యాసంగి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర సర్కార్ రైతులకు తీపికబురందించింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినా కేంద్రం ముందుకు రాలేదు. దీంతో అన్నదాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని చివరి గింజవరకూ కొంటామని ప్రకటించారు. తొందరపడి తక్కువ ధరకు వడ్లు అమ్ముకోకూడదని, క్వింటాలుకు రూ.1960 మద్దతు ధర చెల్లిస్తామని భరోసా నింపారు. రాష్ట్ర సర్కార్ నిర్ణయంపై ఉమ్మడి జిల్లా అన్నదాతలు మురిసిపోతున్నారు. కేంద్రం దిగిరాకపోయినా రైతు సంక్షేమాన్ని కోరి ధాన్యం సేకరిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ప్రజా సంఘాల నేతలు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల పక్షాన పోరాడటంతో పాటు ధాన్యం కొనుగోలు చేసి ఆదుకుంటామని చెప్పిన సీఎం కేసీఆర్కు కర్షక నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, యాసంగికి సంబంధించి రంగారెడ్డి జిల్లాలో 47,201 ఎకరాల్లో వరి సాగవ్వగా.. 1.08లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 45,690 ఎకరాలకు 1.18లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు.
-రంగారెడ్డి, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ)
పరిగి, ఏప్రిల్ 12 : యాసంగిలో రైతులు పండించిన వడ్లు కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం వల్ల మరోసారి రైతులకు భరోసా కల్పించారు. వడ్ల కొనుగోలుపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ ధరకు వడ్లను అమ్మవద్దని, క్వింటాలుకు రూ.1960కి కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడంతో రైతుల్లో మరింత మనోధైర్యం పెరిగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో యాసంగిలో 29,200 మంది రైతులు సుమారు 45,690 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో సన్న, దొడ్డు రకాలు ఉన్నాయి. జిల్లాలో 12వేల పైచిలుకు ఎకరాల్లో సన్న రకాలు, 33వేల పైచిలుకు ఎకరాల్లో దొడ్డు రకాల వరి సాగైంది. దీంతో సన్న రకాలు 15వేల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలు లక్షా 3వేల మెట్రిక్ టన్నులు, మొత్తం లక్షా 18వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా పరిధిలో ఏప్రిల్ మూడో వారం నుంచి వరి కోతలు ప్రారంభమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో కోతల కంటే ముందే 100కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. యాసంగి వడ్లు కొనుగోలు చేయమని కేంద్రం చెప్పినందున వరి వద్దని సీఎం సూచించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరి వేయండి కేంద్రంతో కొనుగోలు చేయిస్తామని ప్రకటించి, తీరా పంట చేతికి వచ్చిన సమయంలో కేంద్రం ముఖం చాటేయడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారు. రైతులకు న్యాయం చేయాలంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆందోళనలు చేయడంతోపాటు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టి వడ్లు కొనుగోలుపై కేంద్రానికి 24 గంటలు డెడ్లైన్ విధించారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో మంగళవారం ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి రైతులు నష్టపోకుండా ఉండేందుకు వడ్ల కొనుగోలుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో రైతు కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. మరోసారి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా తేలిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి రెండు మూడు రోజుల్లోనే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై పూర్తిస్థాయిలో స్పష్టత రానున్నది. జిల్లావ్యాప్తంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నది తేలనున్నది. ఏదిఏమైనా రాష్ట్ర ప్రభుత్వం నష్టం భరించి వడ్లను కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతులకు మేలు చేకూరనున్నది.
రంగారెడ్డి, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్లో వరి పండించిన రైతులను ఆదుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించాలని మంగళవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రానికి వ్యతిరేకంగా గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన, జాతీయ రహదారుల దిగ్బంధం, రాస్తారోకో, గ్రామాల్లో రైతుల ఇండ్లపై నల్లజెండాల ప్రదర్శన, ఢిల్లీలో ధర్నా తదితర కార్యక్రమాలను చేపట్టినప్పటికీ కేంద్రం స్పందించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే రైతు నుంచి వడ్లను సేకరించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చి మరోసారి రైతు ప్రభుత్వంగా నిలిచింది. అయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే గ్రామాల్లో అధిక మొత్తంలో వరి సాగవుతుందనే వివరాలను బట్టి ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినప్పటికీ కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు. అయితే రైతులెవరూ తక్కువ ధరకు ఇతరులకు విక్రయించకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు వడ్లను రైతుల నుంచి క్వింటాలుకు రూ.1960 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయనున్నారు. రైతుల ఖాతాల్లోనే డబ్బులను జమ చేయనున్నారు. అయితే జిల్లాలో 47,201 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, 1.08 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు.
