పరిగి, ఏప్రిల్ 12: ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం లో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల మండలంలోని రూప్ఖాన్పేట, సుల్తాన్పూర్, బసిరెడ్డిపల్లి గ్రామాల్లోని పాఠశాలలు, నర్సరీలను సందర్శించి పరిశీలించారు. రూప్ఖాన్పేట ఉన్నత పాఠశాలకు సంబంధించిన విద్యుత్ సౌకర్యం, తలుపులు, కిటికీలు, ఫర్నిచర్, మరుగుదొడ్లు, భవనం పైకప్పు మరమ్మతులు, తాగునీటి వసతి, పాఠశాలకు రంగులను వేసేందుకు అవసరమైన ఖర్చుల అంచనాలను సిద్ధం చేసి త్వరగా పనులను ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు.
పాఠశాలల్లో విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో పరిశీలించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని, విద్యార్థులను ఆంగ్ల భాషలో తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం ఆమె సుల్తాన్పూర్ పాఠశాలను పరిశీలించి పరిసరాల్లో మురుగునీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులకు సూచించారు. అక్కడే ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి టీచర్ అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు. రూప్ఖాన్పేట, బసిరెడ్డిపల్లి గ్రామాల్లోని నర్సరీలను పరిశీలించి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని గ్రామ కార్యదర్శిపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. సర్పంచ్, ఎంపీవో, కార్యదర్శులు పూర్తి బాధ్యత వహించి ఐదు వేల మొక్కలను సిద్ధం చేయాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అనంతరం గ్రీన్ బడ్జెట్ ఖర్చు, మిగులు నిధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, డీఆర్డీవో కృష్ణన్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ డిప్యూటీ ఇంజినీర్ రాజు, తహసీల్దార్ విద్యాసాగర్రెడ్డి, ఎంపీడీవో శేషగిరిశర్మ, మండల విద్యాధికారి తదితరులు పాల్గొన్నారు.