హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ సర్కార్ తలపెట్టిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనను ఇప్పటికే తిప్పిపంపినట్టు కేంద్ర ప్రభుత్వం మరోసారి వెల్లడించింది. బనకచర్ల ప్రాజెక్టు అనుమతులకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు రాజ్యసభలో గురువారం పలు ప్రశ్నలు లేవనెత్తనగా, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్సింగ్ సమాధానమిచ్చారు. అంతర్రాష్ట్ర సమస్యల నేపథ్యం లో ఏపీ ప్రతిపాదనను తిప్పి పంపామని తెలిపారు. వాస్తవానికి, గతంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన పీఎఫ్ఆర్, టీవోఆర్ను కేంద్రం ఏపీకి తిప్పి పంపింది. ఇదే విషయాన్ని తాజాగా మరోసారి సమాధానమిచ్చింది.