వడ్లు కొంటామనడం సంతోషకరం..
యాసంగి వడ్లను రాష్ట్ర ప్రభుత్వం కొంటామని చెప్పడం సంతోషంగా ఉన్నది. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఇబ్బందులు పెట్టిన కేంద్రానికి రైతులు తగిన బుద్ధి చెబుతారు. రైతుబిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలిచారు.
– పి.కుమార్యాదవ్, కుమ్మరిగూడ(షాబాద్)
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి..
రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ మరోసారి నిరూపించుకున్నారు. రైతులు ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే వడ్లు కొనేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. గిట్టుబాటు ధర ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. – సూద యాదయ్య,
కమిటీ డైరెక్టర్ షాబాద్
రైతులకు ఎంతో మేలు ..
యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా పట్టించుకోలేదు. రైతుబిడ్డగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో అన్నదాతలకు ఎంతో మేలు జరుగుతుంది. బీజేపీకి రైతులు తగిన గుణపాఠం చెబుతారు.
– శేఖర్రెడ్డి, గొల్లూరుగూడ (షాబాద్)
రైతు కష్టమెరిగిన ముఖ్యమంత్రి..
రైతుల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలుసు కాబట్టే యాసంగి వడ్లు మేమే కొనుగోలు చేస్తామని భరోసా కల్పించారు. తెలంగాణ రైతులకు అండగా నిలుస్తున్న సీఎంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రైతుల పక్షాన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కేంద్ర వైఖరికి నిరసన తెలిపినా పట్టించుకోలేదు.
– గొల్ల బుగ్గప్ప, పర్సాపూర్, కొడంగల్
వడ్లు కొంటామన్న సీఎంకు ధన్యవాదాలు..
యాసంగి వడ్లు ఎవరికి అమ్ముకోవాలో ఆందోళన చెందుతున్న సమయంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పడం ఆనందంగా ఉన్నది. సీఎం ధర్నా చేసినప్పటికీ మోదీ ప్రభుత్వం చలించకపోవడం ఆయనకు రైతులపై ఏ మేరకు బాధ్యత ఉన్నదో ఇట్టే అర్థమవుతున్నది.
– మొగులయ్య, రైతు, పర్సాపూర్, కొడంగల్
రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్..
యాసంగి వరి ధాన్యాన్ని కొంటామని ప్రకటించిన సీఎం కేసీఆర్ రైతుల పాలిట దేవుడయ్యారు. రైతుల బాగోగులను పట్టించుకోకపోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదు. రైతు వ్యతిరేక విధానాలను అవలంబించడం బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు. రాబోవు రోజుల్లో బీజేపీకి గుణపాఠం తప్పదు.
– ఎల్లా రెడ్డి, ఎన్కతల, మోమిన్పేట మండలం
ధాన్యం అమ్ముకునే తిప్పలు తప్పాయి..
కష్టపడి పండించిన వడ్లను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో చాలా దిగులు చేందాం. సీఎం కేసీఆర్ ప్రతి గింజనూ కొంటామని ప్రకటించి రైతుల గుండెల్లో ధైర్యం నింపారు. కేంద్రం ప్రభుత్వం చేతులెత్తేసినా.. రాష్ట్ర ప్రభుత్వం రైతును ఆదుకుంటున్నది.
– బోయిని అంజయ్య, మోమిన్పేట మండలం
రైతుల కోసం నిలబడిన సీఎం కేసీఆర్..
కేంద్రం ప్రభుత్వం వరి ధాన్య్నా కొనుగోలు చేయబోమని చేతులెత్తేస్తే రైతుల కోసం సీఎం కేసీఆర్ నిలబడ్డారు. ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సంతోషమైన విషయం. డబ్బులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయనుండడం హర్షణీయం.
– కృష్ణ, మొరంగపల్లి, మోమిన్పేట మండలం
రైతు ప్రభుత్వమని నిరూపించారు..
యాసంగి వరి ధాన్యాన్ని కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటించి ఇది రైతు ప్రభుత్వమని నిరూపించారు. కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోయినా తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. రాబోవు రోజుల్లో బీజేపీకి రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
– రావుగారి వెంకట్ రెడ్డి, సర్పంచుల సంఘం నవాబుపేట మండల అధ్యక్షుడు
ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు..
ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామనడం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడటంతో ఇబ్బందులు తప్పాయి. లేదంటే మధ్య దళారులు తక్కువ ధరకే వడ్లు కొనేవారు. దీంతో రైతులు ఎంతో నష్టపోయేవారు.
– హరీశ్రావు, మోమిన్కలాన్,ధారూరు మండలం