జమ చేస్తున్నది.
తాత, అవ్వలకు సర్కారు ఆసరా
వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, బీడీ, కల్లుగీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, ఒం టరి మహిళలకు ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెలా ఆసరా పథకం ద్వారా పెన్షన్లను అందజేస్తున్నది. నియోజకవర్గంలో 37,906 మందికి పెన్షన్లు అందుతున్నాయి.
ఆడ పిల్లలకు అండగా
పేదింటి ఆడపిల్లల వివాహాలకు తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులకు గురికావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు నియోజకవర్గంలో 8,014 మంది యువతులు ఈ పథకాల ద్వారా లబ్ధిపొందారు.
కేసీఆర్ కిట్లు
షాద్నగర్ క్లస్టర్ పరిధిలో ఆరు పీహెచ్సీలు, ఒక పీపీ కేంద్రం, ఒక కమ్యూనిటీ దవాఖాన ఉన్నాయి. నందిగామ, కొందుర్గు, చించోడు, కేశంపేట, కొత్తూరు పీహెచ్సీ కేంద్రాల్లో 24 గంటల పాటు వైద్యాన్ని అందిస్తున్నారు. బూర్గుల పీహెచ్సీలో 88 మంది, చించోడులో 807, కేశంపేటలో 338, కొందుర్గులో 1621, కొత్తూరులో 567, నందిగామలో 193, షాద్నగర్ పీపీ యునిట్లో 14, షాద్నగర్ కమ్యూనిటీ దవాఖానలో 7,577 మంది మహిళలు ప్రసవించారు. మొత్తం 11,206 మంది ప్రసవించగా ఇందులో 8 వేల 631 మందికి కేసీఆర్ కిట్లను అందజేశారు. వారి ఖాతాల్లో నగదును జమచేశారు.
ఉచిత గొర్రెల పంపిణీ
గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులను బలోపేతం చేసి వారికి అండగా నిలువాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గొల్లకురుమ లకు ఉచితంగా గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో యూనిట్కు రూ.1.78 లక్షలను వెచ్చించి లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసున్నది. ఫరూఖ్నగర్ మండలంలో 1517 యూని ట్లు, చౌదరిగూడలో 753్ల, కొందుర్గులో 864, కేశంపేటలో 1, 233, కొత్తూరులో 657, నందిగామలో 1, 221 యూనిట్లను మంజూరు చేసింది. ఉచిత గొర్రెల పంపిణీ ద్వారా వందల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి.