రంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ) ;హాస్టళ్ల డైట్ చార్జీలను పెంచుతూ తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు అందించింది. స్వరాష్ట్రంలో సకల సౌకర్యాలు కల్పిస్తూ కార్పొరేట్ స్థాయిలో విద్యనందిస్తున్న విషయం తెలిసిందే. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలను పెంచాలని మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. అంతేకాకుండా పెంచిన చార్జీలు ఈ నెల నుంచే వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల పరిధిలోని వసతి గృహాలు, గురుకులాలతో పాటు మాడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లోని విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందనున్నది. దీంతో వికారాబాద్ జిల్లాలో 28851 మంది, రంగారెడ్డి జిల్లాలో 39,234 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విద్యార్థులకు చెల్లిస్తున్న డైట్, కాస్మోటిక్ చార్జీలను 26 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చార్జీలను పెంచాలని మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. వసతి గృహాలు, గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఇప్పటికే సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, ఇంగ్లిష్ మీడియంలో విద్య అందిస్తున్నది. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థిపై భోజనం కోసం రోజూ ఖర్చు చేస్తున్న ధరలను పెంచి మరింత నాణ్యమైన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో వికారాబాద్ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల పరిధిలోని వసతి గృహాలు, గురుకుల పాఠశాలలతో పాటు మాడల్ స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో చదువుకుంటున్న 28851 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెంపు ఇలా..
ప్రస్తుతం వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో 3-7 తరగతుల విద్యార్థులకు రూ.950, 8-10 తరగతులకు 1100, ఇంటర్ నుంచి పీజీ వరకు 1500 చెల్లిస్తున్నారు. ప్రభుత్వం వీటిని 26 శాతం పెంచడంతో 3-7 తరగతుల వారికి రూ.1200, 8-10 తరగతుల వారికి 1400, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు రూ.1875 డైట్ చార్జీలు పెరుగనున్నాయి. కాస్మోటిక్ చార్జీలు కూడా ప్రస్తుతం రూ.55 నుంచి 75 వరకు చెల్లిస్తుండగా ఇవి కూడా 26 శాతం పెరుగనున్నాయి.
విద్యార్థుల ఆసక్తి
వసతి గృహాల్లో విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం ఐదు సంవత్సరాలకు ఒకసారి పెంచుతుంది. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 10 శాతం మేరకు డైట్ చార్జీలను పెంచగా తెలంగాణ వచ్చిన తరువాత సీఎం కేసీఆర్ వాటిని 2016-17లో 25 శాతం పెంచారు. మళ్లీ ఇప్పుడు డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను 26 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వసతి గృహాలు, గురుకులాల్లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు చదువుకుంటున్నారు. వారికి ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్నది. అందువల్లే కొన్ని సంవత్సరాల నుంచి వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో ప్రవేశాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.
జిల్లాలో 28851 మంది విద్యార్థులకు లబ్ధి
జిల్లాలో అన్ని శాఖల పరిధిలో కలిపి 65 వసతి గృహాలు, 31 గురుకుల పాఠశాలలు, ఏడు ఆశ్రమ పాఠశాలలు, 18 కేజీబీవీలు, 6 మాడల్ స్కూళ్లు ఉండగా.. వీటిలో 28851 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఎస్సీ వసతి గృహాలు 25 ఉండగా వాటిలో 2050 మంది, ఒక డిగ్రీ కళాశాలలో, 9 గురుకులాల్లో కలిపి 6480 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడు ఆశ్రమ పాఠశాలలు, ఐదు వసతి గృహాలు, మూడు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు, ఒక జూనియర్ కళాశాల, ఐదు గురుకుల పాఠశాలల్లో 4907 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 30 వసతి గృహాలు, 12 గురుకుల పాఠశాలల్లో 7600 మంది విద్యార్థులు, మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆరు గురుకుల పాఠశాలల్లో 2400 మంది విద్యార్థులు, 18 కేజీబీవీలలో 4824 మంది, 6 మాడల్ స్కూళ్లలో 590 మంది చదువుకుంటున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు..
రంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ డైట్ చార్జీలను 26 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో 39,234 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు విద్యార్థులతోపాటు పలు విద్యార్థి సంఘాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
జిల్లాలోని 34 షెడ్యూల్డ్ కులాలకు చెందిన పాఠశాల వసతి గృహాలు, 14 కళాశాల వసతి గృహాలున్నాయి. వీటిల్లో 3,722 మంది చదువుకుంటున్నారు. 18 బీసీ పాఠశాల వసతి గృహాలు, 21 కళాశాల వసతి గృహాల్లో 3,900 మంది విద్యనభ్యసిస్తున్నారు. అలాగే.. 3 గిరిజన ఆశమ్ర పాఠశాలలు, 4 పాఠశాల వసతి గృహాలు, 7 కాలేజి వసతి గృహాల్లో 2,452 మంది చదువుకుంటున్నారు. 9 మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 3,760 మంది, 9 జూనియర్ కళాశాలల్లో 5,200 మంది చదువుకుంటున్నారు. వీరేకాకుండా.. జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కస్తూర్బాగాంధీ, ఆదర్శ పాఠశాలలు కలిపి మొత్తం 70 వరకు గురుకులాల్లో 20,200 మంది విద్యనభ్యసిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయాలు, మాడల్ పాఠశాలలను కూడా పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ప్రస్తుత చార్జీలను అమలు చేస్తున్నది.
డైట్ చార్జీలు పెంచడం సంతోషం
– మౌనిక, 10వ తరగతి, కేజీబీవీ చెట్టుపల్లితండా, దుద్యాల మండలం
వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు చెల్లిస్తున్న డైట్ చార్జీలను ప్రభుత్వం పెంచడం ఆనందంగా ఉంది. కేజీబీవీల్లో ప్రతిరోజూ ప్రభుత్వం నాణ్యమైన భోజనం పెడుతున్నది. పెరిగిన చార్జీలతో మరింత నాణ్యమైన భోజనం అందే అవకాశం ఉంది. వసతి గృహాల విద్యార్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు.
సీఎం సార్కు కృతజ్ఞతలు
– అనూష, 10వ తరగతి, కేజీబీవీ చెట్టుపల్లితండా, దుద్యాల మండలం
డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచినందుకు సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు. కేజీబీవీల్లో చదువుకుంటున్న విద్యార్థినులకు భోజనం, వసతి సౌకర్యాల విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేవు. నాణ్యమైన భోజనంతో పాటు మంచి విద్యను అందిస్తున్నారు. పేద విద్యార్థులు బాగా చదువుకుని పైకి రావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది.
చార్జీల పెంపుతో మరింత మంచి భోజనం
– నందిని, 9వ తరగతి, బొట్లవానితండా ఆశ్రమ పాఠశాల, బొంరాస్పేట మండలం
డైట్ చార్జీల పెంపుతో విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనమందుతుంది. ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల్లో ఇప్పటికే నాణ్యమైన పోషకాహారం పెడుతున్నారు. కాస్మోటిక్ చార్జీలు కూడా పెంచడంతో మాకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు.