ఆదిబట్ల, మార్చి 18 : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పొందిన లబ్ధిదారులు తప్పనిసరిగా వాటిలో నివసించాలని, లేకపోతే కేటాయింపులు రద్దు చేస్తామని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో పూర్తయిన, నిర్మాణ దశలో ఉన్న 2బీహెచ్కే ఇండ్ల కేటాయింపుపై అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. మార్చి 31 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించిన కలెక్టర్.. ఇప్పటికే ఇండ్లు పొందినవారు అదే గడువులోపు వాటిలో నివాసం ఉండాలని తెలిపారు.
లేకపోతే ఏప్రిల్ తొలి వారంలోనే ఆ ఇండ్లను రద్దు చేసి కొత్త అర్హులకు కేటాయిస్తామని హెచ్చరించారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎల్-2 జాబితాలోని అర్హులను ఎంపిక చేసి, మంత్రి ఆమోదంతో గెజిటెడ్ అధికారుల ధ్రువీకరణ అనంతరం మంజూరు చేయనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చాంప్లానాయక్, ఆర్డీఓలు అనంతరెడ్డి, జగదీశ్వర్రెడ్డి, వెంకట్రెడ్డి, సరిత, పార్థసింహరెడ్డి, తహసీల్దార్లు, హౌసింగ్ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.