Stray Dogs | సిటీబ్యూరో, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న అంబర్పేట…నిన్న షేక్పేట, రాజేంద్రనగర్, నేడు అద్రాస్పల్లి.. ఇలా వరుసగా వీధి కుక్కల దాడి సంఘటనలతో చిన్నారుల తల్లిదండ్రులు హడలిపోతున్నారు. పిల్లలు మొదలుకొని మహిళలు, వృద్ధుల వరకు ఇలా వీధి కుక్కలు ఎవరినీ వదలడం లేదు. మనిషి కనిపిస్తే చాలు కరిచి పడేస్తున్నాయి. పగబట్టినట్లే ప్రవరిస్తూ కండలు పీకేస్తున్నాయి. నిత్యం ఏదో ఒక చోట జనాలు కుక్క కాటుకు బలవుతున్న పరిస్థితి. నారాయణగూడలోని ఐపీఎం (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)కు కుక్క కాట్లతో సుమారు 200 మంది బాధితులు క్యూ కడుతున్నారంటే.. కుక్కల బెడద ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా..జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణను గాలికి వదిలేసింది. తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నది. ప్రధానంగా వీధి కుక్కలకు ఏబీసీ (యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్) ఆపరేషనే కాకుండా రేబిస్ నివారణ టీకాలను వేయడంలో బల్దియా నిర్లక్ష్యం చేస్తున్నది. ఏబీసీ ఆపరేషన్లు పెంచేందుకు మూడు జోన్లలో జంతు సంరక్షణ కేంద్రాల ఏర్పాటు విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నది.
70 శాతం శునకాలకు ఏబీసీ..
జీహెచ్ఎంసీ పరిధిలో 70 శాతం కుక్కలకు ఏబీసీ ఆపరేషన్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన కుక్కలకు శస్త్రచికిత్స జరగాల్సి ఉందన్నారు. ఈ లెక్కలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలోనూ వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను సంబంధిత అధికారులు చెప్పలేకపోయారు. దీంతో మేయర్తో పాటు అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఏర్పాటైన హైలెవల్ కమిటీ సభ్యులు తీవ్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యాన్ని తూర్పారా పట్టారు. అయినా సంబంధిత వెటర్నరీ విభాగంలో చలనం లేదు. దీంతో రోజురోజుకూ వీధి కుక్కల బెడద తీవ్రరూపం దాల్చుతున్నది. ఒంటరిగా కనిపిస్తే చాలు గుంపులుగా వెంటపడి కరుస్తున్నాయి. వీధుల వెంబడి గుంపులు గుంపులుగా తిరుగుతూ దడ పుట్టిస్తున్నాయి. రాత్రి సమయాల్లో వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలే ఒక వైపు ఎండవేడి, మరోవైపు చెత్త వ్యర్థాల డంపింగ్ వద్ద నిల్వ ఉన్న ఆహారపదార్థాలను తినడం వల్ల కుక్కల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. కనిపించిన వారిపై పిచ్చికోపంతో దాడులకు తెగబడుతున్నాయి. సహజంగా ఎండాకాలంలో తాగునీటి వసతి తక్కువగా ఉండటంతో వేడి తీవ్రతతో వీధికుక్కల్లో ప్రకోపనం (ఇరిటేషన్) అధికంగా ఉంటుంది. వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, రేబిస్ వ్యాక్సిన్లు వేశామని చెబుతున్నారు.. కానీ రోజురోజుకూ కుక్కల సంతతి పెరుగుతుండడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది.
18 నెలల పాపపై వీధి కుక్కల దాడి
వీధి కుక్కల దాడిలో 18 నెలల పాప తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన మూడుచింతలపల్లి మండలం ఆద్రాస్పల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన కరుణాకర్ కూతురు రుష్మిత ఆడుకుంటుండగా వీధి కుక్కలు చుట్టు ముట్టి దాడి చేశాయి. గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులు కుక్కలను చెదరగొట్టి పాపను తొలుత నీలోఫర్ ఆస్పత్రికి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మొత్తం వీధికుక్కలు స్టెరిలైజేషన్ స్టెరిలైజేషన్ చేయని కుక్కల సంఖ్య