కొడంగల్, జూన్ 3 : సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణలో సంక్షేమ యుగం కొనసాగుతున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గపరిధిలోని కొడంగల్, బొంరాస్పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, మార్కెట్ యార్డ్ నూతన పాలక మండలి ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రైతులు నేడు ఆత్మాభిమానంతో వ్యవసాయం చేసుకొంటున్నారని, పంట సాగుకు రైతుబంధు కింద పంటపెట్టుబడి సాయం అందిస్తున్నదన్నారు.
పండిన పంటను అమ్ముకోవడానికి భరోసాను కల్పిస్తూ.. ప్రభుత్వ ఆధ్వర్యంలో గిట్టుబాటు ధర కల్పిస్తూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు కుటుంబానికి అండగా నిలుస్తున్నదన్నారు. రైతుబీమా వంటి ఎన్నో అద్భుత పథకాలతో రైతు అభ్యున్నతికి పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ను అందించేందుకు ప్రభుత్వం రూ.32వేల కోట్లను ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు బీమా సౌకర్యాలను కల్పించేందుకు ప్రతి నెల రూ.1400 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.
దళారులతో ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు, రైతుబీమా, రైతు బంధు వంటి పథకాలకు సంబంధించిన డబ్బులను నేరుగా రైతు ఖాతాలో జమచేస్తున్నట్లు గుర్తు చేశారు. గతంలో 1000ఫీట్లకు పైగా బోర్లు వేయాల్సి వచ్చేదని, మిషన్ కాకతీయ పథకంతో చెరువుల్లో మరమ్మతులు, పూడికతీతలు చేపట్టడం వల్ల భూగర్భ జలాలు పైకి వచ్చాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు దాదాపుగా 60శాతం పనులు పూర్తి కావడం జరిగిందని, మరో 40శాతం పనులను త్వరగా పూర్తి చేసే దిశగా సీఎం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నేడు మిషన్ భగీరథ పథకంతో కృష్ణాజలాలను ఇంటింటికీ సరఫరా అవుతున్నాయన్నారు. కొడంగల్ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని ఎప్పుడూ కలిసినా కొడంగల్ అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కొడంగల్ నియోకవర్గానికి ఇప్పటి వరకు రూ.1138కోట్లు మంజూరైనట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ కొత్త ఆలోచనలతో నేడు తెలంగాణ అన్నింటా అభివృద్ధిని సాధించి దేశంలోనే నెం.1 స్థానాన్ని సాధించినట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. ఒక్క కొడంగల్లకు ఇప్పటి వరకు రూ.1138కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు.
బొంరాస్పేట మండలంలో రేగడిమైలారంలో రూ.22లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం ప్రారంభించగా, కొడంగల్లోని ప్రభుత్వ దవాఖానలో రూ. 50లక్షలతో వెయిటింగ్హాల్ షెడ్ నిర్మాణానికి భూమిపూజ, రూ.కోటీ50లక్షల వ్యయంతో అంబేద్కర్ విజ్ఞాన భవన్లకు శంకుస్థాపన, రూ.13లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖాన, రూ.72లక్షలతో నిర్మించిన నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రైతు దినోత్సవం సందర్భంగా ప్రతి రైతు వేదికలో పండుగ వాతావరణం నెలకొందని, రైతుల పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంతోషాన్ని పంచుకోవడం జరిగిందన్నారు. రైతులు సీఎం కేసీఆర్కు పూర్తి మద్దతును తెలుపుతామని ముక్తకంఠంతో పేర్కొన్నారు. కార్యక్రమంలో పాలమూరు జిల్లా ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుశీల్కుమార్గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పాల్వన్కుమార్, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్రెడ్డి, గ్రంథాలయ సెక్రటరీ సురేశ్, నారాయణపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ, పీఏసీఎస్ అధ్యక్షుడు కె.శివకుమార్, విష్ణువర్ధన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుజాతారెడ్డి, వైస్ చైర్మన్ వాణిశ్రీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ల్లు, బీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్కుమార్రెడ్డి పాలొన్నారు.
పరిగి టౌన్ : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి శనివారం కొడంగల్ పర్యటనకు వెళ్తూ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని కలిసి వారి కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో పాటు ఆయన తల్లి గిరిజారెడ్డిని కలిసి ఆత్మీయంగా పలకరించారు.
కొడంగల్ మార్కెట్ కమిటీకి సంబంధంచిన కొత్త పాలక మండలి ఏర్పాటులో భాగంగా నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ , వైస్ చైర్మన్తో పాటు డైరెక్టర్ల ప్రమాణస్వీకారం మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు పట్నం నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. చైర్మన్గా దౌల్తాబాద్ మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ బాయిరెడ్డి మోహన్రెడ్డి సతీమణి సుజాతారెడ్డి, వైస్ చైర్మన్గా కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ మధుసూదన్రావుయాదవ్ సతీమణి వాణిశ్రీ, పాలక మండల సభ్యులుగా కె.మధుసూదన్రెడ్డి, విజయ్కుమార్, రామకృష్ణారెడ్డి, ఎన్.భానుప్రకాష్, ఎం.నాగరాణి, మహ్మద్ ఫరీద్, సోంనాథ్, బి.అరుణ్కుమార్, లచ్చప్ప, రాఘపురం వీరభద్రప్ప, ఎన్.ఎం. శ్రీదేవి, కౌసల్యలు ప్రమాణస్వీకారం చేశారు. కొత్త పాలక మండలి సభ్యులకు మంత్రితో పాటు ఎమ్మెల్యే ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.